Suryaa.co.in

Andhra Pradesh

త్వరలో అనిల్‌ యాదవ్ అరెస్ట్

– అక్రమాలు చేయకపోతే కాకాణి ఎందుకు పరారీలో ఉంటారు?
– బయటకు వచ్చి నిజాయతీపరుడినని నిరూపించుకోవచ్చు కదా
– ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర జోస్యం

నెల్లూరు: అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ త్వరలోనే అరెస్ట్ కాబోతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర జోస్యం చెప్పారు. ఇన్నాళ్లూ ఎక్కడున్నారో తెలియని అనిల్ కుమార్ యాదవ్ ఇప్పుడు బయటకు వచ్చి, కాకాణిపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మాట్లాడటం విడ్డూరంగా ఉందని బీదా అన్నారు. గూడూరు, సైదాపురం ప్రాంతాల్లో అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో కూడా భారీగా అక్రమ మైనింగ్ జరిగిందని ఆయన ఆరోపించారు.

ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజకీయాల్లోకి రాకముందే ఆయనకు అధికారికంగా మైన్స్ ఉన్నాయని, వాటికి, వైసీపీ నేతల అక్రమ మైనింగ్‌కు సంబంధం లేదని స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో జరిగిన అక్రమ మైనింగ్‌ వ్యవహారంలో మాజీ మంత్రులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్‌ల పాత్ర ఉందని ఆరోపించారు.

కాకాణి గోవర్ధన్ రెడ్డి కేసులకు భయపడి పరారీలో ఉన్నారని, వైసీపీ పాలనలో జరిగిన మైనింగ్ దోపిడీ గురించి, అందులో కాకాణి గోవర్ధన్ రెడ్డి పాత్ర గురించి ప్రజలందరికీ తెలుసని బీదా అన్నారు. అక్రమాలు చేయకపోతే కాకాణి ఎందుకు పరారీలో ఉంటారు? బయటకు వచ్చి తాను నిజాయతీపరుడినని నిరూపించుకోవచ్చు కదా అని ఆయన ప్రశ్నించారు. కేసులకు భయపడటం వల్లే కాకాణి కనిపించకుండా పోయారని ఎద్దేవా చేశారు.

రుస్తుం మైన్స్‌లో కాకాణి అక్రమ తవ్వకాలు చేయించారని.. గతంలో అక్రమ మైనింగ్‌కు వ్యతిరేకంగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నిరసన దీక్ష చేపడితే, ఆయనపై దాడికి ప్రయత్నించిన ఘటనలకు వీడియో సాక్ష్యాలు కూడా ఉన్నాయని బీదా రవిచంద్ర గుర్తుచేశారు.

LEAVE A RESPONSE