-ఇది కోర్టు ధిక్కరణ కాదా?
-ప్రభుత్వంపై ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నల వర్షం
-ప్రభుత్వంపై ఏపీ హైకోర్టు ఆగ్రహం
అమరావతి: వైసీపీ ప్రభుత్వంపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజాప్రతినిధులపై నమోదైన కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఉన్నప్పటికీ కేసులు ఉపసంహరించుకోవడంపై ధర్మాసనం ఆగ్రహించింది. ప్రభుత్వంపై ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నల వర్షం కురిపించారు.
సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల అనుమతి తీసుకోవాలని చెప్పినప్పటికీ కేసులు ఎలా ఉపసంహరిస్తారని ప్రశ్నించింది. తమ అనుమతి లేకుండా కేసులు ఉపసంహరించుకోవడం దేనికి సంకేతమని నిలదీసింది. ఇది కోర్టు ధిక్కారం కిందకు వస్తుంది కదా అని ధర్మాసనం ప్రశ్నించింది.
‘‘మేము అనుమతి ఇచ్చిన తర్వాతే ఉపసంహరణపై మీరు జీవోలు ఇవ్వాలి కదా.? ప్రజా ప్రతినిధులపై కేసుల ఉపసంహరణ జీవోలను మేము కొట్టేస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయి. ఈ దశలో మీరు ఏం చేయాలో మీరే తేల్చుకోండి’’ అంటూ ప్రభుత్వ న్యాయవాదికి సూచించింది. రెండు వారాల్లో అన్ని వివరాలను కోర్టు ముందు ఉంచుతామని ప్రభుత్వ లాయర్ కోర్టుకు తెలిపారు.
జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను పై కేసుల ఉపసంహరణను సవాల్ చేస్తూ వేసిన పిటిషన్పై బుధవారం విచారణ జరిగింది. కేసుల ఉపసంహరణపై సుమోటోగా స్వీకరించిన వ్యాజ్యంపై కలిపి విచారణ జరిగింది. పిటిషన్లపై న్యాయవాది జడ శ్రవణ్కుమార్ వాదనలు వినిపించారు. అనంతరం తదుపరి విచారణను హైకోర్టు వారం రోజులకు వాయిదా వేసింది