Suryaa.co.in

Telangana

అన్ని జిల్లాల్లో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్ పంపిణీ

-సంబంధిత ఫైల్ పై సంతకం చేసిన సీఎం కేసీఆర్
-రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధి పొందనున్న 6.84 లక్షల మంది గర్భిణులు
-13.08 లక్షల కిట్స్ పంపిణీ చేయాలని లక్ష్యం
-ఒక్కో కిట్ విలువ రెండు వేల రూపాయలు
-మొత్తం రూ. 277 కోట్లు ఖర్చు చేయనున్న ప్రభుత్వం
-ఉత్తర్వులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
-సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన ఆరోగ్య మంత్రి హరీశ్ రావు

రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ కార్యక్రమాన్ని విస్తరించి, అమలు చేసేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన దస్త్రంపై ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నూతన సచివాలయం ప్రారంభించుకున్న సందర్బంగా సంతకం చేశారు. అనంతరం ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. రక్తహీనత అధికంగా ఉన్న తొమ్మిది జిల్లాల్లో ప్రభుత్వం ఇప్పటికే న్యూట్రిషన్ కిట్ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు, కామారెడ్డి కలెక్టరేట్ నుండి వర్చువల్ మోడ్ లో రాష్ట్ర వ్యాప్తంగా 9 జిల్లాల్లో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పంపిణీనీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు గతేడాది డిసెంబర్ 20 న ప్రారంబించారు.

ఆదిలాబాద్‌, భ‌ద్రాద్రి కొత్తగూడెం, జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి, జోగులాంబ గ‌ద్వాల్‌, కామారెడ్డి, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, ములుగు, నాగ‌ర్ క‌ర్నూల్‌, వికారాబాద్ లో మొత్తం1.25 లక్షల మంది గ‌ర్బిణుల‌కు రెండు ఏఎన్‌సీల్లో మొత్తంగా రెండున్నర లక్షల కిట్లు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మిగతా 24 జిల్లాల్లో కిట్స్ పంపిణీ నీ వైద్యారోగ్య శాఖ ప్రారంభించనుంది. ప్రోటీన్స్‌, మిన‌ర‌ల్స్‌, విట‌మిన్స్, ఐరన్ ల‌ను పోష‌కాహారం ద్వారా అందించి ర‌క్త హీన‌త త‌గ్గించ‌డం, హీమోగ్లోబిన్ శాతం పెంచ‌డం న్యూట్రీషన్‌ కిట్ల లక్ష్యం.

రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలో 6.84 లక్షల మంది గర్భిణులకు 1046 కేంద్రాల ద్వారా మొత్తంగా 13.08 లక్షల కిట్స్ పంపిణీ చేయాలని లక్ష్యంగా ఉంది. ఒక్కో కిట్ విలువ రెండు వేల రూపాయలు కాగా, మొత్తం రూ. 277 కోట్లుగా ప్రభుత్వం అంచనా వేసింది. 14-26 వారాల మధ్య జరిగే రెండో ఏఎన్‌సీ చెకప్‌ సమయంలో ఒకసారి, 27-34 వారాల మధ్య చేసే మూడో ఏఎన్‌సీ చెకప్‌ సమయంలో రెండో సారి ఈ కిట్లను ఇవ్వడం జరుగుతుంది.

కెసిఆర్ న్యూట్రిషన్ కిట్ లో ఉండేవి…
1, కిలో న్యూట్రీష‌న్ మిక్స్ పౌడ‌ర్
2, కిలో ఖ‌ర్జూర‌
3, ఐర‌న్ సిర‌ప్ 3 బాటిల్స్‌
4, 500 గ్రాముల నెయ్యి
5, కప్పు
6, పల్లి పట్టి 200 గ్రాములు
7, ప్లాస్టిక్ బాస్కెట్

రక్త హీనత (ఎనీమియా) గర్బిణుల పాలిట శాపంగా మారుతున్నది. గర్బిణులకు ప్రసవాలు సంక్లిష్టంగా మారుతున్నాయి. ఎనీమియా నివారించడం వల్ల మాతృ మరణాలను గణనీయంగా తగ్గించవచ్చని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. మాతా శిశు సంరక్షణ కోసం ఇప్పటికే అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం మాతృ మరణాలు తగ్గించడంలో గొప్ప వృద్ధిని నమోదు చేసింది.

బిడ్డ కోసం కేసీఆర్ కిట్, తల్లి కోసం న్యూట్రిషన్ కిట్
మాతా శిశు సంరక్షణకు పెద్ద పీట వేస్తూ.. సీఎం కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా మరో విప్లవాత్మకమైన పథకానికి శ్రీకారం చుట్టారు. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్ ఇప్పటికే 9 జిల్లాల్లో అమలు అవుతుండగా, అన్ని జిల్లాల్లో పంపిణీ చేయనున్నాం. గర్బిణిగా ఉన్నపుడు న్యూట్రీషన్‌ కిట్, బాలింతగా ఉన్నపుడు కేసీఆర్‌ కిట్‌. న్యూట్రిషన్ కిట్స్ గర్భిణులకు వరంగా మారనున్నాయి. కేంద్ర ప్రభుత్వ శాంపిల్‌ రిజిస్ట్రేషన్‌ సర్వే ప్రకారం, రాష్ట్రంలో మాతృ మరణాల రేటు 2014లో 92 ఉండగా, ప్రస్తుతానికి 43కు తగ్గింది. మాతృమరణాలు తగ్గించడంలో దేశంలోనే మనం మూడో స్థానంలో నిలిచాం.

ఈ సంఖ్యను మరింత తగ్గించేందుకు గాను ముఖ్యమంత్రి కేసీఆర్‌ న్యూట్రీషన్‌ కిట్స్‌ పథకానికి రూపకల్పన చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే ప్రారంభించిన కేసీఆర్‌ కిట్‌ సూపర్‌ హిట్‌ కాగా, ఇదే స్ఫూర్తితో కేసీఆర్‌ న్యూట్రీషన్‌ కిట్లకు రూపకల్పన చేసింది. నాలుగు ఏఎన్‌సీ చెకప్స్‌, కేసీఆర్‌ కిట్లు, అమ్మ ఒడి వాహనాలు, మాతా శిశు సంరక్షణ కేంద్రాల ఏర్పాటు వంటివి రాష్ట్రంలో మాతా సిస్టం రక్షణకు దోదం చేస్తున్నాయి.
నూతన సచివాలయం ప్రారంభం రోజు ముఖ్యమంత్రి గొప్ప పథకం రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు సంబంధించిన ఫైల్ పై సంతకం చేయడం సంతోషకరం. ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు త్వరలో ఈ కార్యక్రమం మిగతా 24 జిల్లాల్లోనూ ప్రారంభించుతాం.

LEAVE A RESPONSE