-వైద్యచరిత్రలో అద్భుతం
వాషింగ్టన్: సాధారణంగా- ఓ డ్రగ్ను అభివృద్ధి చేసినప్పుడు.. పేషెంట్ల మీద దాని ప్రభావం ఎలా ఉంటుందనే విషయంపై క్లినికల్ ట్రయల్స్ను నిర్వహిస్తుంటారు. కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించడానికి భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు వ్యాక్సిన్ను డెవలప్ చేసినప్పుడు కూడా ఈ ట్రయల్స్ నిర్వహించారు. మూడుదశల్లో ట్రయల్స్ను నిర్వహించిన తరువాతే వాటిని అందుబాటులోకి తీసుకొచ్చారు. సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని తేలిన తరువాతే ఏ డ్రగ్ అయినా మార్కెట్లోకి ప్రవేశిస్తుంది.
అలాంటి ట్రయల్స్ దశలోనే ప్రాణాంతక రోగాలు మటుమాయం అయిన సందర్భాలు చాలా తక్కువ. ట్రయల్స్ దశలోనే రోగాలు నయం అవుతాయనే విషయం ఊహకు కూడా అందదు. అలాంటి ఘటనే ఇప్పుడు అమెరికాలో చోటు చేసుకుంది. ప్రాణాంతక కేన్సర్ను నయం చేయడానికి నిర్వహించిన ఓ డ్రగ్ ట్రయల్స్ దశలోనే పేషెంట్లపై ప్రభావాన్ని చూపింది. వారి శరీరంలోని కేన్సర్ కణాలను పూర్తిగా మటుమాయం చేసింది.
ఆ డ్రగ్.. డొస్టార్లిమాబ్ (Dostarlimab). డోస్టార్లిమాబ్ డ్రగ్ క్లినికల్ ట్రయల్స్ దశలోనే ప్రభావాన్ని చూపింది. మలద్వారం (రెక్టల్) కేన్సర్తో బాధపడుతున్న 18 మంది పేషెంట్లపై ఈ డ్రగ్ ట్రయల్స్ను నిర్వహించారు డాక్టర్లు. ఆరు నెలల పాటు డోస్టార్లిమాబ్ను అందించారు. దాని ఫలితంగా- ఆ 18 మంది పేషెంట్లల్లో కేన్సర్ కణాలు పూర్తిగా తొలగిపోయాయి. దీనిపై న్యూయార్క్ టైమ్స్ ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్లో పొందుపరిచారు.
రెక్టల్ కేన్సర్తో బాధపడుతున్న ఆ 18 మంది పేషెంట్లు న్యూయార్క్లోని మెమొరియల్ స్లొవాన్ కెట్టెరింగ్ కేన్సర్ సెంటర్లో చికిత్స పొందుతున్నారు. కీమోథెరపీ, రేడియేషన్, ఇన్వాసివ్ సర్జరీ.. ఇలా వేర్వేరు దశల్లో వారి ట్రీట్మెంట్ కొనసాగుతోంది. ఈ దశలో వారిపై డొస్టార్లిమాబ్ డ్రగ్స్తో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించగా.. అది ఏకంగా కేన్సర్నే మటుమాయం చేసింది. వారికి ఆరు నెలల పాటు మూడు వారాలకోసారి డొస్టార్లిమాబ్ను అందించామని అంకాలజిస్ట్ డాక్టర్ ఆండ్రియా కెర్కెక్ చెప్పారు.
కేన్సర్ వేర్వేరు దశల్లో ఉన్న వారందరిపై ఒకేరకమైన ప్రభావాన్ని డొస్టార్లిమాబ్ చూపిందని వివరించారు. వారికి నిర్వహించిన ఎండోస్కోపి, టోమోగ్రఫీ, పీఈటీ, ఎంఆర్ఐ వంటి స్కాన్లను నిర్వహించి.. అన్ని విధాలుగా పరీక్షలు చేసినప్పటికీ.. కేన్సర్ కణాల ఆనవాళ్లు కూడా కనిపించలేదని చెప్పారు. భవిష్యత్తులో కేన్సర్కు అందించే చికిత్సల్లో డొస్టార్లిమాబ్ను వినియోగించే అవకాశాలు లేకపోలేదని, దీనిపై యూఎస్ఎఫ్డీఏ నుంచి అనుమతులను తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.