ఆదోని: పేదరికం నుంచి బయటపడాలంటే చదువు అవసరమని ఏపీ సీఎం జగన్ అన్నారు. నాణ్యమైన చదువుతోనే పేదరికం పోతుందని చెప్పారు. కర్నూలు జిల్లా ఆదోనిలో ‘జగనన్న విద్యాకానుక’ కిట్లను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో సీఎం మాట్లాడారు. ‘నాడు-నేడు’ కార్యక్రమంతో పాఠశాలల రూపురేఖలు మారుతున్నాయని ఏపీ సీఎం జగన్ అన్నారు. రాష్ట్రంలో ఒకటి నుంచి పదో తరగతి చదువుతున్న సుమారు 47లక్షల మంది విద్యార్థులకు ఈరోజు శుభదినమని చెప్పారు. రూ.931కోట్లతో విద్యాకానుక కిట్లు అందజేస్తున్నట్లు జగన్ వివరించారు. విద్యార్థుల కోసం బైజూస్ సంస్థతో ఒప్పందం చేసుకుని యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. పేద విద్యార్థుల కోసం ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం తీసుకొచ్చామని చెప్పారు. 8వ తరగతి పిల్లలకు రూ.12వేల విలువైన ట్యాబ్ ఇస్తున్నామని, బైజూస్ ద్వారా విద్యార్థులకు మెరుగైన విద్య అందిస్తామని సీఎం జగన్ చెప్పారు.