-ఎంపీ విజయసాయిరెడ్డి
2004 పార్లమెంటు ఎన్నికల్లో 145 సీట్లతోనే కాంగ్రెస్ ఢిల్లీలో అధికారం సంపాదించింది. వీటిలో 29 సీట్లు అప్పటి ఉమ్మడి ఏపీ నుంచే వచ్చాయి. 2009 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బలం 206కు పెరిగింది. ఏపీ నుంచి గెలిచిన సీట్లూ 33కు పెరిగాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతం కావడానికి వైఎస్ రాజశేఖరరెడ్డి గారి జనరంజక పాలన కారణమనేది జగమెరిగిన సత్యం. జననేత రాజశేఖరరెడ్డి గారి మరణానంతరం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో తలెత్తిన సంక్షోభాన్ని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ నేతృత్వంలోని పాలకబృందం సక్రమంగా ఎదుర్కొనలేకపోయింది. మూడేళ్లకు సమస్య ముదిరి పాకాన పడింది కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం వికృత చేష్టలతో రాష్ట్ర విభజన నుంచి జనాదరణ ఉన్న యువనేతను బయటకుపోయేలా చేయడం వరకూ అన్నీ కాంగ్రెస్ ‘అధిష్ఠానం’ తప్పిదాలే.
ఫలితం –విభజిత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ చిరునామా గల్లంతవడం. తెలంగాణలోనూ హస్తం పార్టీ కాలు విరిగి కుంటినడక నడుస్తోంది. ఇవే పోకడలతో పశ్చిమ బెంగాల్, అస్సాం, ఒడిశా వంటి అనేక రాష్ట్రాల్లో చతికిల పడింది. ఈ ప్రాంతాల్లో కాంగ్రెస్ ఎప్పటికీ పూర్వ వైభవం సాధించడం సరికదా, అసలు ఉనికి కాపాడుకోవడమే అసాధ్యంగా కనిపిస్తోంది. ఢిల్లీ నుంచి గల్లీ వరకూ భారత జాతీయ కాంగ్రెస్ దిక్కులేని జాతీయపక్షంగా మారింది. ఏఐసీసీ అధ్యక్షుడిని సైతం ఇప్పుడు ఎన్నుకునే పరిస్థితి లేదంటే–తెలుగునాట కాంగ్రెస్ చేసిన పాపాలే నెహ్రూ–గాంధీ కుటుంబాన్ని వెంటాడుతున్నాయని ప్రసిద్ధ రాజకీయ పండితులే చెబుతున్నారు. భారత స్వాతంత్య్ర సంగ్రామంలో కీలక పాత్ర పోషించిన కాంగ్రెస్ పార్టీ చచ్చిపోవాలని ఎవరూ కోరుకోరు. అయితే, ఈ పార్టీకి ఎవరు జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైనా దాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా, పద్ధతిగా నడపాలని మాత్రం ఆశిస్తారు.