– వారిద్దరినీ బ్లాక్మెయిల్ చేసేందుకు కేంద్రం కుట్ర
– వారిపై కొత్త కేసులు నమోదు చేసే ప్రమాదం-
– ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ సంచలన ఆరోపణ
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఒక కొత్త బిల్లు ఎన్డీయే కూటమిలోని టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. జేడీయూ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్లను బెదిరించి.. తమ అదుపులో ఉంచుకోవడానికేనని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు.
ఈ బిల్లు వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని తేజస్వి యాదవ్ ఆరోపించారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం టీడీపీ, జేడీయూ మద్దతుతోనే కొనసాగుతోందని, భవిష్యత్తులో వారిని రాజకీయంగా బ్లాక్మెయిల్ చేసేందుకే ఈ బిల్లును ఒక ఆయుధంగా వాడుకోవాలని చూస్తోందని ఆయన విమర్శించారు. దేశాభివృద్ధిని పక్కనపెట్టి విధ్వంసకర వ్యూహాలు రచిస్తున్నారని ఆరోపణలు చేశారు.
ఝార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్లను జైలుకు పంపారని.. ఇప్పుడు ఈ కొత్త చట్టం ద్వారా చంద్రబాబు, నితీశ్ వంటి నేతలను కూడా బెదిరించాలని చూస్తున్నారని అన్నారు. అవసరమైతే వారిపై కొత్త కేసులు బనాయించి, తమ చెప్పుచేతల్లో ఉంచుకోవడానికి కేంద్రం ఎంతకైనా తెగిస్తుందని అనుమానం వ్యక్తం చేశారు.
తీవ్రమైన నేరారోపణల కింద అరెస్టయిన ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు లేదా మంత్రులు 30 రోజుల్లోగా తమ పదవులకు రాజీనామా చేయాలని, లేదంటే వారిని తొలగించేలా ఈ బిల్లును రూపొందించిన విషయం తెలిసిందే.