Suryaa.co.in

Andhra Pradesh

అధికారంలోకి రాగానే భూహక్కు చట్టం రద్దు

-భూహక్కు చట్టం అమల్లోకి వస్తే ప్రజల ఆస్తులు తాకట్టే
-రైతు సమస్యలపై జగన్ కు అవగాహన లేదు…రైతులంటే గౌరవం లేదు
-ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి రైతుకూ యేడాదికి రూ.20 వేలు పెట్టుబడి సాయం
-నకిలీ బ్రాండ్లతో మహిళల మాంగళ్యాలు తెంచి ఖజానా నింపుకుంటున్న జగన్
-నకిలీ బ్రాండ్లు అరికట్టి…ప్రజల ప్రాణాలు కాపాడుతాం
-యువత జీవితం చీకట్లో ఉంది…అన్ని వర్గాలు సంక్షోభంలోకి వెళ్లాయి
-ఐదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు…ఉద్యోగం వచ్చేదాకా రూ.3 వేల నిరుద్యోగ భృతి
-సూపర్-6 పథకాలతో ప్రజల జీవితాల్లో వెలుగులు
-నరసాపురం ప్రజాగళం సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు

నరసాపురం : భూ హక్కు చట్టం అమల్లోకి వస్తే ప్రజల ఆస్తుల తాకట్టేనని…తాము అధికారంలోకి రాగానే ఆ చట్టాన్ని రద్దు చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. జగన్ కొత్తగా తెచ్చిన భూహక్కు చట్టం వల్ల ఎవరి ఆస్తులకూ రక్షణ ఉండదన్నారు. బ్రిటీష్ పాలకులు కూడా చేయని ఘోరమైన పనులు జగన్ చేస్తున్నాడని మండిపడ్డారు. భూ దాహంతో ఇటీవల ఒంటిమిట్టలో చేనేత కుటుంబాన్ని జగన్ రెడ్డి ముఠా బలితీసుకుందన్నారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో శుక్రవారం ప్రజాగళం సభలో చంద్రబాబు నాయుడు ప్రసంగించారు.

‘‘త్వరలో జరగనున్న ఎన్నికల్లో మీరు రెండు బటన్లు నొక్కాలి. పార్లమెంట్ అభ్యర్థికి కమలం గుర్తుపై….ఎమ్మెల్యే అభ్యర్థికి గాజుగ్లాసు గుర్తుపై నొక్కాలి. ఆ గాజుగ్లాస్ జగన్ గుండెలపై నిలబడాలి. రాబోయే ఎన్నికలు మన జీవితాలు సరిదిద్దుకునేందుకు వచ్చే అవకాశం’’ అని పిలుపునిచ్చారు.

యువత జీవితం చీకట్లో…అన్ని వర్గాలు సంక్షోభంలో
ఐదేళ్లుగా ఈ జలగ పాలనలో అందరం బాధితులయ్యాం. మన జీవితాలు బుగ్గిపాలయ్యాయి. యువత జీవితం చీకట్లోకి వెళ్లింది..అన్ని వర్గాలు సంక్షోభంలోకి వెళ్లాయి. ఏపీలో ఒక్క రైతు అయినా బాగున్నాడా? కాటన్ దొర ధవళేశ్వరం బ్యారేజ్ కట్టాడు. నేటికీ ఆయన మన మనసులో నిలిచిపోయారు. మనకు తిండి పెట్టే రైతన్న పరిస్థితి జగన్ పాలనలో కుదేలైంది. రైతు సమస్యలపై జగన్ కు అవగాహన లేదు…రైతంటే గౌరవం లేదు. సాగు, రైతును ముంచేశాడు. గోదావరి డెల్టా చరిత్రలో ఇంతటి దయనీయ స్థితి ఎప్పుడూ చూడలేదు.

ధాన్యం నింపుకోవడానికి రైతులకు కనీసం గోనె సంచి ఇవ్వలేకపోయాడు. దేశం మొత్తంలో మన రాష్ట్రంలోనే 93 శాతం మంది రైతులు అప్పుల్లో కూరుకుపోయారు. 2014లో మన ప్రభుత్వమే రైతు రుణమాఫీ చేసింది. వ్యవసాయాన్ని లాభసాటిగ చేశాం. కోసాలో ఆక్వా రంగాన్ని ఆదుకున్నాం. రైతు భరోసా కింద రూ.12,500 ఇస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చి…రూ.7,500లే ఇచ్చి చేతులు దులుపుకున్నాడు.’’ అని విమర్శించారు.

ఆక్వారంగానిక పూర్వవైభవం
జగన్ మాటలు చూస్తే కోటలు దాటతాయి…చేతలు మాత్రం గడప దాటవు. ఎన్డీఏ ప్రభుత్వం రాగానే ఆక్వా రంగానికి పూర్వ వైభవం తెస్తాం. రూ.1.50లకే కరెంటు ఇస్తాం. ఎన్డీయే ప్రభుత్వం రాగానే ప్రతి రైతుకు ఏడాదికి రూ.20 వేలు ఇచ్చి ఆదుకుంటాం. రాజకీయాలంటే సేవాభావమని పవన్ కల్యాణ్ చాటిచెప్పాడు. జన సైనికులు ఉత్సాహంగా ఉన్నారు. జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రం మరోసారి నష్టపోకూడదనే ఉద్దేశంలో పొత్తుకు చొరవ చూపింది పవన్ కల్యాణే.

మేమంతా జట్టు కట్టాం. దేశాన్ని ప్రపంచంలో అగ్రస్థానంలో నిలబెట్టాలని నరేంద్ర మోదీ కష్టపడుతున్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో 2047కి భారతదేశం ప్రపంచంలోనే నెంబర్ వన్ గా తయారవుతుంది. కేంద్రంలో మళ్లీ వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వమే. ఏపీలో 160పైగా ఎమ్మెల్యే స్థానాలు మనమే గెలుస్తున్నాం’’ అని ధీమా వ్యక్తం చేశారు.

5వ తారీకు వచ్చినా ఉద్యోగులకు జీతాల్లేవ్
ఈ ఐదేళ్లలో జగన్ రెడ్డి రూ.13 లక్షల కోట్లు అప్పు తెచ్చి మన నెత్తిపై కుంపటి పెట్టాడు. 5వ తారీకు వచ్చినా ఇంత వరకూ ఉద్యోగులకు జీతాలు పడలేదు. వృద్ధులకు పింఛను ఇవ్వకుండా శవ రాజకీయాలు చేసిన నీచుడు జగన్. వైసీపీ డీఎన్ఏలోనే శవ రాజకీయం ఉంది. తండ్రి చనిపోతే సానుభూతి పొందాడు. బాబాయ్ ని తానే చంపించి ఓటేయమని అడిగాడు. పాత సినిమాలో నాగభూషణం ఉండే వాడు.

వాళ్లే చంపేసి వాళ్లే దండేసి ఆ కేసు వేరే వారిపై తోస్తాడు…అలాంటి వ్యక్తిత్తం జగన్ ది. ఫ్యాన్ అరిగిపోయింది…తిరగని ఫ్యాన్ మనకు అవసరమా? ఫ్యాన్ ను ముక్కలు ముక్కలు చేసి చెత్తకుప్పలో పడేయాలి. బచ్చా జగన్ కు నేనేంటో చూపిస్తా. నరసాపూర్ ఎక్స్ ప్రెస్ స్పీడ్ పెంచాలి. జాబ్ రావాలంటే ఎన్డీఏ రావాలి. పరిశ్రమలు తెచ్చే శక్తి మాకే ఉంది.’’ అని హామీ ఇచ్చారు.

సూపర్-6 పథకాలతో ప్రజల జీవితాల్లో వెలుగులు
దేశంలోనే 24 శాతం నిరుద్యోగత ఉన్న రాష్ట్రం ఏపీ. భవిష్యత్ లో యువతకు రూ.20 లక్షలఉద్యోగాలు ఇస్తాం. మెగా డీఎస్సీ నిర్వహిస్తాం. యేటా జాబ్ క్యాలండర్ ఇస్తాం. ఉద్యోగాలు ఇచ్చేవరకూ నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తాం. నరసాపురంలో యువతకు స్థానింగానే ఉద్యోగాలు ఇస్తాం. జగన్ రెడ్డి మనకు ఏం చేశాడయ్యా అంటే జే బ్రాండ్ తెచ్చాడు. డ్రగ్స్ తో యువత భవిష్యత్ నాశనం చేశాడు. వైసీపీ నేతలే గంజాయి అమ్మే పరిస్థితులు తెచ్చారంటే ఏమనాలి?

అన్ని చార్జీలు పెంచి పేద, మధ్యతరగతి ప్రజలను ఇబ్బందులపాలు చేసిన జగన్ రెడ్డిని చిత్తుగా ఓడించండి. సూపర్ -6 కార్యక్రమాల ద్వారా మీ జీవితాల్లో వెలుగులు తెస్తాం. మహిళలకు డ్వాక్రా పెట్టింది నేను. ఆస్తిలో మహిళలకు సమానహక్కు ఇచ్చింది టీడీపీ. ఉద్యోగాలు, కాలేజీల్లో రిజర్వేషన్లు పెట్టింది టీడీపీ. మహాశక్తి ద్వారా మహిళలను ఆర్థికంగా ఆదుకుంటాం. ఆడబిడ్డల భద్రతకు భరోసా ఇస్తాం. రూ.10 ఇచ్చి రూ.100 దోచే మనిషి జగన్ రెడ్డి’’ అని చంద్రబాబు విమర్శించారు.

నకిలీ బ్రాండ్లు అరికట్టి…ప్రజల ప్రాణాలు కాపాడుతాం
నేను, నరేంద్రమోదీ చేసేది సంపద సృష్టి. నేను సీఎంగా అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఇప్పుడున్నాయా? ఆనాడు బడ్జెట్ లో 19.9 శాతం సంక్షేమానికి ఖర్చు చేశాం. నేడు 10 శాతం కూడా ఖర్చు చేయడంలేదు. సంక్షేమ పథకాలను కక్షపూరితంగా రద్దు చేసి మాయమాటలు చెబుతున్న జగన్ రెడ్డి ఒట్టి బటన్ నొక్కుతున్నాడు. జగన్ నొక్కే బటన్ కూడా నిలిచిపోయింది. అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఆస్తుల మేసిన వారిపై చర్యలు తీసుకుంటాం. మత్సకారులను ఆదుకుంటాం.

వలలు, బోట్లు, డీజిల్ సబ్సిడీలు పునరుద్ధరిస్తాం. చుట్టుపక్కల ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం. వశిష్ట గోదావరిపై బ్రిడ్జ్ నిర్మిస్తాం. పేదలకు 2 సెంట్ల భూమిస్తాం. సురక్షిత మంచినీరు అందిస్తాం. రాబోయే ఎన్నికల్లో జగన్ రెడ్డిని చిత్తుచిత్తుగా ఓడించండి. ఒకప్పుడు క్యార్టర్ రూ.60…..ఇప్పుడు రూ.200. డిజిటిల్ పేమెంట్స్ లేవు. తాడేపల్లి ప్యాలెస్ ఖజానా నింపేందుకు నకిలీ మద్యంతో మహిళల మాంగళ్యాలు తెంచాడు.’’ అని చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు.

LEAVE A RESPONSE