– తెలుగు ప్రజలకు ఏ కష్టం వచ్చినా టిడిపి స్పందిస్తుంది
– తిరిగొచ్చిన విద్యార్థులకు ఇండియాలో అడ్మిషన్లు ఇవ్వడంపై కేంద్రాన్ని కోరుతాం
– టిడిపి అధినేత చంద్రబాబుతో భేటీ అయిన ఉక్రెయిన్ నుంచి వచ్చిన తెలుగు విద్యార్థులు
– ఇండియా వచ్చేందుకు సహకరించిన చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపిన విద్యార్థులు
అమరావతి: ఉక్రెయిన్ నుంచి వచ్చిన తెలుగు విద్యార్థులు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేతతో పాటు, ఎంపిలతో సమావేశం అయ్యారు. ఉక్రెయిన్ లో బోర్డర్ కు, అక్కడి నుంచి వివిధ దేశాల ద్వారా ఇండియాకు రావడానికి సహకరించిన ఎన్ ఆర్ ఐ టిడిపి విభాగానికి, మొదటి నుంచి తమకు అండగా నిలిచిన చంద్రబాబుకు విద్యార్ధులు ధన్యవాదాలు తెలిపారు.
యుద్ద సమయంలో తాము పడిన అందోళన, తమ కష్టాలను విద్యార్థులు వివరించారు. గత నెల 25 వ తేదీ నుంచి చంద్రబాబు నాయుడు తమతో రెగ్యులర్ గా మాట్లాడి… ఉక్రెయిన్ లో స్థిరపడిన తెలుగు వారితో
తమకు సహాయం అందించిన విషయాలను సమావేశంలో విద్యార్థులు వివరించారు. ఎన్ఆర్ఐ టిడిపి సమన్వయంతో ట్రైన్ లో బోర్డర్ కు వెళ్లగలిగామని విద్యార్థులు చెప్పారు. ఉక్రెయిన్ లో చిక్కుకున్న తమ వివరాలు నిరంతరం సేకరించడమే కాకుండా…వాటిని విదేశాంగ శాఖకు పంపి సాయం అందేలా చేశారని చంద్రబాబుకు విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు.
ముఖ్యంగా బోర్డర్ లో యూరప్ ఎన్ఆర్ఐ టిడిపి ప్రతినిధులు తమకు చేసిన సాయం, స్పందించిన విధానాన్ని విద్యార్థులు చంద్రబాబు నాయుడుకు వివరించారు. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. విదేశీ విద్యోన్నతి పథకం ద్వారా తమ పిల్లలను ఉన్నత చదువుల కోసం విదేశాలకు పంపామని….ఇప్పుడు ఆ నిధులు కూడా విడుదల చెయ్యక పోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని సమావేశానికి వచ్చిన తల్లిదండ్రులు చెప్పారు.
ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన విద్యార్థుల బాధలు చూసి చలించిపోయానని చంద్రబాబు అన్నారు. అధికారంలో లేకపోయినప్పటికీ విద్యార్థులకు ఎంతో కొంత సాయం అందించగలిగామని చెప్పారు. విద్యార్థులను సమన్వయం చెయ్యడంలో పని చేసిన ఎన్ఆర్ఐ టిడిపి, పార్టీ ఎంపిలను చంద్రబాబు
అభినందించారు. యుద్దం కారణంగా ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన విద్యార్ధులు తమ వైద్య విద్య పూర్తి చేసేందుకు ఇండియాలో అడ్మిషన్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతామని చంద్రబాబు అన్నారు.
విద్యార్దులకు సాయం అందించే విషయంలో తమను పార్టీ అధినేత చంద్రబాబు ఎలా నడిపించారో ఎంపిలు ఈ సందర్భంగా వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపిలు, కేసినేని నాని, కనకమేడల రవీంద్ర కుమార్, రామ్మోహన్ నాయుడు, ఎన్ఆర్ఐ టిడిపి అధ్యక్షులు రాజశేఖర్, పార్టీ నేత పట్టాభి, తేజస్వి పాల్గొన్నారు.