Home » పిఠాపురం వైపు ప్రపంచం చూసేలా మార్పు సాధించాలి

పిఠాపురం వైపు ప్రపంచం చూసేలా మార్పు సాధించాలి

  • ఎన్డీఏ కూటమి విజయానికి పిఠాపురం ఇచ్చిన భరోసా వెలకట్టలేనిది
  • కాలం పెట్టిన పరీక్షలో వైసీపీ అహంకారంతో ఓడిపోయింది
  • ఎవరి మీదా వ్యక్తిగత ద్వేషం ఉండదు
  • శక్తివంచన లేకుండా ప్రజల కోసం పని చేయడానికే ప్రాధాన్యం
  • గత ఐదేళ్ల కాలంలో అన్ని శాఖల్లో చోటు చేసుకున్నా అక్రమాలు, అవినీతి బయటపడుతున్నాయి
  • 2047కు భారత్ విశ్వ గురువు కావాలి… అదే మన సంకల్పం కావాలి…
  • పిఠాపురం జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికుల సమావేశంలో మాట్లాడిన ఉప ముఖ్యమంత్రివర్యులు  పవన్ కళ్యాణ్

‘పిఠాపురం ప్రజలు ఇచ్చిన బలం, భరోసా కేంద్రంలో ఎన్డీఏ కూటమికి అండగా నిలిచింది. పిఠాపురం ప్రజలు ఇచ్చిన గెలుపు గ్యారెంటీతోనే రాష్ట్రం మొత్తం కూటమి తరఫున తిరిగి ప్రచారం చేయగలిగాను. అందర్నీ ఏకం చేసి కూటమి విజయానికి కృషి చేయగలిగాను. పిఠాపురం ఇచ్చిన గొప్ప ధైర్యానికి నేను ఎన్నిసార్లు శిరస్సు వంచి నమస్కరించినా సరిపోదు’ అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. 2009లోనే పిఠాపురం నుంచి పోటీ చేయాలని చాలా మంది సూచించినట్లు తెలిపారు. రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు బలంగా నిలబడాలన్న సంకల్పంతో వచ్చాననీ, దానికి పిఠాపురం ప్రజలు ఇచ్చిన గొప్ప విజయం చిరస్మరణీయంగా నిలిచిందని చెప్పారు.

సోమవారం సాయంత్రం గొల్లప్రోలులో పిఠాపురం నియోజకవర్గ  జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, జన సైనికులకు కృతజ్ఞతలు తెలియచేశారు. ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “నా అంతర్మధనం మేరకే రాజకీయాలకు వచ్చాను. కష్టాల్లో ఉన్న సాటి మనిషికి ఎలా నిలబడాలి అన్నదే నా ప్రధమ సిద్ధాంతం. 2019లో ఓడిపోయినప్పుడు నేను ఎంత స్థిమితంగా రేపటి గురించి ఆలోచించానో, 2024లో విజయభేరీ మోగించినప్పుడు రేపటి గురించి అంతే స్థిమితంగా ఆలోచించాను.

మొన్నటి ఎన్నికల ఫలితాలు వస్తున్న సమయంలో ఏం చేస్తున్నావని చాలా మంది అడిగారు. నేను ఆ రోజు ఒక్కడినే కూర్చుని పుస్తకం చదువుతున్నా. కూటమి విజయంపై పూర్తి విశ్వాసంతో ఉన్నప్పటికీ ఫలితాలు ఎలా వచ్చాయి.. కూటమిని ప్రజలు ఆశీర్వదించారా లేదా అన్న ఒక్క విషయం మాత్రమే చెప్పాలని సూచించాను. నా బాధ్యతలు నేను సంపూర్ణంగా నిర్వర్తించాను. భగవంతుడు ఏది ఇస్తే అది తీసుకుందామని అనుకున్నాను. నా ప్రజలు అఖండ విజయం అందించారు. పిఠాపురం ప్రజలు దేశ చరిత్రను తిప్పగలిగిన, లిఖించదగిన విజయం అందిచారు. కడ వరకు ప్రజల కోసమే పని చేస్తానని మాటిస్తున్నాను.

పిఠాపురానికి ఏమిచ్చావని లోపల ఉన్న పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తాడుఊరేగింపు
లు, సభలు, సమావేశాలు పెట్టుకోవడం పెద్ద విషయం కాదు. ఇంత గొప్ప ఘన విజయం అందించిన పిఠాపురం ప్రజలకు నువ్వేమి ఘనంగా ఇచ్చావని లోపల ఉన్న పవన్ కళ్యాణ్ నన్ను నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటాడు. దీని కోసం నేను సగటు కూలీలా కష్టపడడానికి సిద్ధంగా ఉన్నాను. పిఠాపురాన్ని ఎవరూ చేయలేని అభివృద్ధి దిశగా నడిపిస్తాను. దేశ వ్యాప్తంగా పిఠాపురానికి గుర్తింపు తెచ్చిన రోజున గట్టిగా ఊరేగింపులు చేద్దాం. నియోజకవర్గం అంటే పిఠాపురంలా ఉండాలి అని దేశమంతా మాట్లాడుకున్నప్పుడు ఉత్సవాలు చేద్దాం. నియోజకవర్గం అద్భుతమైన మత సామరస్యానికి వేదిక. ఇక్కడ టూరిజం పెంపొందించడంతో పాటు ఉపాధి అవకాశాలు సృష్టించాలి. స్థానిక యువతకు ఉపాధి అవకాశాల్లో బలమైన ప్రత్యామ్నాయాలు ఉండేలా తీర్చిదిద్దాలి.

వైసీపీ పాలకులు అడ్డగోలుగా, నిర్లక్ష్యంగా పాలన చేశారు
పంచాయతీరాజ్ శాఖ చాలా లోతైన శాఖ. గ్రామాలకు ఏం చేయవచ్చు అని అధికారులతో సమీక్ష చేస్తుంటే అభివృద్ధికి ఎన్నో అవకాశాలతోపాటు బోలెడు సమస్యలు కూడా కనిపిస్తున్నాయి. గత వైసీపీ పాలకులు పంచాయితీరాజ్ శాఖలో అవినీతి అక్రమాలు లెక్కలేనన్ని చేశారు. శాఖకు సంబంధించిన అభివృద్ధి పనులపై పూర్తి స్థాయి నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు. కేంద్రం పరిధిలోని జల్ జీవన్ మిషన్ పథకంలో అపరిమిత నిధులు ఉన్నాయి.

దానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మ్యాచింగ్ గ్రాంట్లు ఇచ్చి, కేంద్రం నిధులు తెస్తే తాగునీటి సమస్యలు పూర్తి స్థాయిలో తీరుతాయి. అయినా సరే గత ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వలేదు. గత ఐదు సంవత్సరాల కాలంలో పంచాయితీ రోడ్లు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. వాటిని మెరుగుపర్చిన దాఖలాలు లేవు. రూ. 3 వేల కోట్లు పంచాయతీ రాజ్ శాఖలో బిల్లులు పెండింగ్ ఉన్నాయి. ఇంకా బోలెడన్ని లోపాలు గుర్తించాం. ఇవన్నీ తీరాలంటే అధికారుల సహాయసహకారాలు కావాలని స్పష్టంగా చెప్పాను. ప్రజలతో మమేకమై మరింత పని చేసేందుకు ప్రయత్నిస్తాను. నా హయాంలో పంచాయతీ రాజ్ శాఖ చాలా బలంగా పని చేస్తుంది.

వెనుకబడిన ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు రావాలి. పరిశ్రమలు రావాలి. ఉపాధి అవకాశాలు మెరుగవ్వాలి. దీనికి త్రికరణ శుద్ధిగా పని చేసే నాయకుల సమూహం అవసరం.  చంద్రబాబు అనుభవాన్ని రాష్ట్ర అభివృద్ధి కోసం బలంగా ఉపయోగించాలనే తపనతోనే ఆయనకు మద్దతు ఇచ్చాం. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా పించన్ల పంపిణీ ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగిందంటే దీని వెనుక అపార అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడు ఎంత అవసరమో తెలుస్తోంది.

ఎన్డీఏ కూటమికి ఆంధ్ర వెన్నుదన్ను అయ్యింది. నేను ఒక గొప్ప ఆశయం కోసం సంకల్పిస్తే ప్రజలంతా నాకు అండగా నిలచిన తీరు ఎప్పటీకీ గుర్తుంటుంది. ఓ దాష్టిక పాలనకు గుండెలు ఎదురొడ్డి ధైర్యంగా నిలబడింది జనసేన పార్టీ వీర మహిళలు, జనసైనికులే. వారు తెగువ 5 కోట్ల మంది ఆంధ్రులకు ధైర్యం ఇచ్చింది. జనసేన కార్యకర్తలు బయటకు వచ్చి పోరాడిన తర్వాతే మాకు కూడా ధైర్యం వచ్చిందని ఇతర పార్టీల నాయకులు చెబుతుంటే నాకు కూడా మన బలం ఎంతో తెలిసింది. జనసేన నాయకులు లేని ఊరు ఉండవచ్చు గాని, జనసైనికులు, వీర మహిళలు ఉండని ఊరు ఉండదు. పిఠాపురంలో త్వరలో స్థలం తీసుకుని ఇల్లు కడతాను.

వైసీపీ కాలం పెట్టిన పరీక్షలో ఓడిపోయింది
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రస్తుతం ప్రతిపక్షం లేదు. ప్రజల బాధలను, సమస్యలను నిర్మాణాత్మకంగా మనమే అసెంబ్లీలో ప్రస్తావించాలి. యుద్ధం చేసి ఓడిపోయిన వారిని కూడా గౌరవించే గొప్ప మనసున్న దేశం మనది. లొంగిపోయిన వారిని గౌరవించిన సంస్కృతి మనది. విజయం వచ్చినప్పుడు తల ఎగరేయకు. అపజయం వచ్చినప్పుడు కుంగిపోకు. 2019లో – కాలం వైసీపీవాళ్ళకు 151 సీట్లు ఇచ్చి పరీక్ష పెట్టింది. ఆ పరీక్షకు వాళ్లు తట్టుకోలేకపోయారు. అన్నింటికీ మేము అతీతులం అనేలా ప్రవర్తించారు. దీంతో కాలం పెట్టిన పరీక్షలో వారు ఓడిపోయారు. ఓటమిలో ఉన్నవారిని మనం హేళన చేయాల్సిన అవసరం లేదు. నేను ఎవర్నీ వ్యక్తిగతంగా దూషించను. ఆ సమయం కూడా నాకు లేదు. నేను మొదట్నుంచి వైసీపీ నాయకులపై వ్యక్తిగత కక్ష ఉందని చెప్పలేదు. వారి విధానాల మీదే మనం పోరాడాం. మనం ఏది ఇస్తే అదే తిరిగి వస్తుందంటారు. నేను ప్రేమను ఇస్తున్నాను. అదే నాకు తిరిగి వస్తుందని నమ్ముతున్నాను.

వైసీపీ అవినీతి నేపాల్లో దొరికింది
అటవీ శాఖపై ఇటీవల సమీక్ష నిర్వహించినప్పుడు శేషాచలం అడవుల్లో లభించే ఎర్రచందనం కొట్టివేసి ఆ దుంగలను వైసీపీ హయాంలో దేశం దాటించి నేపాల్లో దొరికిపోయిన ఫైల్ నా ముందుకు వచ్చింది. అక్కడి నుంచి ఎర్ర చందనం విడిపించేందుకు కిందా మీద పడుతున్నాం. వైసీపీ హయాంలో అన్నీ అక్రమాలే జరిగాయి. ఒక్కొక్కటీ బయటకు వస్తుంది. అక్రమ బియ్యం మాఫియా కాకినాడలో ఎంత పేరుకుపోయిందో మంత్రి నాదెండ్ల మనోహర్ తనిఖీల్లో బయటపడుతోంది. భారీగా బియ్యం నిల్వలు బయటపడ్డాయి. దాని వెనుక ఉన్న సూత్రదారులను పట్టుకోవాలి. గనులు, ఇసుక, అడవులు ఇలా  సహజ సంపదలన్నీ వైసీపీ హయాంలో దోపిడికీ గురయ్యాయి.  ఒక్కోదానిపై దృష్టిపెడుతున్నాం. నాకు ప్రతి రోజు, ప్రతి గంటా కీలకమే. పని చేస్తేనే రాష్ట్ర భవిత. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఐదేళ్లు శక్తి వంచన లేకుండా పని చేస్తాను.

వంద శాతం స్ట్రయికింగ్ రేట్ పార్టీగా పేరొచ్చింది
పిఠాపురం ప్రజలు ఇచ్చిన గొప్ప భరోసాలో ఎన్నికల రణ క్షేత్రంలో దిగిన నాకు గొప్ప విజయం అందించారు. చరిత్రలో లేనట్టుగా 100 శాతం స్ట్రయికింగ్ రేటు విజయంతో జాతీయ స్థాయిలో చర్చించుకునే గొప్ప విజయం ఇచ్చారు. ప్రజల కోసం నిలబడాలని పార్టీ పెడితే దానిని ఆదిలోనే తుంచేయాలని చాలా మంది ప్రయత్నించారు. పార్టీని చంపేయడానికి ఎన్నో కుట్రలు జరిగాయి. ఎన్నికల కమిషన్ కు రకరకాల ఫిర్యాదులు, ఆరోపణలు వెళ్లాయి. అన్ని బాలారిష్టాలు దాటుకుని తల్లి యశోద దగ్గరకు చేరిన శ్రీ కృష్ణుడిలా ఈ రోజు జనసేన పార్టీ అధికార పార్టీగా గుర్తింపు పొందింది.

ఒక వజ్ర సంకల్పం తీసుకుందాం
2047కి భారత్ సూపర్ పవర్ కావాలి. అరబిందో కోరుకున్నట్టు భారత్ విశ్వ గురువు కావాలి. భారత దేశానికి తలామానికం రాష్రం అయితే రాష్ట్రానికి తలామానికం పిఠాపురం కావాలి. భారత దేశ శక్తిసామర్థ్యాలు ప్రపంచానికి తెలియచెప్పేలా సకల గురువులు విశ్వ గురువు భారత దేశం వైపు తిరిగి చూసేలా ఈ వజ్ర సంకల్పం తీసుకుందాం. 2047 సూపర్ పవర్ అయ్యే భారత దేశానికి బీజం పిఠాపురంలోనే పడాలి. నేను ఇక్కడ మన నాయకులను నియమించాను. వారు సమన్వయ బాధ్యతలు చూసుకుంటారు. కష్టపడే కార్యకర్తలను ప్రతి ఒక్కరినీ గుర్తించాలని సూచించాను… పవన్ కళ్యాణ్ అనే నేను పిఠాపురం అభివృద్ధి, అభ్యున్నతి కోసం నిరంతరం తాపత్రయపడతానని, ఆఖరి శ్వాస వరకు దాని కోసం పని చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను” అన్నారు. ఈ సమావేశంలో పార్టీ జాతీయ అధికార ప్రతినిధి వేములపాటి అజయ్ కుమార్, పిఠాపురం నియోజకవర్గ సమన్వయకర్త మర్రెడ్డి శ్రీనివాస్ పాల్గొన్నారు.

Leave a Reply