– బండి సంజయ్ యాత్రకు మద్దతివ్వండి
– బీజేపీ అధికారంలోకి వస్తే నీతివంతమైన ప్రజాస్వామిక పాలన అందిస్తాం
– వ్యవసాయానికి కరెంట్ మీటర్లు పెట్టే ప్రసక్తే లేదు
– కేసీఆర్ దుష్ర్పచారం చేస్తున్నారు
– కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
తెలంగాణ ప్రజలు కేసీఆర్ పాలనపట్ల విసిగిపోయారని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కేసీఆర్ పాలన పోవడం…. బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ అవినీతి-నియంత-కుటుంబ పాలనను ఎండగడుతూ ప్రజా సమస్యలను తెలుసుకుని వారి పరిష్కారం కోసం పోరాడేందుకే ‘ప్రజా సంగ్రామ యాత్ర’ పేరిట పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ కు మద్దతు పలకాలని కోరారు.
జోగులాంబ గద్వాల్ జిల్లాలో రెండోరోజు పాదయాత్రలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఈరోజు మధ్యాహ్నం వరకు ఇమాంపేట నుండి లింగన్ వాయి మీదుగా బూడిదపాడు సెంటర్, ఉండవల్లి వరకు నడిచారు. ఈ సందర్భంగా బండి సంజయ్ తోపాటు కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణసహా పలువురు ప్రజా ప్రతినిధులు, పార్టీ సీనియర్ నేతలు పాదయాత్రలో నడిచారు. అనంతరం లింగన్ వాయి గ్రామంలో ‘ప్రజల గోస-బీజేపీ భరోసా’ పేరిట నిర్వహించిన రచ్చబండలో కిషన్ రెడ్డి మాట్లాడారు. అందులోని ముఖ్యాంశాలు…
కరోనా కాలంలో ఒక్కొక్కరికి 5 కిలోల బియ్యం అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం. గ్రామాల్లోని పేద ప్రజల ప్రాణాలు కాపాడేందుకు దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు కొవిడ్ వ్యాక్సిన్ ను ఉచితంగా అందించడంతో పాటు ఔషధాలు ఇస్తోంది.నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో గ్రామ అభివృద్ధి కోసం ఠంచనుగా నిధులిస్తోంది. ప్రతి ఏడాది గ్రామంలో రోడ్లకు, వీధిలైట్లు, పారిశుద్ధ్యం కోసం నరేంద్ర ప్రభుత్వం నిధులిస్తోంది.
పేదలకు మరుగుదొడ్ల నిర్మాణం కోసం నిధులు ఇస్తోంది కేంద్ర ప్రభుత్వం. గ్రామాలకు దూరంగా జీవనం సాగిస్తున్న పేదలకు ఉచితంగా కరెంటు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రతి ఇంట్లో మహిళలకు పొగబారిన బతుకుల నుంచి విముక్తి కోసం గ్యాస్ కనెక్షన్లు ఇస్తోంది.పేద ప్రజలకు అండగా ఉండాలని నరేంద్ర మోదీ గారు సంవత్సరానికి రూ. 5లక్షల విలువైన ఆయుష్మాన్ భారత్ పథకం తీసుకొస్తే… కాని, కేసీఆర్ సర్కారు మోకాలడ్డుతోంది. రైతుల కోసం సమగ్రమైన పంట బీమా పథకం తీసుకొస్తే దాన్నీ అడ్డకుంటున్నారు.
నరేంద్ర మోదీ ప్రభుత్వం తెలంగాణకు ఇండ్లు మంజూరు చేస్తే కేసీఆర్ మాత్రం ఆ ఇండ్లు పేదలకు అందకుండా అడ్డుకున్నారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలనలో పావలా వడ్డీ రుణాలు అందక రైతులు ఇబ్బంది పడుతున్నరు.కౌలు రైతులకు రైతుబంధు రావడం లేదు… కౌలు రైతులను నరేంద్ర మోదీ ప్రభుత్వం డబ్బులిస్తున్నా కేసీఆర్ అడ్డుకుంటున్నారు. కేసీఆర్ మాటలు ప్రగతి భవన్ దాటడం లేదు. పెండింగ్ పనులు ముందుకు సాగాలంటే రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం రావాలి.
నిజాయితీ పార్టీ రావాలన్నా, ప్రజాస్వామ్య పాలన రావాలన్నా…. కుటుంబ, నిజాం నియంతృత్వ పాలన పోవాటం భారతీయ జనతా పార్టీ రావాలి. మహబూబ్ నగర్ జిల్లా సశ్యశ్యామలం కావాలంటే భారతీయ జనతా పార్టీ రావాల్సిందే.
బండి సంజయ్ కుమార్ ప్రజా సంగ్రామ యాత్రకు అందరు కలిసి రండి… తెలంగాణ లో అవినీతిరహిత పాలనను అందిపుచ్చుకోవాలి. కేసీఆర్ నియంతృత్వ, అచారక, కుటుంబ పాలన పోవడం ఖాయం బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం.
బీజేపీ అధికారంలోకి వస్తే పాలమూరును సస్యశ్యామలం చేస్తాం. కేసీఆర్ ఎన్ని విష ప్రచారం చేసినా అధికారంలోకి వచ్చేది బీజేపీయే. కేసీఆర్ పోవడం ఖాయం. ప్రజాస్వామిక తెలంగాణ ఏర్పాటు ఖాయం. చాలా మందిని నియంతలను చూశాం. కేసీఆర్…ఏదీ శాశ్వతం కాదు. ఇష్టారాజ్య పాలన జరుగుతోంది. లిక్కర్, మైనింగ్, ల్యాండ్ మాఫియాతో దోచుకుంటున్నరు. అవినీతి మచ్చలేని ప్రభుత్వం నరేంద్రమోదీజీ. 24 గంటల పాలన చేస్తున్న నాయకుడు మోదీ. కేసీఆర్ ఏనాడూ ఆఫీస్ కు రాడు. సెక్రటేరియట్ లేని రాష్ట్రం తెలంగాణే.
కేసీఆర్ పీఠాలు కదులుతున్నాయ్… అందుకే కేసీఆర్ బయటకొచ్చి తిరుగుతున్నడు. బీజేపీని బంగాళాఖాతంలో కలపాలని చెబుతుండు.. కేసీఆర్…2024లో ఈ దేశానికి ప్రధాని అయ్యేది మళ్లీ నరేంద్రమోదీ మాత్రమే. నువ్వు ఎంత మొత్తుకున్నా నీ ఆశలు నెరవేరవు. బీజేపీని ఆశీర్వదించండి… సంజయ్ కు మద్దతు తెలపండి.