-వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేరుస్తామంటూ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీని నెరవేర్చాల్సిందే
-బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ డిమాండ్
-ఈనెల 11న ‘‘మహాకాళ్’’ కారిడార్ ను జాతికి అంకితం చేస్తున్న ప్రధాని మోదీ
-అన్ని శైవక్షేత్రాల్లో ఆ సన్నివేశాలను వీక్షించాలంటూ బండి సంజయ్ పిలుపు
-వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా సంజయ్ సహా సీనియర్ నేతల ఘన నివాళి
‘‘వాల్మీకులారా… అసెంబ్లీ సాక్షిగా వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేరుస్తానని మాట తప్పిన కేసీఆర్ ను నిలదీయండి’’అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. వాల్మీకీ మహర్షి జయంతిని పురస్కరించుకుని బీజేపీ రాష్ట్ర కార్యాయలంలో ఆయన చిత్రపటానికి బండి సంజయ్ తోపాటు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర ఇంచార్జీలు తరుణ్ చుగ్, సునీల్ బన్సాల్, సహ ఇంఛార్జ్ అరవింద్ మీనన్, జాతీయ కార్యవర్గ సభ్యులు జితేందర్ రెడ్డి, గరికపాటి మోహన్ రావు, మాజీ మంత్రి ఏ.చంద్రశేఖర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొప్పు భాషా, సీనియర్ నేతలు చింతా సాంబమూర్తి, ఎం.ధర్మారావు, అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ తదితరులు పూల మాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడారు. అందులోని ముఖ్యాంశాలు….
వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా హిందూ బంధువులందరికీ శుభాకాంక్షలు. రామాయణం పేరు వింటేనే వాల్మీకీ మహర్షి గుర్తుకొస్తారు. వాల్మీకీ లేనిదే రామాయణం లేదు.. ప్రజలకు రామాయణం గురించి తెలిసేదే కాదు.. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఏ సాహిత్యాన్ని పరిశీలించినా రామాయణాన్ని మించింది మరొకటి లేదు. ప్రతి భారతీయుడు ఆదర్శ రాముడు, అందాల రాముడు, అయోధ్య రాముడిగా కొలుస్తున్నమంటే… వాల్మీకి మహర్షి గొప్పతనమే.
వాల్మీకి మహర్షి తొలుత కుటుంబ పోషణ కోసం చిన్న దొంగ తనాలు చేసే వారు. వాస్తవాలు తెలుసుకుని పూర్తిగా మారిపోయి ఎవరికీ సాధ్యంకాని రీతిలో ఘోర తపస్సు చేసి మహర్షిగా మారి రామాయణం రచించారు.
వాల్మీకి సమాజం ఈరోజు తమను తాము తక్కువ చేసుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. వాల్మీకీ వారసులైన మీరు పట్టుదలకు ప్రతీకలు.అసెంబ్లీ సాక్షిగా వాల్మీకీ సామాజికవర్గాన్ని ఎస్టీ జాబితాలో చేరుస్తామని కేసీఆర్ హామీ ఇచ్చి అమలు చేయకుండా మోసం చేస్తున్నారు.
వాల్మీకి సమాజం తినడానికి తిండిలేకుండా ఉంది. వారిని కేసీఆర్ ఆదుకోవాలి. ఎస్టీలకు ఇబ్బంది కలగకుండా అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.వాల్మీకులారా… మీరు ఇంకా యాచించే స్థాయిలో ఉండొద్దు… పట్టుదలకు ప్రతీకగా మారిన మీరు కేసీఆర్ పై తిరుగుబాటు చేయండి. మీ డిమాండ్ సాధన కోసం టీఆర్ఎస్ నేతలను నిలదీయండి.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ శక్తవంతమైన భారత్ గా తీర్చిదిద్దుతున్నారు. సాంస్కృతికంగా శక్తివంతం చేసేందుకు అయోధ్యలో దివ్యమైన భవ్యమైన రామ మందిరం నిర్మించారు. దివ్యమైన కాశీగా మార్చి జాతికి అంకితం చేశారు.
అందులో భాగంగా ఈనెల 11న ద్వాదశ జ్యోతిర్లంగాలు ఒక్కటైన ఉజ్జయినిలో మహంకాళి కారిడార్ ను జాతికి అంకితం చేస్తున్నారు. ఆరోజు దేశవ్యాప్తంగా ప్రజలకు ఆ కార్యక్రమం వీక్షించేలా చేయాలనే ఉద్దేశంతో ఆరోజు సాయంత్రం 5 గంటలకు ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రాల్లో ప్రొజెక్టర్ ను ఏర్పాటు చేసి ‘‘మహా కాళ్ కారిడార్’’ ను జాతికి అంకితం చేసే సన్నివేశాలను అందించాలని బీజేపీ నిర్ణయించింది. ఈ కార్యక్రమ ఇంఛార్జీగా ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ కు అప్పగించాం. హిందూ సమాజమంతా ఆరోజు సాయంత్రం 5 గంటలకు వీక్షించాలని కోరుతున్నాం.