Suryaa.co.in

Andhra Pradesh

లైఫ్ ఆఫ్ కర్మయోగి-మెమరీస్ ఆఫ్ ఏ సివిల్ సర్వెంట్

– పుస్తకంపై ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో చర్చా వేదిక
– సేవా ధర్మం, నైతిక పరిపాలన, నాయకత్వ విలువలపై ప్రముఖుల సమీక్ష
– ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు

గుంటూరు (ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం): తక్షశిల ఐఏఎస్ అకాడమీ మరియు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ పాలసీ, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో, “లైఫ్ ఆఫ్ కర్మయోగి – మెమరీస్ ఆఫ్ ఏ సివిల్ సర్వెంట్” పుస్తకంపై చర్చా కార్యక్రమం బుధవారం విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో నిర్వహించారు.

ఈ పుస్తకాన్ని రచించిన ఎం. గోపాలకృష్ణ ఐఏఎస్ (రిటైర్డ్) సివిల్ సర్వెంట్ గా తన జీవిత అనుభవాల ఆధారంగా రచించిన పుస్తకంపై జరిగిన చర్చలో సీనియర్ ఉద్యోగులు, విద్యావేత్తలు, సివిల్ సర్వీసెస్ ఆశావహులు పాల్గొన్నారు. ప్రజాసేవా భావన, నైతిక పరిపాలన, ఆచరణాత్మక నాయకత్వం వంటి అంశాలపై అర్థవంతమైన చర్చ సాగింది.

ప్రధాన అతిథిగా హాజరైన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ) ఎం.టి. కృష్ణబాబు మాట్లాడుతూ, ఈ పుస్తకం ఒక అసాధారణమైన, నిజాయితీతో కూడిన వ్యాసంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఇది ప్రస్తుత అధికారులకు మరియు భవిష్యత్తు సివిల్ సర్వీసు ఆశావహులకు ప్రేరణనిచ్చే గ్రంథమని అభిప్రాయపడ్డారు. ఆయన భారత పరిపాలనా సేవలలో చేసిన విశిష్ట సేవ, ప్రజాకేంద్రీకృత పరిపాలన పట్ల ఉన్న నిబద్ధతను ప్రస్తావించారు. నిజాయితీతో కూడిన జీవన కథగా ఈ పుస్తకాన్ని మలిచారని పేర్కొన్నారు.

తదుపరి ప్రసంగంలో, రచయిత ఎం. గోపాలకృష్ణ, ఎంతో వినయంగా తన అనుభవాలను పంచుకున్నారు. ఫీల్డ్ పోస్టింగ్‌లు, విధాన రూపకల్పన, అమలు వంటి అనేక రంగాలలో ఎదురైన సవాళ్ళను వివరించడమేకాక, “కర్మయోగం” అనే సూత్రాన్ని తన జీవిత దిశగా ఎంచుకున్నానని చెప్పారు. కర్తవ్యాన్ని లాలస లేకుండా నిబద్ధతతో చేయడమే నిజమైన సేవ అన్నారు. ఆయన మాటలు ముఖ్యంగా యువ విద్యార్థుల్లో పలు ఆత్మీయ స్పందనలు రేపాయి.

ఈ కార్యక్రమానికి తక్షశిల ఐఏఎస్ అకాడమీ చీఫ్ పేట్రన్, మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ వి.ఎన్. విష్ణు మాట్లాడుతూ, ఈ పుస్తకం నిజమైన సివిల్ సర్వీస్ స్పూర్తికి నిదర్శనమని కొనియాడారు. నైతిక విలువలతో కూడిన పరిపాలన తరం తరాలకు స్ఫూర్తిగా నిలవాలంటే ఇలాంటి రచనలు అవసరమని తెలిపారు.

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం రెక్టర్ ప్రొఫెసర్ కె. రత్న శీల మణి మాట్లాడుతూ ప్రజా పాలనలో ఇటువంటి అనుభవాత్మక రచనలు ముఖ్యమైన భాగంగా మారాలన్నారు. విద్యార్థులు పరిపాలన యొక్క వాస్తవ అనుభవాలను తెలుసుకునేలా చేయాలని సూచించారు. యూనివర్శిటీ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎం. సురేశ్ కుమార్, తక్షశిల ఐఏఎస్ అకాడమీ మేనేజింగ్ డైరెక్టర్ బి.ఎస్.ఎన్. దుర్గాప్రసాద్ ప్రసంగించారు.

ఈ పుస్తకంలోని పారదర్శకత, నిజాయితీ, భావోద్వేగాల పరిమితి, భవిష్యత్తు పాలనాధికారులకు ఇది ఎలా దిశానిర్దేశం చేస్తుందన్న అంశాలను వారు ప్రశంసించారు. ఈ కార్యక్రమం ఒక పుస్తకం చర్చగా మాత్రమే కాకుండా, ప్రజాసేవా స్ఫూర్తిని కొత్త తరం లోకి బలంగా బోదించే ఒక వినూత్న వేదికగా నిలిచింది.

LEAVE A RESPONSE