– అప్పన్న కొలువులో పోయింది సర్కారు పరువు
(ఈఎస్కే జర్నలిస్ట్)
జరిగిందేమీ చిన్న విషయం కాదు. ఏడు నిండు ప్రాణాల బలి..అది కూడా అప్పన్న సన్నిధిలో..అంతేనా? అతి పవిత్రమైన చందనోత్సవం సందర్భంగా!
జనం ఎక్కువైపోయి కొట్టుకుని చావలేదు. అది తొక్కిసలాట కూడా కాదు. గోడ కూలి అంత పెద్ద విపత్తు సంభవించింది. పోయింది ఏడు ప్రాణాలు కాదు. నాశనమైపోయింది ఏడు కుటుంబాలు. ఇదంతా జరిగింది ఎందువల్ల? కొందరి నిర్లక్ష్యం..ఇంకొందరి స్వార్థం.. మరికొందరి అవినీతి కారణంగా ఇంత ఘోరం జరిగిపోయింది.
సరే..ఇంత జరిగింది గనక ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని, సాక్షాత్తు సింహాచలేశుని పవిత్ర ప్రాంగణంలో అనునిత్యం జరుగుతున్న అవినీతి బాగోతాలపై దృష్టి పెట్టాలి. ఈరోజు జరిగిన ఇంత ఘోర సంఘటనకు మూలాలు కనుగొనడంతో పాటు, కొండపైన..కింద జరుగుతున్న ఎన్నెన్నో అక్రమాల కథలను వెలికితీయాల్సి ఉంది.
సింహాచలం దేవస్థానంలో జరుగుతున్న ఎన్నో నిర్మాణాల్లో ఎంతో కాలంగా అవినీతి తిష్ట వేసుకుని ఉన్నా, పట్టించుకునే నాధుడే లేడు. ఇక్కడి ఇంజనీరింగ్ సిబ్బంది
కాంట్రాక్టర్లతో లాలూచీ అయి, నిర్మాణాల నాణ్యతకు ఏనాడో తిలోదకాలు ఇచ్చేశారన్నది పెద్ద ఆరోపణ. ఉన్నతాధికారులకు కూడా ముడుపుల్లో వాటాలు అందుతున్నందున, వారు కూడా చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారన్నది ఇంకా పెద్ద ఆరోపణ.
కల్యాణమండపాలు.. క్యూ కాంఫ్లెక్సులు.. వసతి భవనాలు.. అన్ని నిర్మాణాల్లోనూ నాణ్యత లోపాలు ఉన్నాయని అనుకుంటారు. గోపురాల్లో కూడా అవినీతి కాపురాలు ఉన్నాయని విమర్శ. ఇలాంటి ఆరోపణలపై ఏ ప్రభుత్వమూ ఇంతవరకు దృష్టి పెట్టలేదు.
ఇప్పుడు ఇంత పెద్ద దుర్ఘటన జరిగి…ఏడు నిండు ప్రాణాలు బలైపోయి..
కూటమి ప్రభుత్వం పరువు పోతున్న ఈ దశలో కూడా ఇంకా సర్కారులోని పెద్దలు ఉదాసీనంగా వ్యవహరిస్తే అది ఆమోదయోగ్యం కాబోదు. సింహాచలం దేవస్థానం ఆధ్వర్యంలో జరిగిన నిర్మాణాలు కొన్నిటిపై ఖచ్చితంగా సమగ్ర విచారణ జరపాల్సిన అవసరం ఉంది. అందుకు ఇదే సరైన అదను.
నిర్మాణాలపై ఇతర శాఖల ఇంజనీరింగ్ నిపుణులతో థర్డ్ పార్టీ విచారణ జరిపితే, అవినీతి జరిగి ఉంటే ఆ కతలన్నీ బయట పడతాయి. ప్రభుత్వం ఆ దిశగా తక్షణమే స్పందించాల్సి ఉంది.