– వారికి ఏ కష్టమొచ్చినా అండగా ఉంటా
– కష్టకాలంలో పార్టీకి వెన్నంటి ఉన్న వారికి సముచిత స్థానం
– చంద్రన్న సైనికుడు డైరీ ఆవిష్కరణ సభలో చంద్రబాబునాయుడు
అమరావతి: తెలుగు రాష్ట్రాల్లోని 70లక్షలమంది కార్యకర్తలు తమ కుటుంబసభ్యులేనని, వారి త్యాగాలు ఎన్నటికీ మర్చిపోనని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబునాయుడు అన్నారు. బుధవారం నాడు మంగళగిరి తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో పార్టీ యువ నాయకులు వల్లూరి కిరణ్ ఆధ్వర్యంలో రూపొందించిన “చంద్రన్న సైనికుడు” డైరీని చంద్రబాబునాయుడు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ అధికార పార్టీ నేతల బెదిరింపులకు, అక్రమ కేసులకు లొంగకుండా అధికార పార్టీ అరాచకాలపై ధైర్యంగా పోరాటం చేస్తున్న టిడిపి కార్యకర్తలకు భవిష్యత్ లో తగిన గుర్తింపు లభిస్తుందని చెప్పారు. కార్యకర్తలంతా నా కుటుంబ సభ్యులతో సమానం, వారికి ఏ కష్టమొచ్చినా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
రాబోయే రోజుల్లో పార్టీకోసం కష్టపడి పనిచేసే యవనాయకత్వాన్ని ప్రోత్సహిస్తామని తెలిపారు. కుల,మతాలకు అతీతంగా సమర్థ నాయకత్వానికే పెద్దపీట వేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు టిడి జనార్దన్, పర్చూరి అశోక్ బాబు, మద్దిపట్ల వెంకట్రాజు, దారపునేని నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.