-జగన్ రెడ్డీ…హోదాపై నీయుద్ధం ఎక్కడ? పలాయన వాదమెందుకు?
-రాజీనామాలపై నాటి నీ సవాళ్లు ఏమయ్యాయి? ప్రజలకు సమాధానం చెప్పాల్సిందే
-రాష్ట్ర ఆదాయం తగ్గకపోయినా….ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారు
-లేని సమస్యను సృష్టించి జగన్ సినిమా హీరోలను ఘోరంగా అవమానించారు
-స్వశక్తితో ఎదిగిన మెగాస్టార్ చిరంజీవి లాంటి వారు జగన్ ను ప్రాధేయపడాలా?
-గ్రామాల్లో విద్యార్థులకు బడులను దూరం చెయ్యడమే నాడు-నేడు పథకమా?
-పేదలకు చేరాల్సిన నరేగా పనుల్లో వైసీపీ అవినీతిపై టిడిపి పోరాటం
-స్ట్రాటజీ కమిటీ సమావేశంలో టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు
అమరావతి: ప్రత్యేక హోదా కోసం సిఎం జగన్ ఎప్పుడు యుద్దం మొదలు పెడతారని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. ప్రధానికి ఇచ్చే వినతి పత్రంలో కూడా హోదా అంశాన్ని జగన్ ఎందుకు పెట్టలేకపోయారని ప్రశ్నించారు. తమ పోరాటం వల్లనే హోదా విషయంలో కేంద్ర కమిటీ వేశారన్న వైసిపి నేతలు…..అజెండా ఎందుకు మారిందో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. నాడు హోదాపై ఊరారా తిరిగి హడావుడి చేసిన జగన్…ఇప్పుడు మౌనంగా ఎందుకు ఉండిపోయారని చంద్రబాబు ప్రశ్నించారు. కేంద్ర త్రిసభ్య కమిటీ అజెండాలో ప్రత్యేక హోదా అంశం రావడానికి సీఎం చేసిన కృషే కారణమని ఉదయం నుంచి సాయంత్రం వరకు మీడియాలో వైసీపీ నాయకులు డబ్బా కొట్టించుకుని.. సాయంత్రానికి టీడీపీపై బురదజల్లడం జగన్ రెడ్డి అసమర్థతకు, లాలూచీకి నిదర్శనమన్నారు. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన స్ట్రాటజీ కమిటీ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, పాఠశాలల మూసివేత, సినిమా హీరోలకు అవమానం, నరేగా పనుల్లో అవినీతి వంటి అంశాలపై చర్చించారు.
తెలుగు సినీ రంగం హీరోలను, ప్రముఖులను సిఎం జగన్ మీటింగ్ పేరుతో పిలిపించి అవమానించడాన్ని చంద్రబాబు తీవ్రంగా తప్పు పట్టారు. ప్రపంచ స్థాయికి వెళ్లిన తెలుగు సినిమా పరిశ్రమను జగన్ తన వైఖరితో కించపరిచారని అన్నారు. లేని సమస్యను సృష్టించి సినిమా రంగాన్ని కించపరిచేలా జగన్ వ్యవహరించారని చెప్పారు. స్వశక్తితో మెగాస్టార్ గా ఎదిగిన చిరంజీవి వంటి వారు సిఎంకు చేతులు జోడించి వేడుకోవాలా అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభాస్, రాజమౌళి, మహేష్ బాబు పాల్గొన్న ఆ సమావేశంలో జగన్ వ్యవహరించిన తీరుపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ స్థాయికి చేరిన తెలుగు సినిమా రంగ ప్రతిభపై కొద్దిరోజుల క్రితం ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేశారు.
స్ట్రాటజీ మీటింగ్ లో చర్చకు వచ్చిన ఇతర అంశాలు:-
1. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం ఏమాత్రం తగ్గకపోయినా….ఆర్థిక వ్యవస్థ నాశనం అవ్వడానికి జగన్ విధానాలే కారణం అని నేతలు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం 112 సార్లు ఒవర్ డ్రాఫ్ట్ కు వెళ్లిందని….193 సార్లు వేస్ అండ్ మీన్స్ తీసుకున్నారని…వెనుక బడిన ఈశాన్య రాష్ట్రాల స్థాయికి రాష్ట్రాన్ని జగన్ తీసుకువెళ్లారని నేతలు వివరించారు.
2. పాఠశాలల విలీనం వల్ల 3,4,5 తరగతుల విద్యార్థులు మూడు కిలోమీటర్ల దూరం నడవాల్సి వస్తున్నది. ఎస్సీ, బీసీ కాలనీల్లో ఉన్న ప్రాథమిక పాఠశాలలు రద్దు చేయడం, చిన్న పిల్లల్ని అవస్థల పాలు చేస్తున్న జగన్ రెడ్డి ప్రభుత్వ విధానాల్ని సమావేశం ఖండించింది. గ్రామాల్లో ఉన్న పాఠశాలలను మూసివెయ్యడమే నాడు- నేడు పథకమా అని నేతలు ప్రశ్నించారు.
3. రాష్ట్రంలో అమలువుతున్న అనధికార విద్యుత్ కోతలపైనా సమావేశంలో చర్చించారు. గ్రామాల్లో గంటల తరబడి విద్యుత్ సరఫరా తీసివేస్తున్నారని….విద్యుత్ రంగంలో మళ్లీ రాష్ట్రం తిరుగమనంలోకి వెళ్లిందన్నారు. కరెంట్ సరఫరా లేకపోయినా….కరెంట్ బిల్లులు అధికంగా వస్తున్నాయని అన్నారు. వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్లు తిరస్కరించిన కేసీఆర్ వలే ఏపీలో జగన్ రెడ్డి మోటార్లకు మీటర్లు బిగించవద్దని డిమాండ్ చేశారు.
4. ఉపాధి నిధుల్లో పేదలకు చేరాల్సిన డబ్బును అవినీతితో తినేస్తున్నారని నేతలు సమావేశంలో వివరించారు. ఉపాధి హామీ నిధులు ఏపీలో రూ.261 కోట్లు అవినీతి పాలయ్యాయని పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ప్రకటించింది. ఇది దేశంలో మొదటి స్థానంగా ఉందని…రానున్న రోజుల్లో నిధులు పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఉందని నేతలు అన్నారు. వీటిపై తెలుగుదేశం పోరాటం కొనసాగిస్తుందని అన్నారు.
5. విశాఖ ఉక్కు, నెల్లూరు సూపర్ క్రిటికల్ థర్మల్ ప్లాంట్ల ప్రైవేటీకరణ నివారణకు సీఎం చొరవ ఏదని నేతలు ప్రశ్నించారు. మత్స్యకారులకు నష్టం చేసే 217 జీవోను రద్దు చేయాలి సమావేశం డిమాండ్ చేసింది. రాష్ట్రంలోని వివిధ నగరాలు, పట్టణాల్లోని ఆటోనగర్ ల స్థలాలను కబ్జా చేసేందుకు జగన్ రెడ్డి కుట్ర పన్నడాన్ని పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధికి మార్గం చూపకపోగా… ప్రైవేటు ఆస్థులు లాక్కునేందుకు ప్రయత్నించడానికి నేతలు తప్పు పట్టారు. ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి దారుణంగా ఉందని…మందుల కొరత, ఆర్థిక సమస్యలతో అసుపత్రుల్లో వివిధ చెల్లింపులు లేవన్నారు.
ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నారా లోకేష్, కె.అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, వర్ల రామయ్య, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నిమ్మకాయల చినరాజప్ప, కాలవ శ్రీనివాసులు, దేవినేని ఉమామహేశ్వరరావు, ధూళిపాళ్ల నరేంద్ర, బండారు సత్యనారాయణ మూర్తి, కేఎస్ జవహర్, బోండా ఉమామహేశ్వరరావు, నిమ్మల రామానాయుడు, బీద రవిచంద్ర యాదవ్, టీడీ జనార్థన్, బీసీ జనార్థన్ రెడ్డి, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, పి.అశోక్ బాబు, గురజాల మాల్యాద్రి, కొమ్మారెడ్డి పట్టాభిరాం, మద్దిపాటి వెంకటరాజు, జి.వి. రెడ్డి తదితరులు పాల్గొన్నారు.