– తెలంగాణ చరిత్రలో గొప్ప ఘట్టానికి గుర్తుగా ‘దీక్షా దివాస్’
– నాయకులకు దిశానిర్దేశం చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్ : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) ఈ నెల 29న ‘దీక్షా దివాస్’ను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. దశాబ్దంన్నర క్రితం, పార్టీ అధినేత కె.సి.ఆర్ ‘తెలంగాణ వచ్చుడో.. కెసిఆర్ సచ్చుడో’ అనే గొప్ప త్యాగ నిరతితో దీక్షను చేపట్టి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. తెలంగాణ చరిత్రలో ఘనమైన ఈ ఘట్టాన్ని పురస్కరించుకొని దీక్షా దివాస్ను పెద్దఎత్తున నిర్వహించాలని కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
దీనికి సంబంధించి ఆయన ఈరోజు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జిల్లా అధ్యక్షులు మరియు పార్టీ జనరల్ బాడీ సభ్యులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి, దీక్షా దివాస్ నిర్వహణకు సంబంధించిన మార్గదర్శనం చేశారు. దీక్షా దివాస్ నిర్వహణకు ముందుగా, ఈ నెల 26వ తేదీన అన్ని జిల్లాల పార్టీ కేంద్రాల్లో ముఖ్య నాయకులతో సన్నాహక సమావేశాలు నిర్వహించుకోవాలని కేటీఆర్ సూచించారు.
ఈ సమావేశాలకు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు సహా ఇతర కీలక నాయకులందరినీ ఆహ్వానించాలని ఆయన ఆదేశించారు. ఈ సన్నాహక సమావేశాల ముఖ్య ఉద్దేశం, నవంబర్ 29న పార్టీ ఘనంగా నిర్వహించే దీక్షా దివాస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కార్యాచరణ ప్రణాళికను రూపొందించడమేనని కేటీఆర్ స్పష్టం చేశారు. నవంబర్ 29న జరిగే దీక్షా దివాస్ కార్యక్రమాన్ని అన్ని జిల్లా కేంద్రాల్లోని పార్టీ కార్యాలయాల్లోనే నిర్వహించాలి.
ఈ సందర్భంగా ఒక రోజు ముందుగా, అంటే 28వ తేదీ సాయంత్రంలోగా జిల్లా కేంద్రాలు, పట్టణాలను బ్యానర్లు, ఫ్లెక్సీలతో అలంకరణ పూర్తి చేయాలి. పార్టీ కార్యాలయం ప్రాంగణాన్ని కూడా సుందరంగా అలంకరించాలి. జిల్లాలోని ముఖ్య నాయకులందరికీ ప్రత్యేకంగా సమాచారం అందించి, కనీసం 1000 మంది కీలక పార్టీ నేతలతో ఈ సమావేశాన్ని నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకోవాలి.
మొదటగా తెలంగాణ తల్లికి, అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించిన తర్వాత, కార్యక్రమం ప్రారంభానికి గుర్తుగా కెసిఆర్ భారీ కటౌట్కు పాలాభిషేకం చేయాలి. దీక్షా దివాస్ సందర్భంగా జరిగిన అనేక కీలక సంఘటనలు, వార్తలు, పరిణామాల సమాహారంతో కూడిన ఫోటో ప్రదర్శనను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. ఈ ఫోటోలను పార్టీ కేంద్ర కార్యాలయం జిల్లాకు పంపిస్తుంది. వీటితో పాటు, స్థానిక జిల్లాల్లో దీక్షా దివాస్ సందర్భంగా జరిగిన సంఘటనల ఫోటోలు, వార్తా కవరేజ్ క్లిప్పింగ్లతో మరొక ఉప విభాగాన్ని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు.
కేవలం రాజకీయ ఉపన్యాసాలు కాకుండా, ఆనాటి ఉద్యమ స్మృతులను, ముఖ్యంగా దీక్షా దివాస్ వివరాలను అందించేలా మాట్లాడే వక్తలను ఆహ్వానించాలని, వారి సమయాన్ని ఇప్పుడే నిర్ధారించుకోవాలని కేటీఆర్ సూచించారు. దీక్షా దివాస్ రోజున పండ్ల పంపిణీ, వీలుంటే అన్నదానం లాంటి సామాజిక కార్యక్రమాలు చేపట్టవచ్చు. హైదరాబాద్లోని నిమ్స్ హాస్పిటల్లో ప్రత్యేకంగా పండ్ల పంపిణీ చేయనున్నారు. అలాగే, పార్టీ యూత్ మరియు విద్యార్థి విభాగం తరఫున ప్రతి యూనివర్సిటీలో దీక్షా దివాస్ కార్యక్రమాలు నిర్వహించాలి. ఈ సందర్భంగా వారు దీక్షా దివాస్ పేరుతో, కెసిఆర్ చిత్రంతో కూడిన ప్రత్యేక టీ-షర్టులను ధరించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.