(పులగం సురేష్)
మొన్నటి దాడులు పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపైనే జరిగాయో..పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని తీవ్రవాద ప్రాంతాలపైనే జరిగాయో..పాకిస్తాన్ ప్రభుత్వం చెబుతున్నట్టు ఆ దేశంలోని నివాస ప్రాంతాలపై(?)
జరిగాయో..
ఒకటి మాత్రం పక్కా..
ఇకపై పాకిస్తాన్ ప్రజలను
ప్రతి ఉదయం
బాంబుల మోతలే
నిద్రలేపనున్నాయి.
ఇప్పటికే ఆ దేశ ప్రజలకు, పాలకులకు నిద్రలేని రాత్రులు
మొదలయ్యాయి.
ఏ సమయంలో తమ ఇళ్లపై బాంబుల వర్షం కురిసి తమ ప్రాణాలు నిశీధిలో.. కుటుంబం అంతా ఒక్క చోటే పడుకున్నా గాని ఒకరికి తెలియకుండా ఒకరు చనిపోతామనే ఆందోళనతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.
ఆ భయం మొన్న మంగళవారంతో పరాకాష్టకు చేరుకుంది.తమకు ప్రత్యక్షంగా..పరోక్షంగా ప్రమేయం ఉన్నా లేకున్నా.. దశాబ్దాల తరబడి తమ పాలకులు అనుసరిస్తున్న భారత వ్యతిరేక వైఖరి ఈరోజున..ఇలా తమ పాలిట సింహస్వప్నంగా పరిణమించిందని పాకిస్తాన్ ప్రజలు గ్రహించడానికి ఎంతో సమయం పట్టలేదు.
పెహల్గాన్ ఉగ్రదాడి తర్వాత భారత్ ప్రతీకార చర్యకు దిగుతుందని..ఫలితం తీవ్రంగా ఉండబోతోందని పాకిస్తాన్లో ప్రతి పౌరునికి తెలుసు.అంతేకాదు.. తమ ప్రభుత్వం ఎంతగా బీరాలు పలికినా తమ దేశ సైనిక బలం భారతదేశ సైనిక సంపద ముందు ఎందుకూ కొరగాదని కూడా పాకిస్తాన్ ప్రజలకు బాగా ఎరుక!
పౌరుల మనస్తత్వం ఇలా ఉండగా ఇవేవీ పట్టని పాకిస్తాన్ పాలకులు ప్రపంచదేశాల మాటలను కూడా పెడచెవిన పెట్టి, కాశ్మీర్ విషయంలో.. ఆ అంశమే ప్రధానంగా ఇండియాతో చెలిమి విషయంలో అనవసర ప్రతిష్ఠలకు..అత్యాశకు పోయి మొదటి నుంచి కొరివితో తల గోక్కుంటూనే వస్తున్నారు.
ఇది తలకి మించిన భారమని ఆ దేశ పెద్దలకు తెలియక కాదు.అత్యంత శక్తిమంతమైన భారతదేశానికి ఎదురెళ్లి ఇప్పటికే ఎన్నో చావు దెబ్బలను చవిచూసిన అనుభవం పాకిస్తాన్ కు ఉంది. అయినా బుద్ధి మారని దాయాది.. ఇండియాని ఎదుర్కోడానికి అందుబాటులో ఉన్న..లేని ఎన్నో మార్గాలను ఎన్నుకుంది.
వాటిలో ప్రధానమైనది భారతదేశానికి వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం. ప్రపంచంలోని ఉగ్రవాద సంస్థలు ఎన్నిటినో ఎంచి..ఏరి తమ దేశంలో ఆశ్రయం ఇవ్వటమే గాక శిక్షణా శిబిరాలను కూడా నిర్వహించి, అవకాశం దొరికినప్పుడల్లా భారత్ పై దాడులకు ఉసిగొల్పడాన్ని పాకిస్తాన్ ఒక పనిగా పెట్టుకుంది.
నిజానికి ఈ విషయంలో పాకిస్తాన్ పాలకులు తమ దేశ పౌరులకు తీరని అన్యాయం చేస్తూ వస్తున్నారు.ప్రజలపై..వారి అవసరాలపై..సౌకర్యాలపై ఖర్చు చేయాల్సిన సొమ్మును ఉగ్రవాదులపై.. వారిని మేపడంపై ఖర్చు చేసి దేశ ఆర్థిక వ్యవస్థను భ్రష్టుపట్టించారు. ఫలితంగా పాకిస్తాన్లో తీవ్ర ఆర్ధిక సంక్షోభ పరిస్థితులు తలెత్తి ప్రజల్లో కనీవినీ ఎరుగని అసంతృప్తి నెలకొంది.ప్రజల్లో ప్రభుత్వం పట్ల భయంకరమైన అసంతృప్తి ఏర్పడి ఉంది.
సామాన్య పౌరులు తిండి కోసం అల్లాడుతున్న పరిస్థితుల్లో పాకిస్తాన్ ప్రభుత్వం కోట్లు ఖర్చు పెట్టి .. ఉగ్రవాదులకు ఖరీదైన మాంసాహారం పెడుతూ ఉండడం గమనించదగ్గ విషయం. ఇప్పుడు తాజా పరిణామాల్లో కూడా పాకిస్తాన్ ప్రజల్లో కొంత మేర అభిప్రాయ బేధాలున్నట్టుగా తెలుస్తోంది. యుద్ధం పట్ల ఆ దేశ ప్రజల్లో
కొందరు సుముఖంగా లేరు. దీనికి కారణం భారతదేశంపై ప్రేమ కాదు..తమ బ్రతుకులు ఏమవుతాయోనన్న ఆందోళన.
ఇండియాతో తలపడే శక్తి పాకిస్తాన్ కు లేదు.పాక్ దుర్బుద్ధి కారణంగా ప్రపంచ దేశాల మద్దతు కూడా, ప్రధానంగా ఇండియాకే లభించే అవకాశాలు జాస్తి. ఫలితంగా పాకిస్తాన్ ఓటమి పాలైతే తమ భవిష్యత్తు ఏమిటన్నది పాకిస్తాన్ ప్రజల ప్రధాన ఆందోళన.
ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్ పై యుద్ధంలో గెలుపొందడం మాట అటుంచితే పాక్ ప్రజల్లోని ఈ అభిప్రాయబేధాలు ఆ దేశ విభజనకు దారి తీసినా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు.