Suryaa.co.in

Andhra Pradesh

వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబును జైల్లో పెట్టారు!

తప్పులను ఎత్తిచూపి, ప్రజల తరపున పోరాడినందుకే అక్రమ కేసులు
రూ.3వేలకోట్ల అవినీతి అని మొదలుపెట్టి ఇప్పుడు రూ.27కోట్లకు వచ్చారు
రేపు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ గుడ్డి ప్రభుత్వం కళ్లు తెరిపించేలా కార్యక్రమం
త్వరలోనే టిడిపి – జనసేన జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటుచేస్తాం
చంద్రబాబుతో ములాఖత్ అనంతరం మీడియా సమావేశంలో యువనేత నారా లోకేష్

రాజమహేంద్రవరం :- వైసీపీ ప్రభుత్వం చేస్తున్న తప్పులను బయటపెట్టి, ప్రజల తరపున పోరాడుతున్నందుకే దొంగ కేసులు పెట్టి, వ్యవస్థలను మేనేజ్ చేసి 28 రోజులుగా చంద్రబాబును జ్యుడిషియల్ రిమాండ్ లో ఉంచారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. రాజమహేంద్రవరంలోని కేంద్ర కారాగారంలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో నారా లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మణి శుక్రవారం సాయంత్రం ములాఖత్ అయ్యారు.

అనంతరం నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ…పోలవరం నిర్మాణం, యువత ఉద్యోగాల కోసం పరిశ్రమలు, ఏపీ జలాల కోసం జగన్ ను నిలదీసినందుకు, ఇసుక, మద్యం దందా గురించి ప్రశ్నించినందుకే చంద్రబాబుపై లేని ఆరోపణలతో తప్పుడు కేసులు పెట్టారు. స్కిల్ కేసులో ఈ ప్రభుత్వం మొదట రూ.3 వేల కోట్ల అవినీతి జరిగిందని అన్నారు. తర్వాత రూ.371 కోట్లు, ఇప్పుడు రూ.27 కోట్లు అంటున్నారు..మరో వారం పోతే ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదని తేలిపోతుంది.

అవినీతి చేయాల్సిన అవసరం మాకు లేదు. 1992 నుండి 2013 వరకు భువనేశ్వరి, 2013 నుండి బ్రాహ్మణి హెరిటేజ్ బాధ్యతలు చూస్తున్నారు. మేము సంపాదించుకున్న దాంతోనే పార్టీని నడుపుతూ రాజకీయం చేస్తున్నాం. మా తల్లి మాజీ సీఎం ఎన్టీఆర్ కూతురు..మాజీ సీఎం చంద్రబాబు నాయుడు భార్య. అయినా ఏనాడూ బయటకు రాలేదు. కానీ మా కుటుంబాన్ని ఈ సైకో జగన్ రోడ్డుపైకి తెచ్చారు.

ఎన్ని ఇబ్బందులు సృష్టించినా నమ్ముకున్న సిద్దాంతం కోసం పని చేస్తాం. ప్రజల తరపున పోరాడుతున్నందుకే చంద్రబాబుపై కక్షపూరితంగా కేసులు బనాయించారు. 14 ఏళ్లు సీఎంగా, 14 ఏళ్లుకుపైగా ప్రతిపక్ష నేతగా నిరంతరం ప్రజలకు సేవ చేసిన వ్యక్తి చంద్రబాబు. హైదరాబాద్ లోని సైబరాబాద్ కు పునాది వేశారు. పోలవరంలో 72 శాతం పూర్తవ్వడానికి చంద్రబాబే కారణం. ఏపీలో లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించారు. అలాంటి వ్యక్తిపై వ్యవస్థలను మేనేజ్ చేసి 28 రోజులుగా జ్యుడిషియల్ రిమాండ్ లో ఉంచడం దారుణం. న్యాయం అందడం ఆలస్యం కావొచ్చుకానీ… అంతిమంగా న్యాయమే గెలుస్తుంది. న్యాయం మా వైపే ఉంది.

మా ఎకౌంట్లన్నీ పారదర్శకమే
1992లో చంద్రబాబు హెరిటేజ్ కంపెనీ పెట్టారు. దాని ద్వారా వచ్చిన డబ్బులతో మేం రాజకీయం చేస్తున్నాం. పదేళ్లుగా మా ఆస్తులు ప్రకటిస్తున్నాం. మాకున్న ప్రతి ఎకరా, ప్రతి గజం, ప్రతి రూపాయి వివరాలు ప్రజల ముందు పెట్టాం. ఏనాడూ ఈ ప్రభుత్వం మేం చూపుతున్నవి తప్పని నిరూపించలేకపోయింది. నిరూపిస్తే మా ఆస్తులన్నీ రాసిస్తామని కూడా చెప్పాం. అయినా నిరూపించలేదు.

షెల్ కంపెనీలకు డబ్బులు మళ్లించారని తప్పుడు ఆరోపణలు చేశారు. టీడీపీకి ఒక పద్ధతి, క్రమశిక్షణ ఉన్నాయి. ఎన్టీఆర్ నుండి చంద్రబాబు వరకూ పద్ధతిగా నడిపిస్తూ వచ్చాం. ఆనాడు చంద్రబాబు ఒక్క చిటికేసి ఉంటే ఈ పిచ్చి జగన్ రోడ్డుపై తిరిగి పాదయాత్ర చేసేవాడు కాదు. 2014, 2016, 2018లో పార్టీ సభ్యత్వాలు చేశాం, 2022లో కూడా సభ్యత్వాలు చేశాం. దీనికి రుసుముగా రూ.100లు చొప్పున తీసుకున్నాం.

1300 బ్రాంచిల్లో మా కార్యకర్తలు రుసుమును జమ చేశారు. ఆ డబ్బులు టీడీపీ మెయిన్ అకౌంట్ కు వచ్చాయి. టీడీపీ కార్యకర్తలకు ఇచ్చిన హామీ మేరకు ప్రమాదంలో చనిపోయిన వారికి బీమా కూడా చెల్లించాం. దేశంలో మరెక్కడా లేనివిధంగా రూ.110 కోట్లు ప్రమాదా బీమా సొమ్మును టీడీపీ కార్యకర్తలకు అందించాం. అద్బుతమైన ప్రమాద బీమాను మేము ఏర్పాటు చేశాం.

నాపైనా చేస్తున్నవన్నీ తప్పుడు ఆరోపణలే
చంద్రబాబు అరెస్టు తర్వాత నాపైనా అనేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు అంశంలో 41ఏ నోటీసు ఇస్తామన్నారు. ఫైబర్ గ్రిడ్ లో నా పాత్ర లేదు..ఆధారాలుంటే 41ఏ నోటీసు ఇస్తామని కోర్టుకు చెప్పారు. ప్రజల ఆశీస్సులతో 1982 నుండి పార్టీ అధికారంలో ఉన్నా, లేకపోయినా టీడీపీ రాష్ట్రప్రజానీకానికి సేవ చేస్తోంది. కర్నూలు జిల్లాలో వరదలు వచ్చినప్పుడు ప్రభుత్వం కన్నా చంద్రబాబు ముందు స్పందించారు.

కోవిడ్ సమయంలో ప్రజలకు మాస్కులు, మందులు అందించాం. ఉత్తరాఖండ్ వరదల్లో తెలుగువాళ్లు చిక్కుక్కుంటే ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి ఇంటి దగ్గరవరకు సురక్షితంగా వదిలిపెట్టాం. అది ప్రజల పట్ల మా పార్టీకి ఉన్న చిత్తశుద్ధి. 28 రోజులు వ్యవస్థలను మేనేజ్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ లో పెట్టినా ప్రజల కోసం పోరాడాలని చంద్రబాబు మాతో చెప్పారు.

నేనుగానీ, మా కుటుంబ సభ్యులు ఏనాడూ తప్పు చేయలేదు. నేను తప్పు చేస్తే జైలుకు పంపే మొదటి వ్యక్తి చంద్రబాబు. న్యాయ పోరాటం చేస్తున్నాం.. సుప్రీంకోర్టులో క్వాష్ తోపాటు, ఎసిబికోర్టులో బెయిల్ పై తీర్పు సోమవారానికి వేశారు. చంద్రబాబునాయుడుపై మోపిన తప్పుడు కేసులపై శాంతియుతంగా ఆందోళనలు కొనసాగిస్తాం.

రేపు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ గుడ్డి ప్రభుత్వం కళ్లు తెరిపిస్తాం
చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ రేపు రాష్ట్ర వ్యాప్తంగా సాయంత్రం 7గంటలకు ప్రతిఒక్కరూ లైట్లు ఆపి కొవ్వొత్తులు, కాగడాలు లేదా సెల్ ఫోన్ టార్చ్ లైట్ వేసి సంఘీభావం తెలుపుతాం. టీడీపీ ఏ పిలుపిచ్చినా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. ఢిల్లీ వెళ్లిన తర్వాత రాష్ట్రపతి నుండి ఇతర పార్టీల వారిని కలిశాం. వారంతా చంద్రబాబు తప్పు చేయరనే చెప్పారు. టీడీపీ అకౌంట్లు సీఐడీ అడిగితే మెయిల్ ద్వారా అందించాం. మాకు వచ్చిన ప్రతి రూపాయిని ప్రతి మహానాడులో కార్యకర్తల ముందు వివరాలు పెడుతున్నాం.

ఎన్నికల కమిషన్, ఐటీకి కూడా పంపించాం. టీడీపీ అధికారంలో ఉన్నా వైసీపీకి ఎక్కువ ఎలక్ట్రోరల్ బాండ్లు వచ్చాయి. వంద కోట్ల దాకా వైసీపీకి వచ్చాయి. వైసీపీకి వంద కోట్లు ఎవరిచ్చారో ఎసిబి బయటపెట్టగలదా? నిరంతరం ప్రజలకు సేవచేయాలని ఆలోచించే వ్యక్తి చంద్రబాబు. జగన్ తన కేసుల మాఫీ కోసం కృష్ణాజలాలను జగన్ తాకట్టుపెట్టారని చంద్రబాబు బాధపడుతున్నారు. ఈ ప్రభుత్వ కక్షసాధింపుల వల్ల రాష్ట్రంలోని పరిశ్రమలు పక్క రాష్ట్రానికి వెళ్తున్నాయి. పోలవరం అటకెక్కింది. రాజధాని ఏదో చెప్పుకోలేని పరిస్థితి ఉంది. అప్పులు ఎక్కువ చేస్తున్నారు..ప్రజల భవిష్యత్ ఏంటని చంద్రబాబు బాధపడుతున్నారు.

త్వరలో టీడీపీ-జనసేన జాయింట్ యాక్షన్ కమిటీ
టీడీపీ – జనసేన జాయింట్ యాక్షన్ కమిటీని త్వరలో ప్రకటిస్తాం. ఆ కమిటీ నిర్ణయించిన కార్యక్రమాలను అమలుచేస్తాం. టీడీపీ-జనసేన పొత్తుపై వైసీపీ ఎందుకు కంగారు పడుతోంది. టీడీపీ-జనసేన కలిసే ఎన్నికలకు వెళ్తాయి..మమ్మల్ని చూస్తే వైసీపీకి ఎందుకు భయపడుతోంది? ఎక్కడ నుంచి పోటీచేయాలన్నది మేం నిర్ణయించుకుంటాం. కంచుకోటలో కాకుండా మరో చోట పోటీ చేయాలని జగన్ ను మేము ఏనాడైనా అడిగామా? వైసీపీ నేతలు పోలీసులు లేకుండా వస్తే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు. ప్రజల తరపున పోరాడుతుంటే పవన్ కు నోటీసులిచ్చారు. దాడి చేయడానికి ప్రయత్నించారు.

రెండు రోజులు చంద్రబాబును కస్టడీకి తీసుకున్నారు..సీఐడీ చంద్రబాబును ప్రశ్నలు అడిగిందో…సీఐడీని చంద్రబాబు ప్రశ్నలడిగారో అర్థంకాలేదు. ఎక్కడా తాను చట్టాలు ఉల్లంఘించలేదని బల్లగుద్ది మరీ చెప్పారు. ఏనాడూ చంద్రబాబు చట్టాన్ని దుర్వినియోగం చేయలేదు. నేను మంత్రిగా ఉన్నప్పుడు 2 వేల ఫైల్స్ క్లియర్ చేశాను. ఏ చిన్న తప్పుకూ ఆస్కారమీయలేదు. పని వేగంగా జరగాలని చంద్రబాబు చెప్పేవారు. టీడీపీ పోరాటం ఆగలేదు..175 నియోజకవర్గాల్లో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంటింటికీ బాబుతో నేను అనే కార్యక్రమం జరగుతోంది. నా పాదయాత్రపైనా అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటా. ప్రధాని, హోంమంత్రి అపాయింట్మెంట్ నేను అడగలేదు. రాష్ట్రపతిని కలసి ఈ రాష్ట్రంలో జరిగే రాజ్యాంగ ఉల్లంఘన, దొంగ కేసుల గురించి చెప్పా.

చంద్రబాబు భద్రతపై అందోళన ఉంది
చంద్రబాబు ఎప్పుడూ ఆయన ఆరోగ్యం కాపాడుకుంటారు..కానీ ఇప్పుడు ఫిజికల్ సేఫ్టీపైన ఆందోళన ఉంది. రాజమహేంద్రవరం జైలులో చంద్రబాబుపై దాడి చేస్తామని ఎస్పీకి లేఖ కూడా వచ్చింది. చంద్రబాబుకు జైల్లో సరైన భద్రతలేదు. జైల్లో నక్సల్స్, గంజాయి బ్యాచ్ జైల్లో ఉంది. చంద్రబాబు జైల్లోకి వెళ్లే వీడియోలు ఎందుకు బయటకు వచ్చాయి..దానిపై ప్రభుత్వం స్పందించలేదు. వైసీపీ అనుకూల మీడియా కూడా ఆ వీడియోలను ప్రసారం చేశారు. దీనిపై మేము కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రిత్వశాఖకు ఫిర్యాదు చేస్తాం.

బయటకు వచ్చిన యువగళం వాలంటీర్లలో కొందరిని మళ్లీ జైల్లో పెట్టారు. మేం అధికారంలోకి వచ్చాక చట్టాన్ని ఉల్లంఘించిన పోలీసు అధికారులపైనా జ్యుడిషియల్ విచారణ వేసి చర్యలు తీసుకుంటాం. రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని పోలీసులు అమలు చేయాలి. యువగళాన్ని ఎప్పుడు ప్రారంభించాలనే విషయమై పార్టీ పెద్దలతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం.

ఆధారాల్లేకుండా ఆరోపణలు చేయను
జగన్ ఢిల్లీకి ఎందుకు వెళ్లారో వైసీపీ ఎంపీలను అడగాలి. చంద్రబాబు అరెస్టు అంశంలో కేంద్ర హస్తం ఉందనడానికి ఆధారాలు లేవు..ఆధారాలు లేకుండా నేను ఆరోపణలు చేయను. హెరిటేజ్ ఫుడ్స్ లో నేను షేర్ హోల్డర్ ని మాత్రమే. బ్యాలెన్స్ షీటు, డాక్యుమెంట్లు అడిగే అర్హత నాకు లేదు. అది కోర్టు దృష్టికి తీసుకెళ్తే మా వాదనతో ఏకీభవించింది.

నేను ఎక్కడికీ పారిపోలేదు..పోను కూడా. చంద్రబాబు ఏనాడూ అవినీతి చేయలేదు. చంద్రబాబును జైల్లో పెట్టినా కూడా ఈ ప్రభుత్వం భయపడుతోంది. కొవ్వొత్తులు పట్టుకున్నా, విజిల్ వేసినా, పోస్టర్ పట్టుకుని రోడ్డుపై నడిచినా కేసు పెడుతున్నారు. టీడీపీ నేతలు వాహనాలు ఆపుతున్నారు. ఈరోజు ఉదయం ఉండవల్లి నుండి రాజమహేంద్రవరం వస్తుంటే అడుగడుగునా అడ్డంకులు సృష్టించారని లోకేష్ పేర్కొన్నారు.

LEAVE A RESPONSE