Suryaa.co.in

Telangana

దళితులు, గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపేందుకే చేవెళ్ల డిక్లరేషన్

పాలమూరు ప్రజలు జెండాలను పక్కనబెట్టి కాంగ్రెస్ ను గెలిపించాలి
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతులకు రూ. 2 లక్షల రుణ మాఫీ
నెలకు రూ. 4 వేల పెన్షన్
పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేస్తాం
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ లో చేరిన నాగర్ కర్నూల్, అచ్చంపేట బీఆర్ఎస్ నాయకులు

చేవెళ్ల దళిత-గిరిజన డిక్లరేషన్ అమలు చేసి దళితులు, గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపుతామన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. దళితులు, గిరిజనుల జీవితాలలో గుణాత్మక మార్పే లక్ష్యంగా దళిత-గిరిజన డిక్లరేషన్ ప్రకటించామన్నారు. సోమవారం నాగర్ కర్నూలు, అచ్చంపేట నియోజకవర్గాలకు చెందిన బీఆరెస్ నాయకులు పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. జూబ్లీహిల్స్ నివాసంలో కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు రేవంత్ రెడ్డి.

పాలమూరు ప్రజలు జెండాలను, ఎజెండాలను పక్కనబెట్టి కాంగ్రెస్ ను గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ ప్రభుత్వాన్ని బొంద పెట్టి.. ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకుందామన్నారు. పాలమూరు జిల్లాలో 14కు 14 సీట్లు మీరు గెలిపిస్తే రాష్ట్రంలో 100 సీట్లు గెలిపించే బాధ్యత మేం తీసుకుంటామన్నారు రేవంత్ రెడ్డి. గ్రామ గ్రామాన తిరగండి… ప్రతీ తలుపు తట్టండి బీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లండన్నారు. తిరగబడదాం.. తరిమికొడదాం నినాదంతో ముందుకు వెళదామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే పాలమూరు జిల్లాలోని అన్ని సాగు నీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తుందని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, బీడి కార్మికులకు, ఒంటరి మహిళలు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, ఎయిడ్స్ బాధితులకు, పైలేరియా డయాలిసిస్ పేషంట్లకు నెలకు రూ. 4 వేల పెన్షన్ ఇస్తామన్నారు.

రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని మరోసారి హామీనిచ్చారు. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలు భర్తీ చేయడంతోపాటు రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందిస్తామన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు రూ.5 లక్షల వరకు వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ఇల్లు కట్టుకునే ప్రతీ పేదవాడికి రూ.5 లక్షల సాయం అందిస్తామన్నారు రేవంత్ రెడ్డి.

కేసీఆర్ ఖేల్ ఖతం – బీఆర్ఎస్ దుఖాన్ బంద్ : రేవంత్
యావత్ తెలంగాణ గుండె చప్పుడు ఒక్కటే నని, “కేసీఆర్ ఖేల్ ఖతం – బీఆర్ఎస్ దుఖాన్ బంద్” అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మంత్రి కేటీఆర్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన డిక్లరేషన్‌పై కేటీఆర్ చేసిన నేపథ్యంలోనే మంత్రి ని ట్యాగ్ చేస్తూ రేవంత్ రెడ్డి కౌంటర్ ట్వీట్ పోస్ట్ చేశారు. పూర్తి ట్వీట్….

మా డిక్లరేషన్ దళిత – గిరిజన జీవితాలలో గుణాత్మక మార్పునకు కన్ఫర్మేషన్.
1. మా డిక్లరేషన్ … దళితుడ్ని సీఎం చేస్తానని మోసం చేయడం లాంటిది కాదు.
2. మా డిక్లరేషన్… ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల భూమి ఇస్తానని మోసం చేయడం లాంటిది కాదు.
3. మా డిక్లరేషన్… గిరిజన రిజర్వేషన్లు 12 శాతం చొప్పున పెంచుతానని మోసం చేయడం లాంటిది కాదు.
4. మా డిక్లరేషన్… మద్ధతు ధర అడిగిన గిరిజన రైతులను బందిపోట్ల కంటే ఘోరంగా బేడీలు వేసి అవమానించడం లాంటిది కాదు.
5. మా డిక్లరేషన్ … నేరెళ్ళ ఇసుక దోపిడీని ప్రశ్నించిన దళిత – బీసీ బిడ్డల పై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం లాంటిది కాదు.
6. మా డిక్లరేషన్… దళిత – గిరిజనులకు కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన అసైన్డ్ భూములను లాక్కుని రియల్ ఎస్టేట్ మాఫియాకు అమ్ముకోవడం లాంటిది కాదు.
7. మా డిక్లరేషన్… దళిత మహిళ మరియమ్మను లాకప్ డెత్ చేయించడం లాంటిది కాదు.
8. మా డిక్లరేషన్… ఒకే కుటుంబంలో ముగ్గురు మంత్రి పదవులు తీసుకుని ఒక్క మాదిగకు కూడా మంత్రి పదవి ఇవ్వకపోవడం లాంటిది కాదు.
9. మా డిక్లరేషన్… ఎబిసిడి వర్గీకరణ చేయకుండా మోసం చేయడం లాంటిది కాదు.
10. మా డిక్లరేషన్… దళితబంధు పథకంలో 30 శాతం కమీషన్లకు కక్కుర్తిపడే రాబందుల లాంటిది కాదు.
అందుకే… యావత్ తెలంగాణ గుండె చప్పుడు ఒక్కటే
“కేసీఆర్ ఖేల్ ఖతం – బీఆర్ఎస్ దుఖాన్ బంద్”

LEAVE A RESPONSE