- ఉత్తమ్ ఉన్నత స్థాయి సన్నాహక సమావేశం
- కొనసాగుతున్న, ప్రతిపాదిత ప్రాజెక్టులపై విస్తృత క్షేత్రస్థాయి సమీక్షకు ప్రణాళిక
హైదరాబాద్: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నీటి పారుదల ప్రాజెక్టులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు రోజుల పాటు తనిఖీ చేయనున్నారని, ఈ పర్యటన పాలమూరు ప్రాంతంలో భవిష్యత్ నీటి పారుదల అభివృద్ధి గమనాన్ని నిర్దేశించే ఒక చారిత్రాత్మక ఘట్టమని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి అభివర్ణించారు.
మంగళవారం జలసౌధలో సీనియర్ అధికారులతో జరిగిన ఉన్నత స్థాయి సన్నాహక సమావేశానికి అధ్యక్షత వహించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఈ పర్యటన ద్వారా దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న అనేక నీటి పారుదల ప్రాజెక్టులను పూర్తి చేయడానికి దిశా నిర్దేశం చేయవచ్చని, వాటి వేగ వంతమైన అమలుకు కొత్త నిధులు సమకూరుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
అభివృద్ధి లో ఉన్న మరియు ప్రతిపాదిత నీటి పారుదల పనుల స్థితిని సమీక్షించడం, ఎదురయ్యే అడ్డంకులను అంచనా వేయడం, వాటిని త్వరగా పూర్తి చేయడానికి అవసరమైన చర్యలను గుర్తించడంపై ముఖ్యమంత్రి పర్యటన దృష్టి సారిస్తుందని ఆయన అన్నారు.
ఈ తనిఖీ అనంతరం కరువు పీడిత పాలమూరు ప్రాంతంలో నీటి పారుదల సామర్థ్యాన్ని గరిష్ఠ స్థాయికి పెంచి, లక్షలాది మంది రైతులకు ప్రయోజనం చేకూర్చే లక్ష్యంతో చేపట్టిన కీలక నీటి పారుదల ప్రాజెక్టులకు ప్రధాన విధాన నిర్ణయాలు, మంజూరులు, భారీ నిధుల విడుదల జరిగే అవకాశం ఉందని అన్నారు.
పూర్వ మహబూబ్నగర్ జిల్లా నీటి పారుదల స్వరూపాన్ని మార్చాలనే రాష్ట్ర ప్రభుత్వ నిబద్ధతను ప్రతిబింబించే ఈ ప్రతిపాదిత పర్యటనను ఒక చారిత్రాత్మక, అపూర్వమైన చర్యగా మంత్రి అభివర్ణించారు.
ఈ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పలువురు సీనియర్ మంత్రులు ఉండే అవకాశం ఉందని అన్నారు. ఈ సన్నాహక సమావేశానికి నీటి పారుదల శాఖ, ఇతర సంబంధిత శాఖల సీనియర్ అధికారులు ప్రత్యక్షంగా, వర్చువల్గా హాజరయ్యారు.
రెండు రోజుల పర్యటనకు సంబంధించిన పర్యటన ప్రణాళిక, ప్రాజెక్టుల వారీగా ప్రజెంటేషన్లు, క్షేత్రస్థాయి తనిఖీలు, లాజిస్టికల్ ఏర్పాట్లపై జరిగిన సవివరమైన చర్చల్లో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి కూడా పాల్గొన్నారు. పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి కొనసాగుతున్న పనులు, మిగిలి ఉన్న పనులు, భవిష్యత్ విస్తరణ ప్రణాళికలపై విస్తృతమైన క్షేత్రస్థాయి సమీక్ష చేపట్టేందుకు వీలుగా, ప్రాజెక్టుల తాజా పురోగతి నివేదికలను అందించాలని అధికారులను ఆదేశించారు.
పాలమూరు ప్రాంతంలో ఆచరణ సాధ్యమైన అన్ని సాగునీటి ప్రాజెక్టులను వీలైనంత త్వరగా పూర్తి చేసి, ప్రతి ప్రాజెక్టు సాగునీటి విస్తరణకు సమర్థవంతంగా దోహదపడేలా చూడటానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, కల్వకుర్తి ఎత్తి పోతల పథకం, కోయిల్సాగర్, భీమా, నెట్టంపాడు మరియు ఈ ప్రాంతంలోని ఇతర కీలక నీటి పారుదల పనులతో సహా ప్రధాన నీటి పారుదల ప్రాజెక్టులపై సవివరమైన ప్రజెంటేషన్లు ఇవ్వబడతాయి.
జూన్ 4వ తేదీ సాయంత్రం సోమశిలలో ఒక ప్రధాన ప్రజెంటేషన్ సెషన్ను ప్రతిపాదించారు, అక్కడ సీనియర్ ఇంజనీర్లు వివిధ ప్రాజెక్టుల స్థితి, సవాళ్లు మరియు భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికపై ముఖ్యమంత్రికి వివరించనున్నారు.
ఈ సమీక్షా సమావేశంలో లాజిస్టిక్స్, వసతి, భద్రతా ఏర్పాట్లు, రవాణా మరియు వైమానిక తనిఖీలపై కూడా చర్చించారు. ఈ పర్యటన కోసం రెండు హెలికాప్టర్లను వినియోగిస్తారు, దీని వల్ల ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి ఈ ప్రాంత వ్యాప్తంగా నీటి పారుదల మౌలిక సదుపాయాలు మరియు ప్రాజెక్ట్ సైట్లలో విస్తృతమైన వైమానిక సర్వేలను చేపట్టగలుగుతారు.
నిధుల అవసరాలు, ప్రాజెక్టుల పూర్తి షెడ్యూళ్లు మరియు ఈ ప్రాంతంలో నీటి పారుదల అభివృద్ధిని వేగవంతం చేయడానికి అవసరమైన చర్యల గురించి రాష్ట్ర ప్రభుత్వం అక్కడికక్కడే నిర్ణయాలు తీసుకోవడానికి ఈ పర్యటన సహాయపడుతుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
ఈ పర్యటన ఈ ప్రాంత భవిష్యత్ నీటిపారుదల రోడ్ మ్యాప్ను రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొంటూ, కార్యక్రమంలోని ప్రతి అంశం సజావుగా అమలు అయ్యేలా అన్ని శాఖలతో సమన్వయంతో పని చేయాలని మంత్రి ఆదేశించారు.