– బరిగేసి కొట్లాడే సమాజం ఎందుకు నిర్వీర్యం అవుతుంది?
– చట్టం కూడా ఉన్నవాడి చుట్టంలా మారింది
– కింద పొగపెడితే అందరూ వస్తారు
– బీసీలలో ఐక్యత పెరగాలి… జాతిని కదిలించాలి.
– అదరినీ కలుపుకొని పోయి సమాజాన్ని నడిపించాలి
– ఒకణ్ణి గద్దె దింపి ఇంకొకణ్ణి ఎక్కించడానికి పనికి వస్తున్నాయి తప్ప మన ఆశయం నెరవేరడం లేదు
– ఇంత జనాభా ఉన్న బీసీలు ఒకనికి దరఖాస్తు ఇచ్చుడు ఎందుకు ?
– బిచ్చగాళ్ల లెక్క అడుక్కోవడం ఎందుకు ?
– కేంద్రంలో కూడా ఒక బీసీ మంత్రిత్వ శాఖ రావాలి
– బీసీల ఉద్యమానికి నా పూర్తి సంఘీభావం
– ఎంపీ ఈటల రాజేందర్
హైదరాబాద్: బీసీల బడ్జెట్ లెక్కలు అన్నీ చిరంజీవి చెప్పారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా మన జీవితాలు మాత్రం మారడం లేదు. కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తేనే సంబరపడ్డాం. పూలువేశాం, పాలాభిషేకాలు చేశాం. కానీ పాలు వేస్ట్ అయ్యాయి. పూలు వేస్ట్ అయ్యాయి. బడ్జెట్ కేటాయించగానే హారతులు పట్టాము. కానీ కార్పొరేషన్లకు ఐదు పైసలు కూడా ఖర్చు చేయలేదు. నోరులేని కులాలకు ఖర్చు చేయకుండా మోసం చేస్తున్నారు. సంక్షేమం చేయకుండా మొండి చెయ్యి చూపించారు.
మన ఉద్యమాలు, మనం చేస్తున్న సామాజిక చైతన్యం ఒకణ్ణి గద్దె దింపి ఇంకొకణ్ణి ఎక్కించడానికి పనికి వస్తున్నాయి తప్ప మన ఆశయం నెరవేరడం లేదు. అంతిమ లక్ష్యం చేరుకోవడం లేదు. ఇంత జనాభా ఉన్న బీసీలు, ఒకనికి దరఖాస్తు ఇచ్చుడు ఎందుకు ? బిచ్చగాళ్ల లెక్క అడుక్కోవడం ఎందుకు ? నీ రాజ్యం నువ్వు ఏలుకో అనే నినాదం వచ్చింది. అందుకోసం ప్రయత్నం మొదలైంది. మనకు మద్దతుగా ఆయన రాకపాయే.. ఈయన రాకపాయే అని అనుకుంటున్నారు.కింద పొగపెడితే అందరూ వస్తారు.
శశభిషలు లేవు. లెఫ్ట్ ఉన్నా, రైట్ ఉన్నా కొట్లాట మాత్రం ఆగదు. న్యాయం ధర్మం ప్రజాస్వామ్యం మన వాటా కోసం బరిగీసి కొట్లాడే బిడ్డలకు నా సంపూర్ణ మద్దతు ఎప్పడు ఉంటుంది. రాజ్యం ఎవరి చేతిలో ఉంటే వాడికే ఊడిగం చేస్తుందని అంబేద్కర్ చెప్పారు. వడ్డించేవాడు మనవాడు కాకపోతే ఎక్కడ కూర్చున్నా ఏమీ రాదు. ప్రభుత్వం ఉన్నది పేదలకోసం. సమస్త సంపద సమస్త ప్రజల అవసరాలు తీర్చాలనేది రాజ్యాంగ స్ఫూర్తి. కానీ అది అమలుకావడం లేదు. అంబేద్కర్ కలలు నిజం కాలేదు.
మనం ఎవరికీ వ్యతిరేకం కాదు. రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా పాలన చేస్తున్న వారి మీదనే మన వ్యతిరేకత. మన ఉద్యమంలో మాట్లాడే భాష, వ్యవహరిస్తున్న తీరువల్ల మనకు జరిగే ప్రయోజనం ఎంతో తెలియదు కానీ.. మన వల్ల వాళ్లు ఐక్యం అవుతున్నారు. సమాజాన్ని మెప్పించే పని జరగాలి తప్ప, సమాజం నుండి వేరుపడేలా మన భాష ఉండకూడదు. ఈ కాలంలో కూడా కుమ్మెరలో జరిగిన సంఘటన సభ్యసమాజాన్ని తలదించుకొనేలా చేస్తున్నాయి. ఇలాంటివి ప్రజాస్వామ్యానికే దురదృష్టకరం.
ఖమ్మంలో పేదల ఇల్లు కూలగొట్టారు. ఒక తరం కష్టపడి కట్టుకున్న ఇళ్లపై బోల్డోజర్ నడిపారు.
శత్రుదేశాల మీద యుద్ధం చేసినట్టు పేద ప్రజలమీద దాడి చేస్తున్నారు. దీన్ని అడ్డుకునే శక్తి ప్రజలకు మాత్రమే ఉంది. ఆరు గ్యారెంటీలు 420 పనులు ఏవీ అమలు కావడం లేదు.
ఇచ్చిన హామీలు అమలుచేయాలంటే సంవత్సరానికి లక్ష కోట్లు అదనంగా కావాలి ఎలా ఇస్తావు అని రేవంత్ రెడ్డిని అడిగితే.. ఈటల రాజేందర్ కే తెలివి ఉందా? ఒక తునక అమ్మితే కోట్ల రూపాయలు వస్తాయి అన్నాడు.. మరి ఏమైంది రేవంత్ రెడ్డి అని అడుగుతున్న.
తునక అమ్మితే సంక్షేమ పథకాలు అన్నీ అమలవుతాయి అన్నావు కదా రేవంత్ రెడ్డి.. మరి ఆ తునకలు ఎందుకు కాపాడడం లేదు.
ఎల్లమ్మబండలో 300 ఎకరాల్లో 150 ఎకరాలు అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేదలకు పంచాడు. అదే సర్వే నంబర్ లో ఉన్న అదే ప్రభుత్వ భూమి 150 ఎకరాలు ఎలా ప్రైవేట్ భూమి అవుతుంది ? సుప్రీంకోర్టును మేనేజ్ చేసుకొని గద్దల్లా తన్నుకుపోతుంటే మీరేం చేస్తున్నట్లు. 7 వేల కోట్ల భూమి పరాధీనం అయ్యింది. ఆ 7 వేల కోట్లు ఉంటే మన పిల్లల ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు అన్నీ తీరేవి కావా రేవంత్ రెడ్డి? వారి ఆత్మహత్యలు ఆగేవి కాదా? హాస్టల్ పిల్లల బువ్వ కోసం పనికి వస్తది అనుకున్న కానీ భూ బకాసురుల చేతికి, దొంగల చేతికి పోయింది.
గాజులరామారంలో హైడ్రా కంకర మిషన్లలో పనిచేసిన పేదల ఇళ్లు కూలగొట్టింది తప్ప పెద్దల కబ్జాలో ఉన్న భూమి వైపు కన్నెత్తి కూడా చూడలేదు. పైగా 15 వేల కోట్ల భూమి కాపాడాము అని ప్రకటించుకోవడం సిగ్గు చేటు.
మాజీ ఐఏఎస్ అధికారి చిరంజీవులు ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద బడ్జెట్లో బీసీలకు జరుగుతున్న అన్యాయంపై జరిగిన నిరాహార దీక్ష కార్యక్రమంలో మాజీ స్పీకర్ మధుసూదన చారి, బాలరాజు గౌడ్, దుర్గయ్య, వెంకన్న, ఎలికట్టే విజయ్, బైరి శేఖర్, నారాయణ గౌడ్, అబ్బాస్,
వెంకన్న, రమణ, శ్రీకాంత్, లింగేష్ యాదవ్, లలిత, మల్లిఖార్జున్ తదితరులు పాల్గొన్నారు.