బీజేపీ, జనసేనలు పొత్తులో ఉన్నాయనే విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా జరిగిన ఒక పరిణామం ఈ పొత్తుపై అనేక అనుమానాలను లేవనెత్తింది. భీమవరంలో జరిగిన మోదీ సభకు పవన్ కల్యాణ్ హాజరు కాలేదు. దీంతో, రెండు పార్టీలకు మధ్య గ్యాప్ పెరిగిందా అనే కోణంలో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ, మోదీ సభను సక్సెస్ చేయాలని కోరుతూ జనసేన శ్రేణుకులకు పవన్ కల్యాణ్ ఒక వీడియో సందేశం పంపారని చెప్పారు. జనసేన, బీజేపీ పార్టీలు కలిసే ఉన్నాయని… ఇందులో ఎలాంటి సందేహం అవసరం లేదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసే పోటీ చేస్తాయని స్పష్టతనిచ్చారు. ఏపీలో కొన్ని శక్తులకు వారి కుటుంబ ప్రయోజనాలు మాత్రమే కావాలని… కానీ, బీజేపీకి రాష్ట్ర అభివృద్ధి కావాలని చెప్పారు. ఏపీలో ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. భీమవరంలో మోదీ సభ విజయవంతమయిందని చెప్పారు.