– కాకినాడ, గుంటూరు, కడపలో ఆధునిక రేడియేషన్ పరికరాలు
– ఒక్కొక్కటి సుమారు రూ.16 కోట్లు విలువగల పరికరాలు అందించేందుకు ఓఎన్జీసీ అంగీకారం
– మొత్తం విలువ సుమారు రూ.48 కోట్లు
– ఫలించిన ఎంపి సానా సతీష్ ప్రయత్నాలు
– ఇది ప్రజల ప్రాణాల కోసం నిలిచే ఆశ
– కేంద్ర మంత్రులు హర్దీప్ సింగ్ పూరి, డా. పెమ్మసాని చంద్రశేఖర్ కు హృదయపూర్వక కృతజ్ఞతలు
న్యూ ఢిల్లీ: కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ తో కలిసి, రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు న్యూఢిల్లీలో కేంద్ర చమురు మరియు సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సమావేశంలో, రాష్ట్రానికి క్యాన్సర్ వ్యాధిపై పోరాటంలో సహకారంగా ఓఎన్జీసీ నుంచి సీఎస్ఆర్ నిధుల ద్వారా మూడు రేడియేషన్ మిషన్లను సమకూర్చే అంశంపై చర్చ జరగగా, ఒక్కొక్కటి సుమారు రూ.16 కోట్లు విలువగల పరికరాలు అందించేందుకు ఓఎన్జీసీ అంగీకరించింది. మొత్తం విలువ సుమారు రూ.48 కోట్లు.
ఈ అత్యాధునిక యంత్రాలను త్వరలో కాకినాడ, గుంటూరు, కడప జిల్లాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేయనున్నారు. ఈ పరికరాలు క్యాన్సర్ను ప్రారంభ దశలో గుర్తించడంలో, అలాగే రేడియేషన్ చికిత్సలో కీలకంగా పనిచేస్తాయి.
ఈ సందర్భంగా సానా సతీష్ బాబు మాట్లాడుతూ.. “ఇది కేవలం సాంకేతిక సహాయం కాదు. ప్రజల ప్రాణాల కోసం నిలిచే ఆశ. క్యాన్సర్పై పోరాటానికి కేంద్ర మంత్రుల సహకారం మాకు బలాన్ని ఇస్తోంది. ఓఎన్జీసీ యాజమాన్యానికి, కేంద్ర మంత్రులు హర్దీప్ సింగ్ పూరి, డా. పెమ్మసాని చంద్రశేఖర్ కు హృదయపూర్వక కృతజ్ఞతలు” అన్నారు.