ప్రధాని వద్దకు పోయి నిధుల సంగతి తేలుద్దామా?

– తెలంగాణకు అన్యాయం జరుగుతుందని నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా
– తప్పయితే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తావా?
– కేసీఆర్ కు బండి సంజయ్ బహిరంగ సవాల్
కేంద్ర ప్రభుత్వం నిధుల విషయంలో తెలంగాణ కు అన్యాయం చేస్తుందని పదేపదే ఆరోపణలు చేస్తున్న టీఆర్ఎస్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కమార్ సవాల్ విసిరారు. ‘‘ నేను కేసీఆర్ కు సవాల్ విసిరుతున్నా….ఇద్దరం కలిసి ప్రధాని వద్దకు వెళదాం. నిధుల విషయంలో తెలంగాణకు కేంద్రం ఏమీ ఇస్తలేదని నిరూపించు. అక్కడికక్కడే నా పదవికి రాజీనామా చేస్తా. ఒకవేళ కేంద్రమే నిధులిస్తుందని నిరూపిస్తే నువ్వు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమా?’’అని సవాల్ విసిరారు.
టీఆర్ఎస్-బీజేపీ ఒక్కటేనని జరుగుతున్న ప్రచారంపై స్పందిస్తూ…. ‘‘కొందరు పనిలేని కాంగ్రెస్ నేతలు అవాకులు చవాకులు పేలుతున్నరు. క్రికెట్ భాషలో చెప్పాలంటే…. వీళ్లకు టీఆర్ఎస్ కెప్టెన్ అయితే, ఎంఐఎం వైస్ కెప్టెన్. కాంగ్రెస్ నేతలు ఎక్స్ ట్రా ప్లేయర్ల లాంటి వాళ్లు. టీఆర్ఎస్ తో కలిసి పోటీ చేసింది, పొత్తు పెట్టుకున్నది కాంగ్రెస్, ఎంఐఎం. గతంలో పోటీ చేసింది వీళ్లే. కాంగ్రెస్ నుండి గెలిచి టీఆర్ఎస్ లోకి వలస వెళ్లేది ఆ పార్టీ వాళ్లే’’అని దుయ్యబట్టారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా 22వ రోజు పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ ఎల్లారెడ్డి పట్టణంలో జరిగిన సభలో వేలాది మంది ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్బంగా బండి సంజయ్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు…..
ముఖ్యమంత్రి కేసీఆర్ ది అంతా సినిమాలో చూపించి ‘బీదర్ ఇసుక వ్యవహారమే’. పైకి చెప్పేదొకటి…లోపల జరిగేదొకటి. ఢిల్లీకి పోయి చెప్పేదొకటి…జరిగేదొకటి. రాష్ట్రానికి వేల కంపెనీలు వచ్చాయని, పక్క రాష్ట్రంలో పుడితే బాగుండదని ఇతర రాష్ట్రాల ప్రజలంతా అనుకుంటున్నారని చెబుతున్న కేసీఆకు నేను చెప్పేదొక్కటే….నిజంగా వేల కంపెనీలు వస్తే మీకు నేనే తోమాల సేవ చేస్తా….లేకుంటే ఎత్తుకెళ్లి పక్క రాష్ట్రంలో పడేసి వస్తా. తెలంగాణ ప్రజల పీడ వదిలిపోతుంది.
నిన్న ఒక్కరోజే 2.5 కోట్ల మంది వ్యాక్సిన్ వేయడం ప్రపంచంలోనే రికార్డు. నరేంద్ర మోదీకి ధన్యవాదాలు. తెలంగాణ సమర యోధులను గుర్తిస్తం. పక్కా పెన్షన్ ఇస్తామని అమిత్ షా చెప్పారు. అమిత్ షా నిర్మల్ కు వచ్చి మతవిద్వేషాలు రగిలిస్తున్నారని టీఆర్ఎస్ నేతలంటున్నరు. నేనంటున్న కేసీఆర్ అంబేద్కర్, జగ్జీవన్ రాం జయంతి, వర్దంతిలకు రాడు. నిన్న సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవానికి ఎందుకు బయటకు రాలేదు? నీకెందుకంత అహంకారం? కనీసం ప్రజలకు శుభాకాంక్షలు చెప్పలేదంటే నువ్వు నెంబర్ వన్ తెలంగాణ ద్రోహివి.
బీజేపీకి అభివ్రుద్ది ఎంత ముఖ్యమో ఆత్మగౌరవం అంతే ముఖ్యం. అందుకే సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవ సభ జరిపినం.కేసీఆర్ రోజుకో మాట చెబుతూ రైతులను మోసం చేస్తుండు. ప్రతి గింజ కొంటాం. పొలాలవద్దకు వచ్చి ధాన్యం కొని బ్యాంకులో డబ్బు జమచేస్తమని, కేంద్రం ఏమీ చేస్తలేదని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు వరి వేస్తే ఉరేసుకున్నట్లేనని మాట మారుస్తూ రైతులను గందరగోళానికి గురిచేస్తుండు.
రైతులకు బియ్యానికి సంబంధమేంది? రైతులు వడ్లు మాత్రమే అమ్మేది. బియ్యంతో రైస్ మిల్లులకు, కేసీఆర్ కు మాత్రమే సంబంధం? గతంలో పాస్ పోర్టు బ్రోకర్ పనిచేసినోడు కేసీఆర్. కమీషన్ల లెక్కలు బాగా తెలుసు. అందుకే మిల్లర్లతో కమీషన్ల లెక్క కుదరక ఇలాంటి మాటలు మాట్లాడుతుండు.
బియ్యం కొనొద్దని ఎవరొద్దంటున్నరు. ఇక్కడి బియ్యం కొనడానికి ఆయనకేం బాధ. మనం కర్నూలు బియ్యం కొంటున్నం. ఇక్కడి బియ్యాన్ని ఎందుకు కొనరు. ఎగుమతి చేయరు? కనీసం ఢిల్లీలో జరిగే ట్రేడర్స్ మీటింగ్ కు ఎందుకు వెళ్లలేదు. ఏమైనా అంటే కేసీఆర్ చాలా బిజీ అంటున్నడు. కానీ ఏ పనిచేస్తున్నడో చెప్పడు. కనీసం షెడ్యూల్ కూడా విడుదల చేయని సీఎం ఈ దేశంలో కేసీఆర్ ఒక్కరే ఉన్నరు. ఎప్పుడు చూసినా ఫాంహౌజ్ లో పడుకుంటడు. జనాల్ని కలవడు.
ఒక్క రైతు బంధు ఇచ్చి అన్ని సబ్సిడీలు బంద్ చేసిన నాయకుడు కేసీఆర్. ఇంటికో ఉద్యోగమన్నడు ఇచ్చిండా? ఇక్కడున్న వాళ్లకు ఎంతమందికి ఉద్యోగాలొచ్చినయ్, నిరుద్యోగ భ్రుతి ఇచ్చిండ్రా? (ఒక్కరికీ రాలేదని యువత చేతులెత్తారు?)ఈ రాష్ట్రంలో ఒక్కొక్కరి తలపై రూ.లక్ష అప్పు ఉంది. ఈ డబ్బంతా ఎవరు కట్టాలి? మనమే కట్టాలి. ఇంకో రెండేళ్లయితే కేసీఆర్ మూటాముళ్లె సర్దుకుని ఇంటికి పోతారు. ఇప్పుడు మళ్లా సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టు కోసం రూ.6,500 కోట్లు అప్పు తెచ్చిండు. కేంద్రం రాష్ట్రానికి 2.91 లక్షల ఇండ్లు మంజూరు చేస్తే…మోడీ కట్టించే ఇండ్లు సరిపోవు… అందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టిస్తానన్నడు. కానీ కట్టివ్వలేదు. కేంద్రం ఇచ్చిన ఇండ్లను ఎందుకు కట్టివ్వలేదు? ఎన్నికలొస్తే ఒకరిద్దరికి ఇండ్లు ఇచ్చి గెలిపిస్తే అందరికీ ఇండ్లిస్తానని కథలు చెప్పి మళ్లీ మోసం చేస్తడు..ప్రజలారా…జాగ్రత్త.
ఎల్లారెడ్డి ప్రజలు ఏం పాపం? ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు కూడా లేదు. అంతెందుకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి. ఇక్కడున్న పోలీసులకు కూడా జీతాలు రాలేదు. ప్రమోషన్లు కూడా లేవు. జీతాలే ఇవ్వలేని సీఎం దళిత బంధు ఇస్తనంటడు. కానీ ఇవ్వడు. ఫ్రీ వ్యాక్సిన్ గురించి చెప్పడు. ఆయన మాత్రం 90 ఎంఎల్ వేస్తడు. 2023 ఎన్నికల్లో పోలింగ్ బూతుల్లో కేసీఆర్ గుండెలు బద్దలయ్యేలా ప్రజలు ఓట్లు వేయడం ఖాయం.మేం మోడీగారి శిష్యులం…వారసులం… నిజాయితీపరులం. ధైర్యంగా బతుకుతం. దేనికైనా తెగిస్తాం. నీ గడీలు బద్దలు కొడతాం.
రేషన్ బియ్యం, ఫ్రీ వ్యాక్సిన్ ఇచ్చేది కేంద్రమైతే…. సిగ్గులేకుండా కేసీఆర్ ఫొటోలు పెట్టుకుంటుండు. చివరకు కేంద్రం ఇచ్చే డబ్బులతో స్వచ్ఛ భారత్ టాయిలెట్లు కట్టిస్తే….ఆ టాయిలెట్ గోడలపైనా కేసీఆర్ ఫొటోలే పెట్టుకుంటుండటం సిగ్గు చేటు. కేసీఆర్ ఫాంహౌజ్ లో ఐసీయూ ఉంటది. కేసీఆర్ కుక్కకు రోగమొస్తే డాక్టర్లు వస్తరు. పేదోడికి రోగమొస్తే పట్టించుకునే దిక్కు లేదు.
రాష్ట్రంలో అమలవుతున్న ప్రతి పథకానికి డబ్బులు కేంద్రమే ఇస్తోంది. ఏమీ ఇస్తలేదనుకున్నవ్ కదా… నేను కేసీఆర్ కు సవాల్ విసిరుతున్నా….ఇద్దరం కలిసి ప్రధాని వద్దకు వెళదాం. ఏమీ ఇస్తలేదని నిరూపించు. నా పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తా. ఒకవేళ కేంద్రమే నిధులిస్తుందని నిరూపిస్తే నువ్వు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమా? ఢిల్లీకి పోయి వంగి వంగి దండాలు పెడుతున్న కేసీఆర్…బయటకొచ్చి సిగ్గు లేకుండా అబద్దాలు మాట్లాడుతున్నడు.
కొందరు కావాలని టీఆర్ఎస్-బీజేపీ ఒక్కటేనని కాంగ్రెస్ నేతలు చవాకులు పేలుతున్నరు. క్రికెట్ భాషలో చెప్పాలంటే…. వీళ్లకు టీఆర్ఎస్ కెప్టెన్ అయితే, ఎంఐఎం వైస్ కెప్టెన్, కాంగ్రెస్ నేతలు ఎక్స్ ట్రా ప్లేయర్ల లాంటి వాళ్లు. టీఆర్ఎస్ తో కలిసి పోటీ చేసింది, పొత్తు పెట్టుకున్నది ఆ పార్టీలే. కాంగ్రెస్ నుండి గెలిచి టీఆర్ఎస్ లోకి వలస వెళ్లేది ఆ పార్టీ వాళ్లే.
ఎల్లారెడ్డి ప్రజలారా….తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన నిజమైన ఉద్యమకారుడు ఏనుగు రవీందర్ రెడ్డి. కేసీఆర్ చేసిన మోసాలతో నష్టపోయి బీజేపీలోకి వచ్చింది. నిజమైన ఉద్యమకారులంతా బీజేపీలోకి వస్తున్నరు.తెలంగాణ ఉద్యమకారుల చరిత్రను, వారి స్పూర్తిని తెరమరుగు చేసే కుట్ర జరుగుతోంది. ఉద్యమకారులారా….రండి బీజేపీకి మద్దతివ్వండి. బీజేపీ చేపట్టే ఉద్యమంలో కలిసి పని చేద్దాం.
ఎల్లారెడ్డిలో కేంద్రం ఇచ్చిన నిధులు చాలా ఉన్నాయి. పేదల ఉపాధి కూలీ కోసం రూ.217.71 కోట్లు, అభివ్రుద్ది 94.42 కోట్లు, ఆర్దిక సంఘం గ్రామాల 72 కోట్లు భి మొక్కల 26.46 కోట్ల, 12.59 కోట్లు టాయిలెంట్లు, 2.19 మున్సిపల్, గ్రామీణ రహదారుల కోసం 260 కోట్లు, చెత్త 40 లక్షలు, 1.71 కోట్లు ఇవి గాకుండా వైకుంఠధామానికి రూ.11.13,700, రైతు వేదికలకు రూ.10 లక్షలుసహా పల్లె ప్రక్రుతి వనాలకు, నర్సరీల కోసం కేంద్రమే పూర్తిగా నిధులిస్తోంది….ఇవి తప్పయితే మా పై కేసులు పెట్టొచ్చు. నేనడుగుతున్న ఈ ప్రాంత నేతలను….కేసీఆర్ మెడలు వచ్చి ఈ ప్రాంత నేతలు ఏమైనా నిధులు తెచ్చారా?
మేం కొట్లాడుతుంటే కేసులు పెడుతున్నరు. లాఠీఛార్జ్ చేస్తున్నరు. జైళ్లో పెడుతున్నరు. గుర్రంపోడులో పోడు భూముల కోసం కొట్లాడితే 30 మందిని జైళ్లో పెట్టి నెల రోజులు ఉంచిండ్రు. అయినా భయపడేది లేదు. ధైర్యంగా కొట్లాడతాం. మా లక్ష్యం గొల్లకొండ మీద కాషాయ జెండా ఎగరేయడమే.ప్రజలు కష్టాల్లో వెళ్లి భరోసా ఇచ్చేది బీజేపీ మాత్రమే. హైదరాబాద్ వరదల సమయంలో, లాక్ డౌన్ సమయంలో ప్రజలను కలిసి భరోసా ఇచ్చింది. సాయం చేసింది బీజేపీ మాత్రమే.
ఒక్క కుటుంబం కోసమా మనం తెలంగాణ సాధించుకుంది? దళితుడిని సీఎం చేస్తానని మాట తప్పింది. మీ అందరి కోసమే ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నం. ఎక్కడికి వెళ్లినా తండోపతండాలుగా జనం వస్తున్నరు. సమస్యలు చెబుతుంటే బాధేస్తుంది. పోయినసారి కేసీఆర్ మాటలు నమ్మి మోసపోయినం. ఈసారి మోసపోం. అవసరమైతే మేమే కేసీఆర్ ను నమ్మిస్తం. ఓడించి తీరుతమని ప్రజలు చెబుతుండ్రు. ఎన్నికలప్పుడు ఓటుకు రూ.10 వేలు ఇచ్చేందుకు కేసీఆర్ ప్లాన్ చేస్తుండు. డబ్బులు తీసుకోండి. కానీ ఓట్లు మాత్రం అమ్ముకోవద్దు. టీఆర్ఎస్ కు గుణపాఠం చెప్పండి.
బండి సంజయ్ సమక్షంలో చిన్న పిల్లాడు నర్సింహ సభా వేదిక వద్దకు వచ్చి తొడగొట్టి కేసీఆర్ ను సవాల్ విసిరాడు.స్థానిక యాదవ సంఘం నాయకులు గొంగడి, గొర్రె పిల్లలతో సన్మానం చేశారు.
రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వానిదే బాధ్యత : కేంద్ర మంత్రి భగవంత్ ఖుబా 2014కు ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని ‘బంగారు తెలంగాణ’ చేస్తామన్నారు. దళితులకు మూడెకరాలు, నిరుద్యోగ భ్రుతి ఇస్తానన్నారు. దళితుడిని సీఎం చేస్తామన్నారు. ఏడేళ్లయింది. సీఎంను మీరెప్పుడైనా చూశారా? బయటకు వచ్చారా? ఏడేళ్లలో ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చలేదు. ఎంఐఎంతో దోస్తీ చేస్తూ పేదలకు, రైతులకు, మహిళలకు, రైతులకుసహా అన్ని వర్గాలను కేసీఆర్ మోసం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాభివ్రుద్దికి అడ్డంకిగా మారింది. ఇప్పుడు ఎన్నికల్లేవు. బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నారు. మీకోసం, మీ సమస్యలు తెలుసుకోవడానికి, ప్రభుత్వ నియంత పాలనను ఎండగట్టేందుకు పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ ను అభినందిస్తున్న.
కేసీఆర్ కేవలం తన కొడుకు, అల్లుడు, బిడ్డ కోసమే పనిచేస్తున్నారు. కుటుంబ సంక్షేమమే కేసీఆర్ కు ముఖ్యం. జన సంక్షేమం పట్టదు. నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు పెద్ద పీఠ వేస్తోంది. బండి సంజయ్ వంటి సామాన్య కార్యకర్తను ఎంపీని, రాష్ట్ర అధ్యక్షుడిని చేసింది. కేంద్ర మంత్రి వర్గంలో నాలాంటి వాళ్లను తీసుకుంది. కేంద్రం ఆదర్శవంతమైన పాలన చేస్తుంటే…రాష్ట్రంలో ఫాంహౌజ్ పాలన నడుస్తోంది. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ ను ఫాంహౌజ్ కే పరిమితం చేయాలి.
కేంద్ర ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తోంది. రైతులకు ఏటా రూ.6వేలు బ్యాంకులో జమ చేస్తోంది. మహిళలకు గ్యాస్ ఫ్రీగా ఇస్తోంది. కేంద్రం చేస్తున్న అభివ్రుద్ది, సంక్షేమ పథకాలను, టీఆర్ఎస్ ప్రభుత్వ నియంత పాలనను ఎండగట్టేందుకు సంజయ్ పాదయాత్ర చేస్తున్నారు. కేసీఆర్ పాలనలో రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఒక్క ఎల్లారెడ్డి నియోజకవర్గంలోనే 5గురు ఆత్మహత్యలు చేసుకున్నారు. వాటికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఆయా కుటుంబాలకు తగిన న్యాయం చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉంది. లేనిపక్షంలో బీజేపీ కార్యకర్తలు ప్రతిఘటిస్తారు. సత్తా చూపుతారు. కేసీఆర్ రాజీనామా చేసి ఇంటికి పంపిస్తారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలిచి తీరుతుంది. బీజేపీ అధికారంలోకి రాగానే రైతులకు న్యాయం చేస్తాం.
నరేంద్ర మోదీ ప్రభుత్వ హయాంలో ఎరువుల పంపిణీలో రైతులకు ఎన్నడూ ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటోంది. బండి సంజయ్ చేస్తున్న పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ఈ యాత్రలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాను.

Leave a Reply