Suryaa.co.in

Andhra Pradesh

ఆటోవాలాగా మారిన కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్

– రామచంద్రపురం లో ఒకరోజు ముందుగానే మే డే ను తీసుకొచ్చిన కార్మిక మంత్రి
– అసలు సిసలైన కార్మికుడు సీఎం చంద్రబాబు
– ఈశ్రం పోర్టల్ కార్డులు పంపిణీ
– నిరుపేద ఆటోకార్మికులకు ఇన్సూరెన్స్ నే చెల్లిస్తా
– కార్మికులకు నూతన వస్త్రాలు పంపిణీ
– కార్మికులతో కలిసి భోజనం చేసిన కార్మిక శాఖ మంత్రి సుభాష్

రామచంద్రపురం : రామచంద్రపురం లో మే డే వేడుకలు ముందస్తుగా ఒకరోజు ముందే అంగరంగ వైభవంగా జరిగాయి. మే డే రోజున మంత్రి వాసంశెట్టి సుభాష్ అమరావతి లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనవలసి ఉన్నందున మంత్రి తన సొంత నియోజకవర్గమైన రామచంద్రపురంలో ముందుగానే మే డే ఘనంగా కార్మికుల సమక్షంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ కార్మికుల యూనిఫామ్ (ఖాకీ డ్రస్, మెడలో ఎరుపు తవ్వాలు వేసుకుని కార్మికులతో కలిసి మే డే ర్యాలీ (ఆటో ర్యాలీ) లో పాల్గొని కార్మికులకు అండగా నేనుంటా అంటూ భరోసా ఇచ్చారు. ఖాకీ బట్టలతో మంత్రి సుభాష్ స్వయంగా ఆటో నడిపి కార్మికుల పట్ల తనకున్న చిత్తశుద్ధిని వెల్లడించారు. వెల్ల బ్రిడ్జి దగ్గర నుంచి ప్రారంభమైన కార్మికుల ర్యాలీ లలితా నగర్ లోని సభావేదిక వరకు సాగింది.

అనంతరం జరిగిన సభలో మంత్రి సుభాష్ మాట్లాడుతూ కార్మికుల కష్టంతోనే ఈ దేశ ఆర్థిక అభివృద్ధి ఆధారపడి ఉందన్నారు. కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా, వారి భవితకు భద్రత కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈశ్రమ్ కార్డులు ద్వారా భీమా కల్పిస్తుంది అన్నారు. అలాగే చంద్రన్న బీమా ద్వారా కార్మికులకు 10 లక్షల ప్రమాద భీమా సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రిగా కాకుండా ఒక సాధారణ కార్మికుడిలా నిత్యం కార్మిక సంక్షేమానికి కట్టుబడి పని చేస్తానని హామీ ఇచ్చారు.

ఆటో కార్మికులు వ్యక్తిగత ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని, ఎవరైనా పేదరికంతో ఇన్సూరెన్స్ కట్టుకోలేని పరిస్థితిలో ఉంటే, వాళ్లకి తన తరపున సగం ప్రీమియం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నా అన్నారు. కార్మికులు, నిరుద్యోగుల సంక్షేమానికి చిన్న, సూక్ష్మ,మధ్యతర పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం 2025 -26 సంవత్సరానికి గాను 1,28,000 కోట్లు ఎమ్మెస్ ఎంఈ లకు కేటాయించడం పట్ల సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ సమావేశంలో పాల్గొన్న ఆటో యూనియన్ కార్మికులకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. పలువురు ఆటో కార్మికులను ఈ సందర్భంగా మంత్రి సన్మానించారు. అనంతరం జరిగిన విందులో కార్మికులతో కలిసి మంత్రి సుభాష్ పాల్గొని సహపంక్తి భోజనాలు చేశారు. ఒక మంత్రిగా కాకుండా సాధారణ కార్మికునిగా తమతో మమేకమవడం పట్ల కార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేశారు.

కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం మాట్లాడతూ కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేశారు. కార్మికుల పక్షాన సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ ఎప్పుడూ సేవలు అందిస్తుందని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అసిస్టెంట్ లేబర్ కమిషనర్ నాగలక్ష్మి, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ రామచంద్రపురం విజయ్ ప్రకాష్, పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం, ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షుడు కంచుమర్తి బాబురావు, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కడియాల రాఘవన్, కూటమి పార్టీ నాయకులు, పలువురు ఆటో యూనియన్ సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE