– అలిపిరి చెక్ పాయింట్ నుంచి తిరుమలకు
– కుక్క ను గమనించకుండా సెక్యూరిటీ సిబ్బంది అనుమతి
– కుక్కతో వచ్చిన కర్ణాటక భక్తులు
తిరుమల శ్రీవారి దర్శనానికి పెంపుడు కుక్కతో వచ్చిన కర్ణాటక భక్తులు టిటిడి విజిలెన్స్ సిబ్బంది ని ముప్పతిప్పలు పెట్టారు. అల్లారు ముద్దుగా ఇంట్లో పెంచుకున్న పెంపుడు జంతువుతో సహా, వారు తిరుమలకు విచ్చేశారు. ఇంటి ఇలవేల్పును కొలిచేందుకు తమ పెంపుడు కుక్కను కూడా వెంటపెట్టుకుని, టెంపో ట్రావెలర్ లో తిరుమల యాత్రకు వచ్చారు .
ఈ క్రమంలోనే అలిపిరి చెక్ పాయింట్ నుంచి తిరుమలకు చేరుకున్నారు. అలిపిరి లోని సప్తగిరి వాహనాల తనిఖీ కేంద్రం వద్ద టెంపో ట్రావెలర్ లో, కుక్క ను గమనించకుండా అనుమతించింది అక్కడి సెక్యూరిటీ సిబ్బంది. దీంతో సదరు పెంపుడు కుక్క దర్జాగా కొండెక్కింది.
తిరుమలలో పెంపుడు జంతువులకు అనుమతి లేదని తెలియకుండా, వెంట తీసుకెళ్లిన భక్తులతో కుక్క తిరుమల చేరుకుంది. తిరుమల రామ్ భగీచా బస్టాండ్ వద్ద మీడియా కంట పడింది. వాహనంలో తిరుమల శ్రీవారి ఆలయం వైపు చూస్తున్న కుక్కను గమనించిన మీడియా, తమ కెమెరాల్లో బంధించింది. దీంతో విషయం విజిలెన్స్ సిబ్బందికి తెలిసిపోయింది. వెంటనే అలర్ట్ అయిన టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది కుక్క ఉన్న టెంపో ట్రావెలర్ కోసం వెతకడం ప్రారంభించింది.
టెంపో ట్రావెలర్ పార్కింగ్ చేసిన కర్ణాటక భక్తుల వాహనాన్ని గుర్తించి, తిరుమల కొండ దింపే ప్రయత్నం చేస్తోంది. వాహనం నంబర్ తెలుసుకుని కుక్కకోసం వేట సాగించింది.