Suryaa.co.in

Andhra Pradesh

ప్రజాపోరుతో బిజెపి జోరు..విపక్షాలపై విమర్శల హోరు

– సొంత చెల్లెలికి, బాబాయి కూతురుకి న్యాయం చేయలేని ముఖ్యమంత్రి, రాష్ట్రంలోని మహిళలకు ఎలా న్యాయం చేస్తాడు?
– బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి

గుంటూరు: బిజెపి గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర హెడ్ క్వార్టర్స్ ఇంచార్జి, ప్రజాపోరు గుంటూరు పార్లమెంట్ కన్వీనర్ మకుటం శివ అధ్యక్షతన “ప్రజాపోరు” బహిరంగ సభ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం లోని బళ్లారి రాఘవ ఓపెన్ ఆడిటోరియం లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి .. ప్రజాపోరు రాష్ట్ర కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు వనమా నరేంద్రకుమార్ విచ్చేసారు.

ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ ” ప్రజాపోరును విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ శిరస్సువంచి నమస్కరిస్తున్నాను.ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా బిజెపి విజయభేరి మోగించటంలో కార్యకర్తలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. కేవలం ఇద్దరు పార్లమెంటు సభ్యులతో ప్రారంభమైన బిజెపి ప్రస్ధానం ప్రస్తుతం 303 కు చేరింది.

రానున్న ఎన్నికలలో 350 కి చేరటం ఖాయం, ధృడమైన నాయకత్వం లేని సమయంలో 2014 లో ప్రజలు మార్పును కోరుకోని 282 మంది ఎంపీలతో బిజెపి కి అధికారం అందించారు. అప్పటినుండి కూడా సబ్ కే సాధ్ సబ్ కా వికాస్ నినాదంతో బిజెపి ముందుకు వెళ్తోంది. అయిదేళ్ల అవినీతి రహిత పాలన ను చూసే, 2019 లో 303 పార్లమెంటు స్ధానాలలో ప్రజలు బిజెపిని గెలిపించారు. ఈ పదేళ్లలో బిజెపి తన మూల సిధ్ధాంతం అంత్యోదయ ను పాటిస్తూ ముందుకు వెళ్తోంది.

దానికి కట్టుబడే ఏ కార్యక్రమం ప్రవేశపెట్టినా పేదవారికే పెద్దపీట వేస్తున్నాము. నరేంద్రమోదీ అనేక సందర్భాలలో తాను కూడా పేదరికం నుండే వచ్చాను కాబట్టే వారి కష్టాలు తెలుసని, అందుకే సంక్షేమ కార్యక్రమాలలో వారికి పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. తాను ప్రధానమంత్రిని కాదని ప్రధాన సేవకుడినని మోదీ తన మొట్టమొదటి పార్లమెంటు ప్రవేశ సమయంలో అన్నారు.2014 కు ముందు పొరుగుదేశంనుండి ఉగ్రవాదులు వచ్చి మన సైనికులను హతమార్చినా కళ్ళప్పగించి చూసేవాళ్లం.

కానీ నేడు, ఉగ్రవాదులు మనదేశం వైపు చూడటానికి కూడా భయపడటానికి సర్జికల్ స్ట్రైక్ కారణం. ఓకే దేశంలో ఇద్దరు ప్రధానులు, రెండు జాతీయ చిహ్నాలు, రెండు రాజ్యాంగాలు ఉండటానికి వీలు లేదనే 370 అధికరణను బిజెపి ధైర్యంగా తొలగించింది. ట్రిపుల్ తలాక్ కేవలం మహిళల జీవితాలకు ముడిపడిన అంశం కాదని, తల్లిదండ్రుల కడుపుకోతకు, కుటుంబాల సంక్షేమాలకు సంబంధించిన విషయమనే ఆలోచనతో మోదీ దానిని ధైర్యంగా రూపుమాపారు. ప్రజలకు ఉపయోగ పడుతుందంటే ఎటువంటి నిర్ణయాలు తీసుకోవటానికైనా వెనుకాడబోమని మోదీ అనేక సందర్భాలలో స్పష్టం చేశారు.

అనేక రాజకీయపార్టీలు తమ వారసునిగా ప్రస్తుత నాయకుల వారసుల పేర్లు చెప్తారని, బిజెపి మాత్రం సగటు కార్యకర్తవైపు చూపిస్తుందని, ఇది కేవలం బిజెపికే సాధ్యమని, దీనికి ఉదాహరణ సాధారణ ఉపాధ్యాయుడైన వాజ్ పేయి ప్రధాని అవటం, టీ అమ్ముకునే మోదీ ప్రధాని అవటం, ద్రౌపది ముర్ము రాష్ట్రపతి కావటం.బిజెపి దేశంకోసం చేసిన అభివృధ్ది చెప్పుకోవటమే కార్యకర్తల బలం. జగన్మోహనరెడ్డి భస్మాసురుడి లాగా 12 లక్షల కోట్ల అప్పుతో ప్రజలను భస్మం చేశాడని, అతను రాష్ట్రానికి ఏమి చేశాడో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఏది కనబడ్డా తాకట్టు పెట్టి, లక్షలాది రూపాయల అప్పు తెస్తూ, ప్రజలపై పెనుభారాన్ని జగన్ మోపుతున్నాడని, చివరికి రాష్ట్రంలోని గనులను కూడా వదలలేదని ఆమె విమర్శించారు.

రాష్ట్రానికి పూజామందిరంలాంటి సెక్రటేరియట్ ను కూడా 350 కోట్లకు హెచ్ డి ఎఫ్ సి కు తాకట్టు పెట్టారని, ప్రజాధనంతో నిర్మించిన సెక్రటేరియట్ ను తాకట్టు పెట్టే అధికారం వారికి ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. రాష్ట్రంలో నాణ్యత లేని మద్యాన్ని ఏరులై పారిస్తూ, ప్రజారోగ్యంతో చెలగాటమాడుతూ, జేబులు నింపుకుంటున్న జగన్, తన దరీమణుల పుస్తెలు తెగిపోయినా పర్లేదనుకుంటున్నాడు. సొంత చెల్లెలికి, బాబాయి కూతురుకి కూడా న్యాయం చేయలేని ముఖ్యమంత్రి, రాష్ట్రంలోని మహిళలకు ఎలా న్యాయం చేస్తాడు? గత అయిదేళ్లలో మహిళలపై దురాచారాలు పెరిగిపోయాయి. దిశ యాప్ ప్రవేశపెట్టామంటున్న వైసిపి ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఇంటికి కూతవేటు దూరంలో ఎస్సీ మహిళపై అత్యాచారం చేసి హత్య చేస్తే, తన కుటుంబానికి న్యాయం చేయలేకపోయిందని విమర్శించారు.

రైతులకు పదమూడున్నర వేలరూపాయల ఇన్ పుట్ సబ్సిడీ, ధరల స్ధిరీకరణ నిధి, శీతల గిడ్డంగుల నిర్మాణం వంటి జగన్ వాగ్దానాలు ఏమయ్యాయి? వైసిపి ప్రభుత్వ విద్వేష పూరిత ధోరణి వల్ల కోత్త పరిశ్రమలు రాష్ట్రానికి రాక, పెట్టుబడులు రాక,యువతకు మన రాష్ట్రంలో ఉపాధి అవకాశాలే కరువయి, వలస వెళ్లవలసి వస్తోంది. రాజధాని డిజైన్ లేకపోయినా, డి.పి.ఆర్ ఇవ్వకపోయినా కూడా అమరావతే రాజధాని అని నిర్ణయం తీసుకుని కేంద్రం 2500 కోట్ల రూపాయలు కేటాయించింది.అనంతపురం నుండి రాజధానికి రహదారికై 29 వేల కోట్ల రూపాయలు, బెంజి సర్కిల్ ఫ్లై ఓవర్ వంటి వాటికి రాజధాని ప్రాంతం అని నిర్ణయించే నిధులు అందించింది కేంద్ర ప్రభుత్వం.

రాష్ట్రంలో జరిగిన అభివృధ్ది పనులలో సింహ భాగం నిధులు కేంద్రం ఇచ్చినవే. రాష్ట్రం ఇస్తున్న ఇళ్ల పట్టాలను పేదలు చించి పక్కన పడేస్తున్నారు. జల్ జీవన్ మిషన్ కింద కేంద్రం వేలాది కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఇస్తే, గుంటూరులో కనీసం శుధ్దమైన తాగునీరు కూడా అందించలేకపోతోంది రాష్ట్ర ప్రభుత్వం. ప్రజా సంక్షేమం పట్ల ఆలోచనలేని ఈ వైసిపి ప్రభుత్వాన్ని ప్రజలే తొలగించాలి. అనంతరం ప్రజాపోరు రాష్ట్ర కన్వీనర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణు వర్ధన్ రెడ్డి మాట్లాడుతూ “175 అసెంబ్లీ,25 పార్లమెంటు సీట్లు గెలుస్తామని జగన్ చెబుతున్నారు. చిలకలూరిపేట లో చెల్లని రూపాయి గుంటూరు లో చెల్లుతుందా? నెల్లూరు లో చెల్లని రూపాయి నరసరావుపేట లో చెల్లుతుందా..అధికారులను ట్రాన్స్ ఫర్ చేయటం చూసాం,కానీ జగన్ మోహన్ రెడ్డి ఎమ్మెల్యే లను ట్రాన్స్ ఫర్ చేస్తున్నాడు. 2024 లో మేము ఇచ్చిన హామీలను నెరవేర్చాము. మాకు ఓట్లు వేయండనే ధైర్యం ఉందా?
వైసీపీ నుంచి ఎమ్మెల్యే లు, మంత్రులు ఎందు రాజీనామా లు చేస్తున్నారు. ఉద్యోగులకు ఒకటవ తారీకున జీతాలు ఇచ్చే పరిస్థితే లేదు. ఓటు బ్యాంకు రాజకీయాలు జగన్ చేస్తున్నారు.రాబోయే ఎన్నికల్లో కేంద్రంలో నరేంద్ర మోడీ మరలా ప్రమాణస్వీకారం చేస్తారు. 2024 న బీజేపీ రాష్ట్రంలో ప్రాతినిధ్యం వహిస్తుంది” అని దుయ్యబట్టారు.

అనంతరం ప్రజా పోరు గుంటూరు పార్లమెంటు కన్వీనర్ మకుటం శివ మాట్లాడుతూ “ప్రజల్లోకి కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి ని తీసుకు వెళ్ళింది ప్రజా పోరు..యువతకు రాని ఉద్యోగ అవకాశాలు లేవు. ఎపి రాష్ట్రం లో భవన నిర్మాణ కార్మికుల పొట్ట కొట్టి ఇసుక మాఫియా తో కోట్లు దోచుకున్నారు. అకాల వర్షాలకు,గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్య లు చేసుకుంటున్నారు.కేంద్ర ప్రభుత్వం అమరావతి రాజధాని ఒక్కటే అని లిఖిత పూర్వకంగా ఇచ్చింది. గోరు ముద్దలో గోరు మాత్రమే జగన్ ది,ముద్ద కేంద్రానిది. 1620 కోట్లతో ఎయిమ్స్ ఆసుపత్రి కట్టించి ప్రజలకు అంకితం చేసారు. యువజన కాంగ్రెస్ గా చెప్పుకునే వైసిపి యువతకు ఉద్యోగాలు కల్పించలేక నిర్వీర్యం చేసింది. పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవటానికి కేంద్రం అందించిన ఫసల్ బీమాను తమదిగా ప్రచారం చేసుకుంటున్న స్టిక్కర్ ప్రభుత్వం రైతుల పార్టీ ఎలా అవుతుంది?

శీతాకాల పార్లమెంటు సాక్షిగా ఆంధ్రకు రాజధాని అమరావతేనని బిజెపి ప్రకటించిందని గుర్తు చేసిన ఆయన, దానికి బీజెపి ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు.అలాగే కేంద్రం అందించే సర్వశిక్షఅభియాన్ ను నాడు నేడు అని, ప్రజారోగ్యంకోసం కేంద్రం మంగళగిరిలో ఏర్పాటుచేసిన ఎయిమ్స్ కు రాష్ట్ర ప్రభుత్వం కనీసం మంచినీటి సరఫరా కూడా అందించకుండా అడ్డుపడుతోందని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు.

ఈకార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు వనమా నరేంద్ర, రామకృష్ణారెడ్డి, చందు సాంబశివరావు, జూపూడి రంగరాజు, యడ్లపాటి రఘునాదబాబు, వల్లూరు జయప్రకాష్ నారాయణ, శనక్కాయల ఉమాశంకర్, పాతూరి నాగభూషణం, తులసి రామచంద్ర ప్రభు, శనక్కాయల అరుణ, మట్టా ప్రసాదు, ఈదర శ్రీనివాసరెడ్డి, పాటిబండ్ల రామకృష్ణ, స్వరూపరాణి, భీమినేని చంద్రశేఖర్, తోట రామకృష్ణ, పాలపాటి రవికుమార్, కొక్కెర శ్రీనివాస్, జగ్గారపు శ్రీనివాస్, యశ్వంత్, టివి రావు కిలారు దిలీప్, పాలపాటి రవికుమార్, ఆవుల నాగేంద్రయాదవ్, షేక్ రఫీ, కంతేటి బ్రహ్మయ్య, కన్నా రవిదేవరాజ్, దర్శనం శ్రీనివాస్, కుమార్ గౌడ్, చెరుకూరి తిరుపతిరావు, వైవి సుబ్బారావు, ఉమామహేశ్వరవు, రావూరి నారాయణ, పోతురాజు వెంకట్, అనుమొలు ఏడుకొండలు మరియు గుంటూరు పార్లమెంట్ అసెంబ్లీ కన్వీనర్లు కోకన్వీనర్లు ఇతర నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్దయెత్తున పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం భారతీయ జనతా పార్టీ ఫిరంగిపురం మండల కోశాధికారి చింత శాంతి ఆధ్వర్యంలో బేతపూడి గ్రామానికి చెందిన వైఎస్ఆర్సిపి మరియు తెలుగుదేశం కార్యకర్తలు ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు దగ్గుబాటి పురందేశ్వరి సమక్షంలో భారతీయ జనతా పార్టీలో 30 మంది చేరారు వీరిలో ప్రముఖులు జుజ్జూరు వెంకట కోటేశ్వరావు, పామిశెట్టి విమల కుమారి పలువురు భారతీయ జనతా పార్టీలో చేరారు

LEAVE A RESPONSE