* ‘రెడీ టూ వర్క్ ఫోర్స్’ గా తెలంగాణ యువత
* ఆవిష్కరణలకు ఊతమిచ్చే ఇన్నోవేషన్ ఎకో సిస్టం
* ‘ది హార్ట్ ఫోర్డ్ ఇండియా టెక్నాలజీ సెంటర్’ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబు
ఐటీ మాత్రమే కాకుండా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్, ఏరో స్పేస్, మాన్యుఫ్యాక్చరింగ్, ఫిన్ టెక్, డీప్ టెక్, రిటైల్ తదితర రంగాల్లోనూ హైదరాబాద్ ను ‘గ్లోబల్ వాల్యూ క్రియేషన్ హబ్’గా మార్చేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పునరుద్ఘాటించారు.
అందుకోసం… పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తెలంగాణ యువతను ‘రెడీ టూ వర్క్ ఫోర్స్’గా తీర్చిదిద్దడం, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించే గ్లోబల్ ఇన్నోవేషన్ ఎకోసిస్టం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. సోమవారం నానక్ రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో అంతర్జాతీయ బీమా దిగ్గజం హార్ట్ ఫోర్డ్ 1.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 1200 మంది ఉద్యోగుల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన ‘ది హార్ట్ ఫోర్డ్ ఇండియా టెక్నాలజీ సెంటర్’ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ… అంతర్జాతీయ విస్తరణలో భాగంగా రెండు శతాబ్దాల ఘన చరిత్ర కలిగిన హార్డ్ ఫోర్ట్ హైదరాబాద్ ను ఎంపిక చేసుకోవడం ఇక్కడి ప్రతిభకు, డిజిటల్ ఇంజనీరింగ్లో మన నాయకత్వానికి దక్కిన గుర్తింపుగా భావిస్తున్నామన్నారు. ఈ కేంద్రం ద్వారా ఏఐ, రిస్క్ ఇంటెలిజెన్స్తో కూడిన ఆధునిక బీమా రంగంలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మరింత పెరుగుతుందన్నారు. నగరంలో ఇప్పటికే 400కు పైగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు(జీసీసీ) సేవలు అందిస్తున్నాయన్నారు.
ఈ జాబితాలో మారియట్, మెక్డొనాల్డ్స్, యూబీఎస్, డాజన్, వాన్గార్డ్, ఎలీ లిల్లీ, హెచ్ సీఏ హెల్త్ కేర్, సిటిజన్స్ బ్యాంక్ లాంటి దిగ్గజ సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయన్నారు. వీటిని కేవలం బ్యాక్ ఎండ్ ఆపరేషన్స్కు మాత్రమే పరిమితం చేయకుండా… గ్లోబల్ వాల్యూ సెంటర్లుగా మార్చేలా అవసరమైన వ్యూహాత్మక ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నామన్నారు. పారదర్శక పాలన, సమర్థవంతమైన నాయకత్వం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో సంస్కరణలు, ఆధునిక డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి తదితర అంశాలు హార్ట్ ఫోర్డ్ లాంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు తెలంగాణను తమ గమ్యస్థానంగా ఎంచుకునేందుకు దోహదపడుతున్నాయన్నారు.
తాజాగా ప్రారంభించిన ఈ కార్యాలయం యూఎస్ లోని హార్ట్ ఫోర్డ్, చికాగో, షార్లెట్, కొలంబస్ లో ఉన్న టెక్నాలజీ కేంద్రాలకు అనుబంధంగా పని చేస్తూ… ఏఐ, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, అడ్వాన్డ్స్ టెక్నాలజీ డెవలెప్ మెంట్ పై దృష్టి సారిస్తూ ‘ఇంజనీరింగ్ ఎక్స్ లెన్స్ హబ్ ’ గా పని చేస్తుందని మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. కార్యక్రమంలో హార్ట్ ఫోర్డ్ ప్రెసిడెంట్ మోరిస్ టూకర్, చీఫ్ మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్స్ ఆఫీసర్ క్లైర్ బర్న్స్, సీఐవో శేఖర్ పన్నాల, హార్ట్ ఫోర్డ్ ఇండియా ఎండీ అండ్ హెడ్ సూర్య తమ్మిరాజు, సీటీవో ఇమ్రాన్ మాలిక్ తదితరులు పాల్గొన్నారు.