– ఆ సాంప్రదాయన్నీ కొనసాగించేందుకు కాంగ్రెస్-డి.యం.కే ను గెలిపించండి
– విభజన రాజకీయాలకు చెక్ పెట్టేందుకు తమిళులు ఉద్యుక్తులు కావాలి
– తమిళ ఓటర్లకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపు
శివకాశి: లౌకికవాదానికి తమిళనాడు పెట్టని కోట అని తెలంగాణా రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అటువంటి లౌకికవాదం కొనసాగాలి అంటే ఈ ఎన్నికలలో డి.యం.కే-కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను బలపరచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆయన ఉద్బోధించారు.
తమిళనాడు ఎన్నికల పరిశీలకుడిగా నియమితులైన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గడిచిన మూడు రోజులుగా తమిళనాడు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ విస్తృతంగా పర్యటిస్తున్న విషయం విదితమే. అందులో భాగంగా బుధవారం రోజున కోయంబత్తూరు సమీపంలోనీ సింగనల్లూర్ నుండి కవుండంపాలెం వరకు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన శివకాశికి చేరుకుని అక్కడ జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జరిగిన ఎన్నికల ప్రచారసభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటిస్తూ తమిళనాడులో విభజన రాజకీయాలకు చోటు లేదని స్పష్టం చేశారు.బి.జె.పి కి ఇక్కడ ప్రవేశం కుడా ఉండొద్దని ఆయన ఓటర్లకు ఉద్బోధించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 21 పార్టీలతో ఏర్పడిన సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయెన్స్ ఢిల్లీ నుండి గ్రామీణ స్థాయి వరకు విజయవంతంగా కొనసాగుతుందన్నారు.
భవిష్యత్ ప్రధాని రాహుల్ గాంధీ నాయకత్వం కోసం దేశ ప్రజలు ఎదురుచూస్తున్నారని ప్రజల ఆకాంక్ష ప్రతిబింపచేసేలా ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. శివకాశి నుండి డి.యం.కే బలపర్చిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీ. అశోకన్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు.
రాజకీయాల కోసం కూటమి ఏర్పడలేదని ప్రజా సంక్షేమం, అభివృద్ధితో దేశాన్ని ముందుకు నడిపించేందుకు కూటమి ఏర్పడిందని ఆయన తేల్చిచెప్పారు. మహిళా సాధికారతకు కూటమి కట్టుబడి పనిచేస్తుందని ఆయన పునరుద్ఘాటించారు.
ముఖ్యమంత్రి స్టాలిన్ పంజతిరును ఆయన ప్రశంసిస్తూ తమిళనాడులో డి.యం.కె-కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వచ్చిన 300 రోజుల వ్యవధిలో 3 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఆయన ప్రకటించారు. రాష్ట్ర పోలీసు శాఖలో అర్హులైన 10,000 మంది మహిళలకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని ఆయన భరోసా ఇచ్చారు.
ఆ రాష్ట్రంలో ప్రస్తుతం మహిళలకు అందిస్తున్న 1000 రూపాయల ఆర్థిక సహాయాన్ని 2000 కి పెంచి నెలవారిగా అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇక్కడ ప్రజల స్పందన చుస్టింటే ముఖ్యమంత్రి గా మరోసారి స్టాలిన్ ను బలపరచడం కోసం డి.యం.కే-కాంగ్రెస్ పార్టీ కూటమిని ఈ ఎన్నికలలో గెలిపిస్తారనే నమ్మకం బలపడిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.