Suryaa.co.in

Andhra Pradesh

ప్రత్యేక హోదా – ఆంధ్రప్రదేశ్ హక్కు

-ప్రత్యేక హోదా – రాష్ట్రానికి సంజీవని
-ప్రత్యేక హోదా – కాంగ్రెస్ తోనే సాధ్యం
– మోసం చేసిన బీజేపీ, వైసీపీ లను బద్వేలు ఉప ఎన్నికల్లో ఓడించాలి
– రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి
వేంపల్లె : ప్రత్యేక హోదా రాష్ట్రానికి సంజీవని అని, ఇది ఆంధ్ర ప్రదేశ్ హక్కు అని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి అన్నారు. శుక్రవారం వేంపల్లెలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయన్నారు. ఉపాధి హామీ పధకం, సర్వ శిక్ష అభయాన్ తదితర కేంద్ర ప్రయోజిత పథకాలకు సంబంధించి హోదా ఉన్న రాష్ట్రాల కు కేంద్ర ప్రభుత్వం 90 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం నిధులు భరిస్తాయని తెలిపారు.
హోదా లేని రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం 60 శాతం నిధులు మాత్రమే భరిస్తుందని అన్నారు. ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి, తదితర విదేశీ ఆర్థిక సంస్థల సహకారంతో రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలకు 90 శాతం నుంచి 100 శాతం వరకు నిధులను కేంద్రమే భరిస్తుందని, హోదా లేని రాష్ట్రాలలో మొత్తం ఖర్చును ఆ రాష్ట్ర ప్రభుత్వమే భరించాలన్నారు. సెంట్రల్ ఎక్సైజ్, ఇన్ కంటాక్స్, కార్పొరేట్ టాక్స్ , కస్టమ్స్ డ్యూటీ తదితర కేంద్ర ప్రభుత్వం విధించే పన్నుల్లో హోదా ఉన్న రాష్ట్రాలకు రాయితీలు లభిస్తాయన్నారు. ఇందువల్ల పారిశ్రామిక వేత్తలు పరిశ్రమలు స్థాపిస్తారని, తద్వారా యువతకు ఉపాధి లభించి నిరుద్యోగ సమస్య నివారింపబడుతుందని అన్నారు.
రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని, ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయన్నారు. 2014 ఫిబ్రవరి 20 న నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదాను పార్లమెంట్ లో ప్రకటించారని, సభ ఏకగ్రీవంగా ఆమోదించిందని తులసి రెడ్డి పేర్కొన్నారు. 2014 మార్చ్ 1న మన్మోహన్ సింగ్ అధ్యక్షతన కేంద్ర మంత్రి వర్గం హోదాపై తీర్మానం చేసి అమలు చేయాలని ప్రణాళికా సంఘాన్ని ఆదేశించిందని చెప్పారు. 2014 మార్చ్ 5న కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన కారణంగా ప్రణాళికా సంఘం అమలు చేయ లేక పోయిందని, ఎన్నికల తరువాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉంటే ప్రత్యేక హోదా తక్షణమే అమలై ఉండేదని, నవ్యాoధ్ర ప్రదేశ్ స్వర్ణాంద్ర ప్రదేశ్ అయి ఉండేదని తులసి రెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, కాబట్టి బద్వేలు ఉప ఎన్నికల్లో వైసీపీ, బీజేపీ లను ఓడించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కమలమ్మను గెలిపించాలని తులసిరెడ్డి విజ్ఞప్తి చేశారు.

LEAVE A RESPONSE