Suryaa.co.in

Andhra Pradesh

అవన్నీ బాబుకే సాధ్యం!

– వికసిత్ భారత్ కు ఏపి గ్రోత్ ఇంజిన్
– పెద్ద ప్రాజెక్టులు చేపట్టాలన్నా, త్వరగా పూర్తి చేయాలన్నా బాబుకే సాధ్యం
– పెద్ద పెద్ద పనులు పూర్తి చేయడంలో బాబును మించిన నేత దేశంలో లేరు
– టెక్నాలజీ కూడా ఆయనను చూసే నేర్చుకున్నా
– ఒక స్వప్నం సాకరం కాబోతుంది
– ఏపికి నిధుల కేటాయింపులో పెద్దపీట
– అగ్రశ్రేణి నగరంగా అమరావతి
– ప్రధాని మోదీ వరాల జల్లు

అమరావతి : దేశ ప్రగతిలో ఆంధ్రప్రదేశ్ ఒక చోదకశక్తిగా నిలవనుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వం వికసిత్ భారత్ నిర్మాణం కోసం అహర్నిశలు శ్రమిస్తోందని, వికసిత్ భారత్ నిర్మాణంలో ఏపి ఒక గ్రోత్ ఇంజిన్ గా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఏపిలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి, సంక్షేమ పధకాల జోరు పెరిగిందని, అందుకు అవసరమైన మేరకు కేంద్రం నుండి నిధులు ఇస్తున్నామని మోదీ చెప్పారు. ఏపి రాజధాని అమరావతిని అగ్రశ్రేణి నగరంగా తీర్చిదిద్దేందుకు కేంద్రం పూర్తి సహాయ, సహకారాలు అందిస్తుందని ఆయన భరోసా ఇచ్చారు.

అమరావతి పునర్నిర్మాణ పనులకు ప్రధాని మోదీ శుక్రవారం నాడు శంకుస్థాపన చేశారు. రాజధాని సహా రాష్ట్రంలో రూ.58 వేల కోట్ల ప్రాజెక్టులకు మోదీ శ్రీకారం చుట్టారు. మొత్తం 18 ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. రూ.49 వేల కోట్ల విలువైన రాజధాని పనులకు మోదీ శ్రీకారం చుట్టారు. వేదిక పైనుంచే అమరావతి పునఃనిర్మాణ పనులకు మోదీ శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. “దుర్గాభవానీ కొలువైన పుణ్యభూమిలో మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది. ఇప్పుడు నేను పుణ్యభూమి అమరావతిపై నిలబడి ఉన్నా. ఒక స్వప్నం సాకరం కాబోతుంది. దాదాపు రూ.60 వేల కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశాను. ఇవి కాంక్రీట్ నిర్మాణాలు కాదు.. ఏపీ ప్రగతికి, వికసిత్ భారత్‌కు బలమైన పునాదులు” అని చెప్పారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు అభినందనలు తెలిపారు.

“ఇంద్రలోకం రాజధాని.. అమరావతి. ఇప్పుడు ఏపీ రాజధాని పేరు కూడా అమరావతే. స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణానికి ఇది శుభ సంకేతం. ఏపీని ఆధునిక ప్రదేశ్, అధునాతన ప్రదేశ్‌గా మార్చే శక్తి .. అమరావతి. ఏపీ యువత కలలు సాకారమయ్యే రాజధానిగా అమరావతి ఎదుగుతుంది. ఐటీ, ఏఐ సహా అన్ని రంగాలకూ అమరావతి గమ్యస్థానంగా మారుతుంది. హరితశక్తి, స్వచ్ఛ పరిశ్రమలు, విద్య, వైద్య కేంద్రంగా అమరావతి అభివృద్ధి చెందుతుంది. అమరావతిలో మౌలిక వసతుల కల్పనకు కేంద్రం పూర్తి సహకారం అందిస్తుంది” అని మోదీ భరోసా ఇచ్చారు.

“టెక్నాలజీ నాతో మొదలైనట్లు చంద్రబాబు ప్రశంసించారు. నేను గుజరాత్ సీఎం అయ్యాక హైదరాబాద్‌లో ఐటీని ఎలా అభివృద్ధి చేశారో తెలుసుకున్నా. అధికారులను పంపించి హైదరాబాద్ ఐటీ అభివృద్ధిని అధ్యయనం చేయించా. పెద్ద ప్రాజెక్టులు చేపట్టాలన్నా.. త్వరగా పూర్తి చేయాలన్నా చంద్రబాబుకే సాధ్యం. పెద్ద పెద్ద పనులు పూర్తి చేయడంలో చంద్రబాబును మించిన నేత దేశంలో లేరు” అని మోదీ ప్రశంసించారు.

“2015లో ప్రజా రాజధానిగా అమరావతికి శంకుస్థాపన చేశా. గత పదేళ్లలో అమరావతికి కేంద్రం మద్దతుగా నిలిచింది. అమరావతి అభివృద్ధికి కేంద్రం అన్ని రకాలుగా సహకరించింది. ఇప్పుడూ అమరావతి అభివృద్ధికి కేంద్ర సహకారం కొనసాగుతుంది. అమరావతిలో అన్ని రకాల నిర్మాణాలకు కేంద్రం తోడ్పాటు అందిస్తాం” అని ప్రధాని ప్రకటించారు.

“ఎన్టీఆర్.. వికసిత ఏపీ కోసం కలలుగన్నారు. మనందరం కలిసి ఎన్టీఆర్ కలల్ని నిజం చేయాలి. వికసిత్ భారత్‌కు ఏపీ గ్రోత్ ఇంజిన్‌గా ఎదగాలి. పవన్ కల్యాణ్ .. ఇది మనం చేయాలి.. మనమే చేయాలి” అని పిలుపునిచ్చారు. “ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ నిలిచింది. ఏపీలో రైలు, రోడ్డు ప్రాజెక్టులకు కేంద్రం రూ.వేల కోట్లు సాయం చేస్తోంది. ఏపీలో కనెక్టివిటీకి కొత్త అధ్యాయం మొదలవుతుంది. రైల్వే ప్రాజెక్టులతో రాష్ట్రాల మధ్య అనుసంధానం పెరుగుతుంది. ఈ అనుసంధానం.. తీర్థయాత్రలకు, పర్యాటకాభివృద్ధికి సాయం చేస్తుంది” అన్నారు.

“ఒకప్పుడు ఏపీ, తెలంగాణకు రైల్వే బడ్జెట్ రూ.900 కోట్లలోపే ఉండేది. ఇప్పుడు ఒక్క ఏపీకే రూ.9 వేల కోట్ల రైల్వే నిధులు ఇచ్చాం. ఏపీకి గతం కంటే పది రెట్లు అధికంగా నిధులు కేటాయించాం. గత పదేళ్లలో ఏపీలో 750 రైల్వే బ్రిడ్జిలు, అండర్‌పాస్‌లు నిర్మించాం. ఏపీకి వందేభారత్, అమృత్ భారత్ రైళ్లు కేటాయించాం. ఏపీలో 70కి పైగా రైల్వేస్టేషన్లను అమృత్ భారత్ ప్రాజెక్టు కింద అభివృద్ధి చేస్తున్నాం. మౌలిక వసతుల కల్పనతో ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుంది. సిమెంట్, స్టీల్, రవాణా రంగాలు అభివృద్ధి చెందుతాయి. ఈ ప్రాజెక్టుల వల్ల ఏపీలో వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి” అని ప్రధాని మోదీ వివరించారు.

“రక్షణరంగాన్ని ఎంతో బలోపేతం చేస్తున్నాం. నాగాయలంకలో టెస్టింగ్ రేంజ్.. దుర్గామాతలాగా భారత రక్షణరంగానికి శక్తినిస్తుంది. శ్రీహరికోట నుంచి ప్రయోగించే ప్రతి రాకెట్ కోట్ల మంది భారతీయులకు గర్వకారణం” అన్నారు. జూన్ 21న ఏపీ ప్రజలతో కలిసి యోగా డేలో పాల్గొంటానని తెలిపారు. “ప్రపంచ వ్యాప్తంగా యోగాకు ప్రత్యేక గుర్తింపు ఉంది – వచ్చే 50 రోజులూ ఏపీలో యోగాకు అనుకూల వాతావరణం కల్పించాలి. ప్రపంచ రికార్డు సృష్టించేలా ఏపీలో యోగా కార్యక్రమాలు నిర్వహించాలి. జూన్ 21న ప్రపంచమంతా భారత్ వైపు, యోగా వైపు చూసేలా చేద్దాం” అని ప్రధాని పిలుపునిచ్చారు.

“మూడేళ్లలో అమరావతి పూర్తి చేయాలని చంద్రబాబు సంకల్పించారు. అమరావతి అభివృద్ధితో ఆంధ్రప్రదేశ్ దశ, దిశ మారుతుంది. ఏపీలో కలలు కనే వారితో పాటు వాటిని నిజం చేసే వాళ్లు ఎక్కువ మందే ఉన్నారు. ఏపీ అభివృద్ధిలో దూసుకుపోతోంది. ఇదే వేగం కొనసాగాలి” అని ప్రధాని మోదీ ఆకాంక్షించారు.

LEAVE A RESPONSE