Home » ఎందుకీ కూల్చి‘వెత’లు?

ఎందుకీ కూల్చి‘వెత’లు?

– వైసీపీ ఆఫీసుల కూల్చివేతలపై చర్చ
– ఆసుపత్రులుగా మార్చండి
– ప్రభుత్వ భవనాలుగా మార్చినా సరే
– నిర్మాణ ఖర్చు మిగిలినట్లే
– హెచ్‌ఓడీలకు ఇస్తే సరి
– కలెక్టర్లు,ఎస్పీలకు క్యాంపు ఆఫీసులేవీ?
– అద్దె ఖర్చులూ ఆదా
– ప్రజల్లో వ్యతిరేకతా ఉండదు
– కూల్చివేస్తే టీడీపీ-వైసీపీకి తేడా ఏమిటి?
– విధాన నిర్ణయంపై ఎదురుచూపులు
– తటస్థులు, విద్యావంతుల్లో చర్చ
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఏపీలో అమరావతి వైసీపీ కార్యాలయం సహా దాదాపు అన్ని జిల్లాల్లోనూ ప్రభుత్వ స్థలాల్లో ఆ పార్టీ నిర్మించిన పార్టీ కార్యాలయాల కూల్చివేతపై ప్రజల్లో ఆసక్తికరమైన చర్చకు తెరలేచింది. ప్రభుత్వ భూములను లీజుకు తీసుకుని, అనుమతి లేకుండా వైసీపీ నిర్మించి-నిర్మిస్తున్న రాజభవనాల వంటి పార్టీ కార్యాలయాలను కూల్చివేయటం అనవసరమన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. అవి ఎలాగూ ప్రభుత్వ భూమి కాబట్టి, వాటిని స్వాధీనం చేసుకుని ప్రజోపయోగ కార్యక్రమాలకు వాడుకుంటే బాగుంటుందన్న వాదన వినిపిస్తోంది.

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి సహా, అన్ని జిల్లాల్లోనూ పార్టీ కార్యాలయాల కోసం ప్రభుత్వ భూములు లీజులు తీసుకుంది. అయితే వాటికి ఎలాంటి అనుమతులూ లేవు. గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా పార్టీ ఆఫీసులకు ప్రభుత్వ భూములు కేటాయించినప్పటికీ, అన్ని అనుమతులూ తీసుకున్న తర్వాతనే పార్టీ ఆఫీసులు నిర్మించింది. దానికోసం వివిధ శాఖల నుంచి అనుమతులు ఆలస్యమైనప్పటికీ అప్పటివరకూ వేచి చూసి, అవి వచ్చిన తర్వాతనే ఆఫీసులు నిర్మించింది.

కానీ వైసీపీ మాత్రం వివిధ శాఖల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా, కేవలం దరఖాస్తు చేసి వాటి నుంచి ఎలాంటి మంజూరు లేకుండానే, రాజభవనాల తరహాలో పార్టీ ఆఫీసులు నిర్మించింది. ఆ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత, అనుమతులు లేని వైసీపీ ఆఫీసులను కూల్చాలని ప్రభుత్వం సిద్ధమవుతోంది. అందులో కొన్ని ఆఫీసులను కూల్చివేసింది.

అయితే ఈ విధానం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని, పైగా వాటి కూల్చివేతకు ప్రభుత్వానికి అదనపు ఖర్చు అని వివిధ వర్గాలు భావిస్తున్నాయి. అవే ఆఫీసులను ప్రభుత్వ కార్యాలయాలు, లేదా ప్రభుత్వ ఆసుపత్రులు, మంత్రుల క్వార్టర్లకు కేటాయిస్తే ప్రభుత్వానికి బోలెడు ఖర్చు ఆదా అవుతుందన్న సూచన వ్యక్తమవుతోంది.

కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో.. ప్రధాన కేంద్రాల్లో ప్రభుత్వానికి సొంత భవనాలు కరవవుతున్నాయి. విజయవాడ సహా జిల్లా కేంద్రాల్లో చాలా భవనాలకు ప్రభుత్వమే అద్దె చెల్లిస్తోంది. ఇప్పుడు అనుమతులు లేకుండా వైసీపీ నిర్మించిన భవనాలను స్వాధీనం చేసుకుని, వాటిని ప్రభుత్వ భవనాలుగా మారిస్తే, ప్రభుత్వంపై ఆర్ధిక భారం తప్పుతుందని సూచిస్తున్నారు.

కొన్ని జిల్లాల్లో అయితే.. వైసీపీ రాజభవనాలను తలదన్నేలా చేసిన నిర్మాణాలను 30 పడకల ఆసుపత్రులుగా మారిస్తే, రోగులకూ వెసులుబాటు ఉంటుందన్న సూచన వ్యక్తమవుతోంది.

కొత్త జిల్లాల నేపథ్యంలో కలెక్టర్, ఎస్పీల క్యాంపు కార్యాలయాలకు భవనాలు లేకుండా పోయాయి. ఇప్పుడు వైసీపీ భవనాలను వాటికి వినియోగించినా, ఉపయోగంగా ఉంటుందని మరికొందరు సూచిస్తున్నారు. వైసీపీ ఏ శాఖ భూములు తీసుకుందో, ఆ శాఖ కార్యాలయాలు కూడా అందులో ఏర్పాటు చేసుకోవచ్చంటున్నారు. ‘‘ ఎలాగూ అవి ప్రభుత్వ భూములే. నిర్మాణాలు పార్టీకి చెందినప్పటికీ భూమి ప్రభుత్వానిదే అయినందున అక్కడ ప్రభుత్వ కార్యాలయాలు, లేదా 30 పడకల ఆసుపత్రులు, అదీకాకపోతే ఎస్పీ-కలెక్టర్ల క్యాంపు ఆఫీసులుగా ఉపయోగించుకోవచ్చు’’ అని ఓ మాజీ మంత్రి సూచించారు.

అలాకాకుండా, వాటిని కూల్చివేసినందున ప్రజల్లో పార్టీ-ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చే అవకాశం ఉందనన్నారు. జగన్ సీఎం అయిన వెంటనే ప్రజావేదికను కూల్చివేసిన వైనంపై, ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమయిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ప్రజావేదికను కూల్చకుండా.. దానిని కలెక్టర్లు, ఎస్పీల సమావేశాలకు వాడుకుంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమయింది. జగన్ శాడిజంతో కోట్లాది రూపాయల ప్రజాధనం వృధా చేశారన్న విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే.

ఇప్పుడు తాము కూడా కూల్చివేతలు ప్రారంభిస్తే.. ఇటీవలి ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసిన తటస్థులు, విద్యావంతులు, మేధావుల దృష్టిలో, ‘వైసీపీ-టీడీపీ విధానాలు ఒకటే’నన్న భావన ఏర్పడే ప్రమాదం ఉందంటున్నారు. దీనిపై విధాన నిర్ణయం తీసుకోవాలంటున్నారు. ఇప్పటికే వైసీపీ కార్యకర్తల ఆస్తులపై.. గ్రామస్థాయిలో జరుగుతున్న దాడులు, సోషల్‌మీడియాలో వైరల్ అవుతుండటంతో పార్టీ ఇమేజ్ డామేజీ అవుతోందన్న ఆందోళన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

‘గతంలో వైసీపీ ప్రభుత్వంలో చేసిన అరాచకాలే టీడీపీ కూడా చేస్తే, అప్పుడు ఇద్దరికీ తేడా లేదన్న భావన్న భవిష్యత్తులో ప్రమాదం. దీన్ని కిందస్థాయి నుంచే అడ్డుకోకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ నష్టపోకతప్పదని’’ మాజీ మంత్రి ఒకరు వ్యాఖ్యానించారు.

Leave a Reply