Suryaa.co.in

Andhra Pradesh

మాట తప్పిన ముఖ్యమంత్రి.. మళ్లీ రోడ్డెక్కుతాం

– జీపీఎఫ్ విషయంలో సహనాన్ని పరీక్షించవద్దు
– ఫ్రంట్‌లైన్ వారికి ఉద్యోగాలేవీ?
– ఏపీ అమరావతి జేఏసీ నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు

విశాఖపట్నం : ఉద్యోగ సంఘాలతో చర్చల సందర్భంగా ఇచ్చిన హామీలేవీ నెరవేరడం లేదని ఐకాస నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు విమర్శించారు. సీఎం ఇచ్చిన మాట తప్పారని తమ సహనాన్ని పరీక్షిస్తే మళ్లీ రోడ్డుమీదకు వస్తామని ఆయన హెచ్చరించారు. కరోనా సమయంలో చనిపోయిన ప్రభుత్వ ఉద్యోగుల స్థానంలో కారుణ్య నియామకాలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఉన్నతాధికారులు ఎవరూ సహకరించడం లేదని బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

జీపీఎఫ్ డబ్బుల విషయంలో ముఖ్యమంత్రి జగన్ మాట తప్పారని, ఈ అంశంలో తమ సహనాన్ని పరీక్షించవద్దని ఏపీ జేఏసీ నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు హెచ్చరించారు. విశాఖ రెవెన్యూ ఉద్యోగుల సంఘ భవనంలో మీడియా సమావేశం నిర్వహించారు. పే స్కేల్ విషయంలో ప్రభుత్వ ఉద్యోగులకు అన్యాయం జరుగుతోందని, పే స్కేల్ను ఏ శాఖకు సంబంధించిన వారికి క్యాడర్ వారీగా ఇవ్వాలని అన్నారు. కరోనా కాలంలో ఎంతోమంది ప్రభుత్వ ఉద్యోగులు చనిపోయారని.. చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు వన్ టైమ్ సెటిల్మెంట్ కింద తక్షణమే ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

కేవలం ఫ్రంట్ లైన్ వారియర్కే ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇప్పుడు అది కూడా అమలు కావడం లేదని ఆవేదన చెందారు. డీఏలు వేల కోట్ల రూపాయల బకాయి ఉందని, వాటిని వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. టీచర్స్ బయోమెట్రిక్ హాజరు ఇబ్బందులపై ఉన్నతాధికారులు ముఖ్యమంత్రికి తెలియజేయాలన్నారు. అన్ని బకాయిలు కలిపి ఉద్యోగులకు 20 వేల కోట్ల రూపాయల వరకు ప్రభుత్వం బాకీ పడిందని చెప్పుకొచ్చారు.

LEAVE A RESPONSE