– రాష్ట్ర సాయంపై సత్యకుమార్ యాదవ్ హామీ
– రాష్ట్ర ప్రభుత్వ వైద్యులకు, పరిసర ప్రాంతాల తెలుగు ప్రజలకు చేకూరనున్నప్రయోజనం
– జిప్మెర్ విజ్ఞప్తికి మంత్రి సత్యకుమార్ యాదవ్ అంగీకారం
అమరావతి: యానాంలో జిప్మెర్ సూపర్ స్పెషాలిటీ సేవల్ని అందించడానికి అవసరమైన సాయాన్ని సమకూర్చటానికి రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ అంగీకరించారు. కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి ( పాండిచ్చేరి)లో భాగమైన యానాంలో ప్రఖ్యాత జిప్మెర్( జవహర్ లాల్ నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్) నిర్మించిన 100 పడకల సూపర్ స్పెషాలిటీ సెంటర్ ద్వారా ప్రజలకు సేవలందించడానికి రాష్ట్ర ప్రభుత్వ సాయాన్ని కోరింది.
ఈ విషయంపై యానాం మాజీ శాసన సభ్యులు మరియు పుదుచ్చేరి మాజీ ఆరోగ్య శాఖా మంత్రి మల్లాడి కృష్ణారావు, పుదుచ్చేరి లోని జిప్మెర్ డైరెక్టర్ డాక్టర్ వి.యస్.నేగి మరియు ఉన్నతాధికారులు బుధవారం నాడు రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, సెకండరీ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ ఎ.సిరి, డిఎంఇ డాక్టర్ నరసింహం ఇతర ఉన్నతాధికారులతో ఏపీ సచివాలయంలో చర్చించారు.
యానాంలో జిప్మెర్ సెంటర్ నిర్మాణం పూర్తయిందని, వివిధ మల్టీ స్పెషాలిటీ విభాగాల్లో సేవలందించడానికి అవసరమైన సిబ్బందిని సమకూర్చాలని కృష్ణారావు కోరారు. యానాం జనాభా 80 వేలు మాత్రమే అయినప్పటికీ ఆనుకుని ఉన్న ఆంధ్రప్రదేశ్ జిల్లాల నుంచి భారీ స్థాయిలో పలు అవసరాల కోసం ప్రతి రోజూ యానాంకు వస్తారని, జిప్ మెర్ కేంద్రం సేవలు తెలుగు ప్రజలకు ఎంతో మేలు చేకూరుస్తాయని, కనుక తగు సాయాన్ని చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
రూ.91 కోట్ల ఖర్చుతో యానాంలో నెలకొల్పిన జిప్మెర్ సూపర్ స్పెషాలిటీ కేంద్రం అందించనున్న సేవలు, తద్వారా రాష్ట్ర ప్రజలకు ఒనగూరే మేలు, ఈ కేంద్రాన్ని నడపటానికి అవసరమైన డాక్టర్లు, నర్సులు, పారా టెక్నికల్ సిబ్బంది వివరాల్ని డైరెక్టర్ నేగి మంత్రి సత్యకుమార్ యాదవ్ కు వివరించారు. ఈ కేంద్రం ద్వారా అందించే సేవల్ని పొందే వారిలో 75 శాతం మంది చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వస్తారు కనుక ఈ కేంద్రాన్ని నడపడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎంతో ప్రయోజనం ఉంటుందని ఆయన తెలిపారు.
జిప్మెర్ కోరిన సాయం
ప్రసూతి సేవలు, పిల్లల వైద్యం, మత్తు వైద్యం, శస్త్ర చికిత్స వంటి వివిధ సూపర్స్పెషాలిటీ విభాగాల్లో నిపుణులైన డాక్టర్లను, నర్సులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డెప్యుటేషన్ పై నియమించాలని జిప్మెర్ డైరెక్టర్ డాక్టర్ నేగి కోరారు. అవసరాల మేరకు సీనియర్ రెసిడెంట్ డాక్టర్లను, డిస్ట్రిక్ట్ రెసిడెన్సీ ప్రోగ్రాం(డిఆర్పి) కింద పీజీ విద్యార్థుల్ని యానాం కేంద్రంలో పోస్ట్ చేయాలని కూడా కోరారు. వారికి తగు వసతి సదుపాయాల్ని కల్పించడంతో పాటు, డెప్యుటేషన్ అలవెన్స్ తో కూడిన జీతభత్యాల్ని పుదుచ్చేరి ప్రభుత్వం చెల్లిస్తుందని ఆయన తెలిపారు. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద యానాం కేంద్రాన్ని నెట్వర్క్ ఆసుపత్రిగా గుర్తించాలని డాక్టర్ నేగి కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం అందించే సాయానికి బదులుగా ప్రభుత్వ వైద్యుల్ని లెప్రోస్కోపీ, అయవ మార్పిడి చికిత్సలు, రోబోటిక్ సర్జరీల వంటి విభాగాల్లో పుదుచ్చేరిలోని యానాంలోని జిప్మెర్ లో శిక్షణ ఇస్తామని డాక్టర్ నేగి మంత్రికి వివరించారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన జిప్మెర్ శిక్షణ వల్ల ఆంధ్రప్రదేశ్ వైద్యులకు ఎంతో మేలు చేకూరుతుందని ఆయన వివరించారు.
మంత్రి హామీ
జిప్మెర్ యానాం కేంద్రం ద్వారా చుట్టుపక్కల ఉన్న తెలుగు ప్రజలకు కలిగే ప్రయోజనాలతో పాటు ప్రఖ్యాత జిప్మెర్ లో రాష్ట్ర ప్రభుత్వ వైద్యులకు లభించే ఆధునిక శిక్షణ మరియు సీనియర్ రెసిడెన్సీ, డిఆర్పి ప్రోగ్రాంల కింద రాష్ట్ర వైద్య విద్యార్థులకు జిప్మెర్ సర్టిఫికెట్ ద్వారా ఒనగూరే ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకుని జిప్మెర్ కోరిక మేరకు వివిధ అంశాలపై తగు సాయాన్ని అందించడానికి మంత్రి సత్యకుమార్ యాదవ్ అంగీకరించారు. ఈ మేరకు నిర్దిష్ట ప్రతిపాదనల్ని అందజేయాలని మంత్రి సూచించారు.