Suryaa.co.in

Andhra Pradesh

సీమకు వెన్నుపోటులో బాబుకు ట్రాక్ రికార్డ్

– సీమకు ద్రోహం చేసి.. సిగ్గులేకుండా పర్యటనలా..?
– కొదమ సింహానివో..గ్రామ సింహానివో ప్రజలు తేల్చారు
– పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ సామర్ధ్యం పెంచింది వైఎస్సార్‌ కాదా..?
– అదే జరగకపోతే కృష్ణా జలాలు సీమకు వచ్చేవా..?
– పోతిరెడ్డిపాడుకు వ్యతిరేకంగా.. నాడు ప్రకాశం బ్యారేజీపై ధర్నాలు చేయించింది నువ్వు కాదా..?
– గండికోట రిజర్వాయర్‌ సామర్ధ్యాన్ని 3 టీఎంసీలకు కుదించిన ఘనుడు చంద్రబాబు.
– ముందు సీమ ప్రజలకు క్షమాపణ చెప్పి మాట్లాడు..!
-కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి.

కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే..

సిగ్గులేకుండా పర్యటనలా..?:
ప్రతిపక్ష నేత చంద్రబాబు పులివెందులకు వచ్చి పచ్చి అబద్ధాలు మాట్లాడి వెళ్లాడు.
సెల్‌ ఫోన్‌ తానే కనిపెట్టాను అంటాడు.. ఎండ నుంచి కరెంట్‌ తానే తయారు చేశాను అంటాడు.
ఆయన రాయలసీమకు ద్రోహం చేసి, సాగునీటి ప్రాజెక్టులు సందర్శన పేరుతో సిగ్గులేకుండా ఎలా పర్యటిస్తున్నాడో అర్ధం కావడం లేదు.

చంద్రబాబు ఒక అబద్ధాన్ని ఎంతో ధైర్యంగా, ఎంతో గంభీరంగా కళ్లు ఆర్పకుండా గట్టిగట్టిగా అరుస్తూ చెప్పగలిగిన వ్యక్తి చంద్రబాబు.

పొతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ 11వేల క్యూసెక్కుల సామర్ధ్యం ఉన్నప్పుడు రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సాగునీరు అందించాలంటే సరిపోవు.

దాంతో, దాన్ని నాలుగు రెట్లు అంటే 44వేల క్యూసెక్కుల సామర్ధ్యానికి పెంచిన ఘనత మహానేత డాక్టర్‌ వైఎస్సార్‌ ది.

ఈ 6 జిల్లాలకు నీళ్లిచ్చేందుకు 44వేల క్యూసెక్కులకు పెంచితే చంద్రబాబు, ఆయన వందిమాగధులతో ధర్నాలు చేయించాడు.

అప్పట్లో టీడీపీ శాసనసభ్యుడు నాగం జనార్ధనరెడ్డితో జడ్చర్లలో, ప్రకాశం బ్యారేజీపై దేవినేని ఉమాతో ధర్నాలు చేయించాడు.

ఇవన్నీ ప్రజలు చూసినవే… కానీ చంద్రబాబు మాత్రం ప్రజలు మర్చిపోయారు అనుకుంటున్నాడు.
గండికోట రిజర్వాయర్‌ సామర్ధ్యాన్ని 3 టీఎంసీలకు కుదించిన ఘనుడు చంద్రబాబు.
వైఎస్సార్‌ వచ్చాక దాన్ని 27 టీఎంసీలుగా చేశారు.
చంద్రబాబు హయాంలో 11 టీఎంసీల కాంటూర్‌ వరకు కూడా ఆర్‌ అండ్‌ ఆర్‌ అందించలేకపోయాడు.

ప్రాజెక్టులో ఎన్నడూ పూర్తి స్థాయి సామర్ధ్యంలో నీటిని నింపిన దాఖలాలు లేవు.
జగన్మోహన్‌రెడ్డి గారు వచ్చిన తర్వాత అక్కడి ఆర్‌ అండ్‌ ఆర్‌ అంతటినీ పూర్తి చేసి 27 టీఎంసీల పూర్తి సామర్ధ్యాన్ని నింపి సీమకు నీళ్లిస్తున్నారు.

నేడు గండికోటలో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేసుకుంటున్నాం.. అంటే అది కేవలం అక్కడి నిర్వాసితులకు రూ.950 కోట్ల పరిహారం జగనన్న ప్రభుత్వం ఇవ్వబట్టే.
గతంలో చంద్రబాబు 3టీఎంసీలే చాలు అంటే జగన్‌ 27 టీఎంసీలు నింపి చూపించారు.

చిత్రావతి విషయంలో బాబు హయాంలో ఏనాడూ రెండు మూడు టీఎంసీలు కూడా నింపలేదు.
చిత్రావతి నీళ్ల కోసం ఎన్నో సార్లు గొడవ పడ్డాం. పాదయాత్రలు చేశాం.చిత్రావతి కెపాసిటీ 10 టీఎంసీలైతే.. చంద్రబాబు ఏనాడూ దానిని పూర్తిగా నింపాలనే ప్రయత్నమే చేయలేదు.

జగన్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత రూ. 600 కోట్లతో.. పునరావాసం కల్పించడం ద్వారా 10 టీఎంసీల పూర్తి సామర్ధ్యాన్ని నింపుకుంటున్నాం.తన 14 ఏళ్లలో ఏనాడూ సీమ ప్రాజెక్టుల గురించి పట్టించుకోని పెద్దమనిషి ఇక్కడకు వచ్చి నోటికొచ్చిన ఆబద్దాలు మాట్లాడుతున్నాడు.
కొత్తగా వచ్చిన యువతకు సాగునీటి ప్రాజెక్టుల గురించి తెలియదని ఇష్టం వచ్చినట్లు ఆబద్దాలు ఆడిపోతున్నాడు.

డ్రిప్‌ కంపెనీలకు బాబు వెయ్యి కోట్లు ఎగ్గొట్టింది నిజం కాదా..?
2016–19 వరకూ డ్రిప్‌ ఇరిగేషన్‌ కు సంబంధించి చంద్రబాబు ఆయా కంపెనీలకు చెల్లించకుండా రూ.వెయ్యి కోట్లు బకాయిలు పెట్టడంతో స్కీం పూర్తిగానిర్వీర్యం అయిపోయింది.

జగన్‌ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్ని సమస్యలున్నా ఆ వెయ్యి కోట్లు డ్రిప్‌ కంపెనీలకు చెల్లించి గత ఏడాది రీస్టార్ట్‌ చేశారు.గత ఏడాది 10వేల హెక్టార్లలో, ఈ ఏడాది 12 వేల హెక్టార్లలో రైతులకు డ్రిప్‌ పరికరాలు అందిస్తున్నాం.నువ్వు నిర్వీర్యం చేస్తే జగన్‌ నీ బకాయిలు చెల్లించి రీస్టార్ట్‌ చేస్తే అంతా తానే చేశానంటున్నాడు.పంటల బీమా విషయంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎంత ఇచ్చారు..? జగన్‌ వచ్చాక ఎంతిచ్చారో లెక్కలు తీయండి.

చంద్రబాబు ఇచ్చిన దాని కంటే రెండు రెట్లకు పైగా జగన్‌ ప్రభుత్వం అందించింది.ఈ క్రాప్‌ విధానాన్నే వాళ్లు విమర్శిస్తున్నారు. దీనివల్ల బీమా చెల్లింపే కాదు.. అన్నివిధాలా రైతులకు ఉపయోగంగా ఉంటుంది.నష్టపోయిన ప్రతి రైతుకు అరటి, మామిడి రైతులకు కూడా పరిహారం అందిస్తూనే ఉన్నాం.

2014–19 వరకూ చంద్రబాబు హయాంలో వైఎస్సార్‌ జిల్లాలో 2012ఏడాదికి సంబంధించిన శనగ పంట బీమా పెండింగ్‌ ఉంది.ఈ సమస్యను ఆనాడు నువ్వు ఎందుకు తీర్చలేదు చంద్రబాబూ..?
జగన్‌ గారు వచ్చిన తర్వాత తొలి ఏడాదిలోనే రూ. 112 కోట్లు రైతుల ఖాతాల్లో వేయడం జరిగింది.

పైడిపాలెం వైఎస్సార్‌ బ్రెయిన్‌ ఛైల్డ్‌
పైడిపాలెంలో రిజర్వాయర్‌ కట్టాలనే ఆలోచన వైఎసార్‌ దే. ఆయన హయాంలోనే 90 శాతం పనులు పూర్తయ్యాయి.పైడిపాలెం ప్రాజెక్టు వైఎస్సార్‌ గారి బ్రెయిన్‌ ఛైల్డ్‌. దీని కోసం ఇరిగేషన్‌ అధికారులు కూడా ఆలోచన చేయలేదు.దానిని ఇప్పుడు చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటున్నాడు.

కడప ఎయిర్‌ పోర్టు రన్‌ వే కోసం రైతులకు రూ.75 కోట్లు జగనన్న ప్రభుత్వమే నష్టపరిహారం చెల్లించింది.
ఈ రోజు రన్‌ వే విస్తరణ జరిగి, పెద్ద ఫ్లైట్‌లు వస్తున్నాయంటే అది జగన్‌ చలువే.నైట్‌ ల్యాండింగ్‌ కూడా ఈయన చలువేనట. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేమంతా కావాల్సిన అనుమతులు సాధించుకుని వస్తే అది కూడా తనవల్లే అంటాడు.కనీసం చెప్పే దాంట్లో ఒకటన్నా నిజం ఉండాలి కదా..?పైడిపాలెం రిజర్వాయర్‌కు సంబంధించి… నాడు నేను చంద్రబాబు స్టేజ్‌ మీద ఉండగానే.. లెక్కచెప్తే నా మైకు లాక్కున్నారు.

బాబు అబద్ధాల ప్రపంచం
ఏదో సినిమాలో చెప్పినట్లు అవసరం అయితే.. ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాననన్నట్లు… చంద్రబాబు పచ్చి అబద్దాల ప్రపంచాన్నిసృష్టిస్తున్నాడు.నువ్వు మామూలు ప్రపంచలోకి రా నాయనా.. ఇక భగవంతుడే ఆ పని చేయాలి.హాస్యనటుడు మాట్లాడినట్లు చంద్రబాబు మాట్లాడుతున్నాడు..ఇకనైనా సాధారణ ప్రపంచంలోకి రా చంద్రబాబూ..! ఇదంతా చూస్తుంటే ఆయన ఎంత ఫ్రస్టేషన్లో ఉన్నాడో అర్ధం అవుతుంది.

పులివెందులకు నిధులిస్తే కూడా ఏడుపేనా..:

జగన్‌ ఎంతో ఉన్నతమైన ఆలోచనతో ఈ ప్రాంతానికి ఒక మెడికల్‌ కాలేజీ ఇచ్చాడు. త్వరలో ఒక అగ్రికల్చర్, హార్టికల్చర్‌ కాలేజీలు కూడా ప్రారంభం కాబోతున్నాయి.ఇక్కడకు చాలా మంది ప్రొఫెసర్లు, సిబ్బంది కూడా వస్తున్నారు. వారి కోసం ఈ పట్టణాన్ని మోడల్‌ టౌన్‌గా చేయాలని జగన్‌ ఆశించారు.అలాంటిది పులివెందులకు అన్ని నిధులు అవసరమా అని చంద్రబాబు అనడం ఆశ్చర్యాన్ని కలిగించింది.

ఏమీ చేయడం లేదని నువ్వే విమర్శిస్తావు..నిధులిస్తే అవసరమా అంటావు. నీలాగే జగన్‌ ఆలోచించి ఉంటే కుప్పానికి రెవిన్యూ డివిజన్‌ ఇచ్చేవాడా..? నీ మాదిరిగా జగన్ సంకుచితంగా ఆలోచించలేదు…నీవు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పాన్ని కూడా గుండెల్లో పెట్టుకుని అభివృద్ధి చేస్తున్నారు.కుప్పం బ్రాంచి కెనాల్‌ పనులను కూడా పూర్తి చేస్తున్నారు. చిత్తశుద్ధితో ఆ నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నాడు.నీలా ఇన్ని నిధులు అవసరమా అని ఏనాడూ జగన్ మాట్లాడలేదు. వేరే జిల్లాలకు వెళ్లి పులివెందుల రౌడీలు, గూండాలు అని మాట్లాడే చంద్రబాబు… ఇక్కడకు వచ్చి ఇన్ని నిధులు అవసరమా అంటున్నాడు. ఎందుకు మా ప్రాంతం పట్ల నీకు అంత ద్వేషం.. సవతి తల్లి ప్రేమ.

కొదమ సింహానివో..గ్రామ సింహానివో ప్రజలు తేల్చారు:

మనం కొదమసింహాలమా..వృద్ధ సింహాలమా..గ్రామ సింహాలమా అనేది ప్రజలు తేల్చారు.
నిన్ను చూసి ప్రజలంతా ఒక కమెడియన్‌ అనుకుంటున్నారు.ఇతను భయస్థుడు కాబట్టే తాను ధైర్యవంతుడిని అని చెప్పుకునేందుకు మాటి మాటికి కొదమ సింహం అని చెప్పుకుంటున్నాడు.
బద్వేల్‌తో మొదలు పెడితే జిల్లాలో ఎన్నో పరిశ్రమలు వచ్చాయి.

బద్వేల్‌లో సెంచురీ ప్లై తీసుకొచ్చాం. ఈ డిసెంబర్‌లో ప్రారంభోత్సవం జరుగుతుంది.కొప్పర్తిలో డిక్సన్‌ కంపెనీతోపాటు పలు పరిశ్రమలు వస్తున్నాయి.జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ ప్లాంటు కోసం పర్యావరణ అనుమతులు పూర్తి కాగానే పని మొదలు పెట్టటానికి వారు సిద్ధంగా ఉన్నారు. పులివెందులలో న్యూటెక్‌ బయోసైన్సెస్‌ వారు తమ కార్యకలాపాలు కూడా ప్రారంభించారు.

ఆదిత్య బిర్లా కంపెనీ పూర్తిగా ఆరేడు నెలల్లో అందుబాటులోకి రాబోతున్నాయి.అపాచీ ప్లాంటు కూడా నిర్మాణంలో ఉంది. పులివెందుల వచ్చి, ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని మెచ్చుకోకపోతే సర్లే కానీ..ఇష్టం వచ్చినట్లు అబద్దాలు చెప్పడం సమంజసం కాదు.

ధర్మం గురించి చంద్రబాబు మాట్లాడటం విడ్డూరం:

ధర్మం గురించి చంద్రబాబు మాట్లాడటం హాస్యాస్పదం.
నన్ను నా కుటుంబాన్ని సర్వనాశనం చేయాలని చంద్రబాబు, నా సోదరి, బీజేపీలోని టీడీపీ నేతలు, వ్యవస్థల్లోని కొంతమంది పెద్దలు అంతా కలిసికట్టుగా రెండున్నరేళ్లుగా కుట్రలు చేస్తున్నారు.

వారి అంతిమ లక్ష్యం… మా ద్వారా పార్టీని, జగన్‌ గారిని ఇబ్బంది పెట్టాలనేదే .
వివేకా హత్య కేసులో వాస్తవాలను పక్కన పడేసి, రాజకీయ కోణంలో ముందుకు తీసుకెళ్తున్నారు.
నిజంగా నువ్వు మాట్లాడిన మాటలపై నిలబడు చంద్రబాబు.
నువ్వు చెప్పిందే నేను చెప్తున్నా… ఎవరి పక్కన ధర్మం ఉంటే ఆ ధర్మమే వారిని కాపాడుతుంది. ధర్మో రక్షతి రక్షితః

సీమ ప్రజలకు క్షమాపణ చెప్పి మాట్లాడు:

తెలుగుగంగ ప్రాజెక్టులో బ్రహ్మంసాగర్‌కు నీరు రావాలంటే కావాల్సిన కాల్వ రిపేర్లు చేయాలని అనేక సార్లు విన్నవించాం.
ఆనాడు చంద్రబాబు కానీ, ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమా కానీ పట్టించుకున్న పాపాన పోలేదు.
జగన్‌ గారు వచ్చిన తర్వాత ఆ కాల్వలన్నీ ఆధునికీకరణ చేసి లైనింగ్‌ చేయించాం.
నేడు వెలిగోడు నుంచి బ్రహ్మంసాగర్‌కు 5వేల క్యూసెక్కుల సామర్ధ్యంతో నీళ్లు వస్తున్నాయి.
చిత్తశుద్ది ఉన్న నాయకుడు నువ్వా..జగన్‌ గారా..?
ఈ ప్రాంత ప్రజలకు నువ్వు క్షమాపణ చెప్పి, ఆ తర్వాతే ఏదైనా మాట్లాడితే కొద్దొగొప్పో నిన్ను విశ్వసిస్తారేమో.

బాబుదు వెన్నుపోటు ట్రాక్ రికార్డ్ః

చంద్రబాబు కొత్తగా రాజకీయాల్లోకి రాలేదు. తన 14 ఏళ్ల ముఖ్యమంత్రి ట్రాక్‌ రికార్డులో ప్రాజెక్టులు అన్నీ నాశనం చేశాడు.
2014లో రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తానని 87 వేల కోట్లకు 13 వేల కోట్లు ఇచ్చి రైతుల్ని ముంచేశాడు.

డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానని చెప్పి ఎన్నికలయ్యాక ఆ హామీని గాలికొదిలేశాడు.
ఏ గ్రేడ్‌లో ఉన్న డ్వాక్రా గ్రూపులు సీ గ్రేడ్‌కి పడిపోయి ఈయన పుణ్యాన డిఫాల్టర్లు అయ్యారు.
ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసి జబ్బులు, నెట్‌వర్క్‌ ఆస్పత్రుల సంఖ్య కూడా పెంచలేదు. ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ను నాశనం చేశాడు.

అందరికీ వెన్నుపోటు పొడిచిన ట్రాక్‌ రికార్డు చంద్రబాబుది.
ముందు.. 2014 మేనిఫెస్టోలో నువ్వు చెప్పిన హామీల్లో ఏం చేశావో చెప్తే జనం ఆలోచిస్తారు.
ఇప్పుడొచ్చి బిగ్గరగా అరిచి రాగాలు తీసి కొత్త హామీలు ఇస్తే జనం నమ్మరు.
కోవిడ్‌ సమయంలో కూడా రవాణా సౌకర్యం పెద్దగా లేకపోయినా రైతులు పండించిన అరటి, చినీ పంటలను కొనుగోలు చేశాం.

కృష్ణా నీరు పులివెందుల, కడపకు వస్తున్నాయంటే అది కచ్చితంగా రాజశేఖరరెడ్డి గారి పుణ్యమే.
పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ సామర్ధ్యం ఆనాడు వైఎస్సార్‌ గారు పెంచకుండా ఉండి ఉంటే రాయలసీమకు కృష్ణా జలాలు వచ్చి ఉండేవా..? అని ఎంపీ అవినాష్ రెడ్డి ప్రశ్నించారు.

 

LEAVE A RESPONSE