Suryaa.co.in

Telangana

ప్రధాని మోదీ డైరెక్షన్ లో సీఎం రేవంత్ రెడ్డి

– రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు
– బీజేపీ, కాంగ్రెస్ మధ్య దోస్తీ బట్టబయలైంది
– రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రజలు ముఖ్యమా? కాంట్రాక్టర్లు ముఖ్యమా ?
– అహంకారానికి, కుటుంబ పాలనకు కేరాఫ్ అడ్రస్ ఎనుముల రేవంత్ రెడ్డి
– రాజ్యాంగేత శక్తులుగా రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు
– తిరుపతి రెడ్డికి కలెక్టర్ ఎందుకు ఎదురెళ్లి స్వాగతం చెబుతున్నారు?
– తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విలేకరుల సమావేశం

హైదరాబాద్: ప్రధాని మోదీ డైరెక్షన్ లో సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు ప్రతీ విషయంలో బీజేపీతో సీఎం రేవంత్ రెడ్డి కలిసి పనిచేస్తున్నారు. అహంకారానికి, కుటుంబ పాలనకు కేరాఫ్ అడ్రస్ ఎనుముల రేవంత్ రెడ్డి.

బీజేపీ నాయకులే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దగ్గరుండి కాపాడుతున్నారు. మేము వాస్తవాలు బయటపెట్టగానే బీజేపీ నాయకులు మమ్మల్నే విమర్శిస్తారు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మధ్య భాగస్వామ్యం ఉంది. బీజేపీ, కాంగ్రెస్ మధ్య దోస్తీ బట్టబయలైంది. ప్రధానిని కలిసిన తర్వాత కేసీఆర్, కేటీఆర్ పై కేసులు పెడతామని రేవంత్ రెడ్డి అంటున్నారు. లేనిపోని విషయాలు తెచ్చి మాకు అంటగడుతున్నారు.

కల్వకుంట్ల కుటుంబాన్ని, బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేయడమే తప్పా సీఎంకు ఇంకో ఆలోచన లేదు. కల్వకుంట్ల కుటుంబం అంటే కట్టుబాట్లతో కూడిన కుటుంబం. మేము ఎప్పుడూ ప్రొటొకాల్ ను ఉల్లంఘించలేదు. కానీ రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు రాజ్యాంగేత శక్తులుగా వ్యవహరిస్తున్నారు.

ప్రధానిని కలిసిన తర్వాత తన సోదరుడు తిరుపతి రెడ్డి తన నియోజకవర్గ ఇన్ ఛార్జ్ అని సీఎం చెప్పుకున్నారు. పార్టీ పరంగా ఇన్ చార్జి అయితే మాకు ఇబ్బంది లేదు … కానీ అధికారిక సమావేశాల్లో ఎందుకు పాల్గొంటున్నారు. తిరుపతి రెడ్డికి కలెక్టర్ ఎందుకు ఎదురెళ్లి స్వాగతం చెబుతున్నారు? రాజ్యాంగేతర శక్తులను ముఖ్యమంత్రి ప్రోత్సహిస్తున్నట్లు కదా మా కుటుంబంలో అధికారికంగా, రాజ్యాంగబద్ధంగా ఎన్నికల్లో ఎన్నికయ్యి ప్రజాసేవ చేస్తున్నాం.

ముఖ్యమంత్రి సోదరులు ఇష్టారీతినా వ్యవహరిస్తున్నారు. గుమ్మడి నర్సయ్య వంటి మహోన్నతమైన వ్యక్తిని గేటు బయట నిలబెట్టి రేవంత్ రెడ్డి అహంకారాన్ని ప్రదర్శించారు. తెలంగాణ ప్రజలకు రక్షణ కవచంగా ఉన్న కేసీఆర్ కుటుంబాన్ని, బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలన్నది సీఎం దురాలోచన. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కలిసి తెలంగాణకు రక్షణకవచంగా ఉన్న బీఆర్ఎస్ పై కుట్రలు చేస్తున్నాయి.

న్యాయవాది సంజీవ రెడ్డి కోర్టులో వాదిస్తూ అందరి ముందే ఆరు నెలల క్రితమే గుండె పోటుతో మరణించారు. భూపాలపల్లిలో భూతగాదాల వల్లనే హత్య జరిగినట్లు జిల్లా ఎస్పీ చెప్పారు. దుబాయ్ లో ఒక వ్యక్తి నిద్రలోనే చనిపోయారని పత్రికల్లోనే వచ్చింది. రేవంత్ రెడ్డి అంతులేని అబద్ధాలు చెబుతున్నారు.

నెలకు రూ 6500 కోట్ల వడ్డీ కడుతున్నామని అబద్దాలు చెబుతున్న సీఎం. కాగ్ నివేదిక ప్రకారం ఏ నెల కూడా 2600 కోట్లకు మించి వడ్డీ కట్టలేదు. మరి 6500 కోట్లు కడుతున్నామని సీఎం ఎందుకు అబద్దాలు చెబుతున్నారు? అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కనీసం ఇప్పుడైనా నిజాలు చెప్పాలి. రాష్ట్ర ఆదాయంపై కూడా రేవంత్ రెడ్డి తప్పుడు లెక్కలు చెబుతున్నారు.

ప్రతీ నెల 18 వేల కోట్ల ఆదాయం వస్తున్నదని సీఎం చెబుతున్నారు. కానీ కాగ్ ప్రకారం 12 వేల కోట్లకు మించి ఈ ఏడాది ఆదాయం రాలేదు. మరి ఈ అబద్దపు లెక్కలు ఎందుకు చెప్తున్నట్లు ? ఎవరిని మభ్యపెట్టడానికి చెబుతున్నారు ? ఆదాయం పడిపోవడానికి ప్రధాన కారణం హైడ్రా. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా 18 వేల కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. కానీ హైడ్రా విధ్వంసం వల్ల దాని ద్వారా ఆదాయం 5800 కోట్లకు పడిపోయింది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీని సర్వనాశనం చేసే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.

ప్రధాన మంత్రిని కలిసిన ముఖ్యమంత్రి కొత్త విషయాలపై వినతులు ఇవ్వలేదు. బీఆర్ఎస్ హయాంలో ఎస్ఎల్బీసీ పనులే జరగలేదని సీఎం పచ్చి అబద్దాలు చెబుతున్నారు. కేసీఆర్ విశాల హృదయం తెలవాలంటే ఎస్ఎల్బీసీ విషయంలో అర్థమవుతుంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత అసెంబ్లీ కమిటీ హాల్ లో ఈ ప్రాజెక్టుపై కేసీఆర్ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు.

ఎస్ఎల్బీసీ టన్నెల్ విషయంలో అప్పటి ప్రతిపక్ష నేత జానా రెడ్డిని ముందుపెట్టి కాంట్రాక్టరుకు 100 కోట్లు అడ్వాన్స్ ఇచ్చారు కేసీఆర్. కరోనా తర్వాత కాంట్రాక్టరు పనులు చేపట్టలేమంటే మళ్లీ 100 కోట్లు ఇచ్చిన ఘనత కేసీఆర్ ది టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు 30 ఏళ్లలో ఈ ప్రాజెక్టుపై పెట్టిన ఖర్చు 3340 కోట్లు కానీ కేవలం 10 ఏళ్లలో కేసీఆర్ పెట్టిన ఖర్చు 3890 కోట్లు ఇంత ఖర్చు పెట్టి 11 కీమీ మేర టన్నెల్ తవ్వి చేస్తే ముఖ్యమంత్రి అబద్దాలు చెబుతున్నారు

సొంత జిల్లాలో సొంత ఊరు పక్కన విపత్తు జరిగితే పట్టించుకోకుండా సీఎం ఢిల్లీ వెళ్లారు. 8 మంది ప్రాణాలు చిక్కుకుంటే ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. ఉత్తరాఖండ్ లో టన్నెల్ లో కార్మికులు చిక్కుకుంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్లి వాళ్లు ప్రాణాలతో బయటపడేవరకు అక్కడే ఉన్నారు. కానీ మన ముఖ్యమంత్రికి దేని మీదా సోయి లేదు. రాష్ట్రానికి సంబంధించి పార్లమెంటులో ప్రధాని అడగరు. ఇక్కడ ముఖ్యమంత్రి అడగరు.

ప్రధానిని కలిసిన రేవంత్ రెడ్డి పాత వినతులను కొత్తగా ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే పరిస్థితి లేదు. ఐరన్ లెగ్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక నాలుగు ప్రాజెక్టులు కొట్టుకుపోయాయి. సుంకిశాల ప్రాజెక్టు రిటైనింగ్ వాల్ కూలిపోతే ఇప్పటికీ అతీగతీ లేదు. ఖమ్మం జిల్లాలో పెద్దవాగు మీద మొత్తం ప్రాజెక్టు కొట్టుకుపోతే ప్రభుత్వం స్పందించలేదు. మెఘా కృష్ణా రెడ్డి కడుతున్న ప్రాజెక్టుల గురించి మాట్లావద్దన్నట్లుగా సీఎం వ్యవహరిస్తున్నారు.

సుంకిశాల ప్రాజెక్టు మీద ఒకరు ఆర్టీఐ వేస్తే దేశ భద్రతకు సంబంధించిన విషయం కాబట్టి జవాబు ఇవ్వమని ప్రభుత్వం చెప్పింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రజలు ముఖ్యమా? కాంట్రాక్టర్లు ముఖ్యమా ? ప్రధానిని కలిసిన వెంటనే బీఆర్ఎస్ పని ఖతమని సీఎం రేవంత్ రెడ్డి ప్రగల్భాలు పలికారు

మరి వీటన్నింటికి మా కుటుంబానికి, మా పార్టీకి సంబంధం ఏంటి ? ఇది కేసీఆర్ పై, బీఆర్ఎస్ పార్టీపై సీఎం కుట్ర పన్నడమే కానీ మరొకటి కాదు. సంబంధం లేని సంఘటనల గురించి ప్రధానిని కలిసిన తర్వాత సీఎం మాట్లాడారు దీన్ని బట్టే కుట్ర జరుగుతున్నట్లు అర్థమవుతున్నది.

LEAVE A RESPONSE