Suryaa.co.in

Andhra Pradesh

నిర్మాణంలో ఉన్న‌ వైసీపీ కేంద్ర కార్యాల‌యం కూల్చివేత‌

-నియమ నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా తాడేపల్లి లో నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయం కూల్చివేత
-ఈ బెదిరింపుల‌కు తలొగ్గేది లేదు.. : వైఎస్‌ జ‌గ‌న్

నిబంధనలకు విరుద్ధంగా ఉందని అమరావతిలోని తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని సీఆర్‌డీఏ అధికారులు కూల్చేశారు. తాడేపల్లి మండలం సీతానగరం వద్ద నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయాన్ని ఉద‌యం 5.30 గంట‌ల ప్రాంతంలో పోలీసుల పహారా మధ్య ప్రొక్లెయినర్లు, బుల్డోజర్లతో సీఆర్‌డీఏ అధికారులు కూల్చేశారు. ఫస్ట్‌ ఫ్లోర్‌ పూర్తయి, శ్లాబ్ కు సిద్ధమవుతున్న టైంలో అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. నీటిపారుదల శాఖ స్థలంలో భవనం నిర్మిస్తున్నారని, అందుకే చర్యలు తీసుకున్నామని అధికారులు తెలిపారు.

భారీ భద్రత మధ్య కూల్చివేతలు సాగాయి. ఇక నిర్మాణంలో ఉ‍న్న ఈ భవనాన్ని కూల్చేయాలన్న సీఆర్‌డీఏ ప్రిలిమినరీ ప్రొసీడింగ్స్‌ ను సవాల్‌ చేస్తూ వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది. ఇదే విషయాన్ని సీ.ఆర్‌.డీ.ఏ కమిషనర్‌ దృష్టికి వైసీపీ న్యాయవాది తీసుకెళ్లారు. అయినప్పటికీ సీ.ఆర్‌.డీ.ఏ కూల్చివేతలు చేపట్టింది.

ఈ బెదిరింపుల‌కు తలొగ్గేది లేదు..:వైఎస్‌ జ‌గ‌న్

వైసీపీ కార్యాలయాన్ని కూల్చివేయ‌డంపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్‌ జ‌గ‌న్ ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా స్పందించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న సీఎం చంద్ర‌బాబుపై తీవ్ర‌ విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డ్డారు. “ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ కక్షసాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను మరోస్థాయికి తీసుకెళ్లారు. ఒక నియంతలా తాడేపల్లిలో దాదాపు పూర్తికావొచ్చిన వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయించారు. హైకోర్టు ఆదేశాలనూ బేఖాతరు చేశారు. రాష్ట్రంలో చట్టం, న్యాయం పూర్తిగా కనుమరుగైపోయాయి.

ఎన్నికల తర్వాత చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనలతో రక్తాన్ని పారిస్తున్న చంద్రబాబు, ఈ ఘటన ద్వారా ఈ ఐదేళ్ల పాటు పాలన ఏవిధంగా ఉండబోతుందనే హింసాత్మక సందేశాన్ని ఇవ్వకనే ఇచ్చారు. ఈ బెదిరింపులకు, ఈ కక్షసాధింపు చర్యలకు వైసీపీ పార్టీ తలొగ్గేది లేదు, వెన్నుచూపేది అంతకన్నా లేదు. ప్రజల తరఫున, ప్రజలకోసం, ప్రజలతోడుగా గట్టిపోరాటాలు చేస్తాం. దేశంలోని ప్రజాస్వామ్య వాదులంతా చంద్రబాబు దుశ్చర్యల్ని ఖండించాలని కోరుతున్నాను” అంటూ జ‌గ‌న్ ట్వీట్ చేశారు.

LEAVE A RESPONSE