-దసరా కానుకగా 30 శాతం పారితోషికం పెంపు
-1530 మంది గోపాలమిత్రలకు లబ్ది
-14 లక్షల పశువులకు కృత్రిమ గర్భధారణ
-దేశంలో ఎక్కువ పారితోషికం ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటే
-మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ వెల్లడి
రాష్ట్రంలోని గోపాలమిత్రలకు పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దసరాకు ముందే శుభవార్త చెప్పారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలలో భాగస్వాములు అవుతూ, గ్రామీణ ప్రాంతాలలోని రైతులకు అందుబాటులో ఉంటూ పాడి గేదెలకు కృత్రిమ గర్బాధారణ, వ్యాక్సినేషన్ కార్యక్రమాలు, నట్టల నివారణ మందుల పంపిణీ వంటి తదితర కార్యక్రమాలలో సేవలు అందిస్తున్న గోపాలమిత్ర ల కు గుర్తింపు గా.. తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం చెల్లిస్తున్న పారితోషికానికి అదనంగా.. రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు చెల్లిస్తున్న విధంగా 30 శాతం పెంచి అదే రీతిలో గోపాలమిత్రలకు కూడా అందజేసే విధంగా ఉత్తర్వులు జారీ చేసినట్లు మంత్రి శ్రీనివాస్ యాదవ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
గోపాలమిత్రలకు ప్రస్తుతం 8500 చెల్లిస్తుండగా, పెరిగిన 30 శాతం 2550 రూపాయలు కలుపుకొని మొత్తం 11,050 రూపాయలకు పెరుగుతుందని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న 1530 మంది గోపాలమిత్రలకు లబ్ది చేకూరుతుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు గోపాలమిత్ర లకు 3,500 రూపాయల పారితోషికాన్ని అందించే వారని, గోపాలమిత్ర లు అందిస్తున్న సేవలను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల తో ఒకేసారి 8500 రూపాయలకు పెంచడం జరిగిందని, దేశంలో ఎక్కడా కూడా ఇంత పెద్ద మొత్తంలో గోపాలమిత్రలకు పారితోషికాన్ని ఇవ్వడంలేదని స్పష్టం చేశారు.
రాష్ట్ర అవసరాలకు సరిపడా పాల ఉత్పత్తిని మన రాష్ట్రంలోనే చేయాలి, నాణ్యమైన పాడి సంపద ను పెంచాలనే ఉద్దేశంతో కృత్రిమ గర్భధారణ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తుందని వివరించారు. 2019 నుండి జాతీయ కృత్రిమ గర్భధారణ కార్యక్రమం క్రింద 14 లక్షల పశువులకు కృత్రిమ గర్భధారణ నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. అంతేకాకుండా విజయ డెయిరీకి పాల సేకరణను పెంచేందుకు చేపట్టిన కార్యక్రమంలో కూడా గోపాలమిత్ర లు పాడి రైతుల తో నేరుగా సంప్రదించి చేసిన కృషి ఫలితంగా పాల సేకరణ పెరిగిందని తెలిపారు.
గోపాలమిత్రల నైపుణ్యాన్ని మరింతగా పెంపొందించే విధంగా ప్రతి 6 నెలలకు ఒకసారి తెలంగాణా వెటర్నరీ యూనివర్సిటీ కి చెందిన నిపుణుల సహకారంతో శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. రానున్న రోజులలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో చేపట్టే అనేక కార్యక్రమాలలో గోపాలమిత్రల సేవలను మరింతగా ఉపయోగించుకోనున్నట్లు చెప్పారు.