-
టీటీడీకి తీర్మానం చేసే అధికారాలు లేవా?
-
ఉన్న అధికారాలు వాడుకోవడం కూడా చేతకాదా?
-
గతంలో డాలర్ల కుంభకోణం, పింక్డైమండ్ ఆరోపణలపై బోర్డు తీర్మానం
-
అన్నీ సీఎం చెబితే ఇక టీటీడీ బోర్డు ఉన్నది ఎందుకు?
-
దర్శనం టికెట్ల కోటా కోసమేనా?
-
ప్రతిదీ సీఎంకు చెప్పాల్సిన అవసరం లేదు కదా?
-
టీటీడీలో ఉన్న ప్రభుత్వ ప్రతినిధులు ఏం చేస్తున్నట్లు?
-
టీటీడీ అటామనస్ బోర్టు అని మర్చిపోయారా?
-
స్వతంత్రంగానే పనిచేసిన భూమన, సుబ్బారెడ్డి
-
గతంలో సొంత మెదడుతోనే పనిచేసిన బోర్డు
-
బోర్డును బలహీనం పాలకవర్గమే చేసుకుంటోందా?
-
చైర్మన్- అధికారుల మధ్య సమన్వయమేదీ?
-
చైర్మన్ బీఆర్ నాయుడు ప్రకటనలపై విస్మయం
( మార్తి సుబ్రహ్మణ్యం)
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చాలా పవర్ఫుల్. రాష్ట్ర బడ్జెట్ తర్వాత స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న సంస్థల వార్షిక బడ్జెట్లో టీటీడీది రెండోస్థానం. మిగిలిన అన్ని ప్రభుత్వ శాఖలకు ప్రభుత్వమే ప్రతి ఏటా బడ్జెట్ కేటాయించాలి. కానీ టీటీడీకి సర్కారు నయాపైసా నిధులు ఇవ్వాల్సిన పనిలేదు. ఇంకా టీటీడీనే కామన్గుడ్ఫండ్ కింద, కోట్లాదిరూపాయలు ప్రభుత్వానికి అందిస్తుంటుంది. అంత పవర్ఫుల్ బోర్డు అధికారికంగా ఎవరికీ జవాబుదారీ కాదు. కానీ ఇప్పుడది పరాథీనమయిపోతోంది. ప్రతిదీ సీఎం ఆదేశాల కోసం అమరావతి వైపు చూస్తోంది.
బోర్డులో ప్రభుత్వం తరఫున రెవిన్యూ, దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి, కమిషనర్లు సభ్యులుగా ఉంటారు. అంటే వారిద్దరూ ప్రభుత్వ ప్రతినిధులన్నమాట. బోర్డు చేసే తీర్మానం, దేవదాయశాఖ ద్వారా ప్రభుత్వానికి చేరుతుంటుంది. అంతేగానీ నేరుగా టీటీడీ వ్యవహారాల్లో సీఎంల జోక్యం ఉండదు. సీఎంలకు ప్రతిదీ చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు. బోర్డులో ఉన్న ప్రభుత్వ ప్రతినిధులే ఆ పనిచేస్తుంటారు. ఇది టీటీడీ పాలనావ్యవస్థ గురించి తెలిసిన వారికి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు.
కానీ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కొత్తగా ప్రస్తావించిన ఏసీబీ కేసు వ్యవహారం పరిశీలిస్తే, బోర్డు స్వతంత్రంగా పనిచేసేందుకు సిద్ధంగా లేదా? లేక రిస్కు తీసుకోవడం ఎందుకన్న ముందుచూపుతో, ముఖ్యమంత్రి మీద భారం పెడుతున్నారా? అన్న సందేహాలు మెడపై తల ఉన్న ఎవరికైనా రాక తప్పదు. తిరుపతిలోని టీటీడీ గోశాలలో రికార్డులు మాయం కావడం, ఆవుల మృతి అంశాలపై చైర్మన్ నాయుడు మీడియాతో మాట్లాడారు. ఆ సందర్భంలో ఈ అంశంపై సీఎం చంద్రబాబును కలసి ఏసీబీ విచారణ కోరతానని వెల్లడించడం ఆశ్చర్యపరిచింది.
నిజానికి బోర్డు చైర్మన్గా నాయుడు.. టీటీడీ పరిథిలోని ఆ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లాల్సిన పనిలేదు. నిజంగా ఆ అంశంపై ఏసీబీతో విచారణ జరిపించాలనుకుంటే, ముందుగా బోర్డు సమావేశం ఏర్పాటుచేసి ఆ మేరకు తీర్మానం చేయాలి. తర్వాత దానిని బోర్డులో ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ ప్రభుత్వానికి ఆ తీర్మానం పంపిస్తారు. ప్రభుత్వం దానిని పరిశీలించి ఏసీబీ విచారణకు ఆదేశిస్తుంది. ఇదీ పాలనాపరమైన ప్రక్రియ. అలాచేస్తేనే టీటీడీ బోర్డు, తనకున్న అధికారాలు వినియోగించుకున్నట్లు లెక్క.
అసలు టీటీడీ తీర్మానాలు, దానికి ముందు రూపొందించే అజెండాకు కూడా ప్రభుత్వ అనుమతి అవసరం లేదు. భక్తుల అవసరాలు, డిమాండ్, రద్దీని బట్టి నిర్ణయాలు తీసుకుంటుంది. చివరకు కీలక నిర్ణయాలు కూడా ప్రభుత్వ అనుమతి లేకుండానే తీసుకోవచ్చు. అధికారికంగా చెప్పాలంటే.. పాలకమండలి, ఈఓ-ఏఈఓల నియామకాలలో తప్ప, టీటీడీపై ప్రభుత్వానికి ఎలాంటి పెత్తనం ఉండదు. ఉండకూడదు.
కాంగ్రెస్, వైసీపీ ప్రభుత్వ హయాములో ఇదే జరిగింది. వారి హయాంలో పాలకమండలి పూర్తి స్వేచ్ఛ అనుభవించింది. చైర్మన్లుగా పనిచేసిన భూమన కరుణాకర్రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, అంతకుముందు చైర్మన్లుగా పనిచేసిన బాపిరాజు, సుబ్బరామిరెడ్డి తమ ముద్ర వేసుకున్నారు. వారి పనిలో ఆయా ముఖ్యమంత్రులు గానీ, సీఎంఓ గానీ జోక్యం చేసుకున్న దాఖలాలు బహు తక్కువ. ఎన్టీఆర్ హయాంలో పనిచేసిన చైర్మన్లు కూడా స్వతంత్రంగానే వ్యవహరించారు.
నిజానికి టీటీడీకి సంబంధించిన వ్యవహారాలపై విచారణ చేయమని నేరుగా సీఎంను గానీ, ప్రభుత్వాన్ని గానీ కోరాల్సిన పనిలేదు. టీటీడీనే పాలకమండలి సమావేశం పెట్టి తీర్మానం చేసి, ప్రభుత్వానికి పంపిస్తే ప్రభుత్వమే దానిపై విచారణకు ఆదేశిస్తుంది. కరుణాకర్రెడ్డి చైర్మన్గా ఉన్న సమయంలో డాలర్ల కుంభకోణం వెలుగుచూసింది. దానిపై న్యాయవిచారణ జరిపించాలని కోరుతూ బోర్డు తీర్మానం చేస్తే, ప్రభుత్వం జడ్జితో న్యాయవిచారణ జరిపించింది.
టీడీపీ హయాంలో సుధాకర్యాదవ్ చైర్మన్గా ఉన్నప్పుడు పింక్ డైమండ్ పోయిందని, అది చంద్రబాబు ఇంట్లో ఉందంటూ నాటి ఎంపి విజయసాయిరెడ్డి, రమణదీక్షితులు నానా యాగీ చేశారు. దానిపై నాటి బోర్డు తీర్మానం చేసి, విజయసాయిరెడ్డిపై పరువునష్టం దావా వేయాలని నిర్ణయించింది. తర్వాత కోర్టును ఆశ్రయించింది. ఆ మేరకు కోర్టు ఫీజుల కింద 2 కోట్లు చెల్లించింది.
తర్వాత వైసీపీ అధికారంలోకి రావడంతో, చైర్మన్గా నియమితులైన వైవి సుబ్బారెడ్డి నేతృత్వంలోని బోర్డు.. పాత బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేసి, కోర్టులో కేసు ఉపసంహరించుకోవాలని తీర్మానించింది. కానీ దానిని కోర్టు ఆమోదించలేదు. అది వేరే విషయం. అంటే దీన్నిబట్టి గత చైర్మన్లు, ప్రతిదానికీ ప్రభుత్వంపై ఆధారపడకుండా-ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురుచూడకుండా, తమకు ఉన్న అధికారాలను వినియోగించుకున్నారని స్పష్టమవుతోంది.
కానీ ప్రస్తుత చైర్మన్ బీఆర్ నాయుడు వ్యవహారశైలి మాత్రం, అందుకు భిన్నంగా కనిపిస్తోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆయన ప్రతి మీడియా సమావేశంలో ఫలానా అంశాన్ని సీఎం దృష్టికి తీసుకువెళతాం. ఫలానా అంశంపై సీఎంతో చర్చిస్తాం. ఫలానా వ్యవహారంపై సీఎంని అడిగి నిర్ణయం తీసుకుంటామని చెప్పడం బట్టి.. టీటీడీ బోర్డు సర్వ స్వతంత్రంగా పనిచేయడం లేదని, అన్నీ సీఎం నిర్ణయాల ప్రకారమే జరుగుతున్నాయన్న భావన భక్తులు, జనంలో కలిగించేందుకు కారణమవుతున్నాయి. ఫలితంగా అది ‘బలహీనమైన బోర్డు’ అన్న చులకన భావన సహజంగానే ఏర్పడుతుంది.
బోర్డు అధికారాలేమిటో చైర్మన్కు తెలియవా?
బోర్డు అధికారాలను వినియోగించుకోక పోవడం వల్ల, ‘బలహీనమైన బోర్డు’ అన్న నిందలు ఎదుర్కోవలసి వస్తుందంటున్నారు. ఇప్పటికే బోర్డు సభ్యులు దర్శనం టికెట్ల కోసం తప్ప ఏమీ మాట్లాడరు, భక్తుల సమస్యలు పట్టించుకోరన్న విమర్శలు లేకపోలేదు. అసలు చాలామంది సభ్యులు ఫోన్లు కూడా తీయరన్న ఆరోపణలున్నాయి.
ఈ క్రమంలో బోర్డు ప్రతిదానికీ ప్రభుత్వం వైపు చూడటం వల్ల ‘‘అన్నీ సీఎం చంద్రబాబు పరిశీలించి నిర్ణయం తీసుకోవాలనుకుంటే ఇక బోర్డు ఉంది ఎందుకు? కోటా దర్శనం టికెట్ల కోసమా? అసలు చైర్మన్ ఇవన్నీ తెలిసి మాట్లాడుతున్నారా? తెలియకుండా మాట్లాడుతున్నారా? లేకపోతే బోర్డుకు ఉన్న అధికారాలు-బాధ్యతలు ఏమిటన్నది ఈఓ, ఏఈఓ చైర్మన్కు వివరించలేదా? సహజంగా టీటీడీ సభ్యుల ప్రమాణ స్వీకారం తర్వాత టీటీడీ యాక్ట్ బుక్ ఇస్తారు. అందులో బోర్డు అధికారాలు-బాధ్యతలకు సంబంధించిన వివరాలు స్పష్టంగా ఉంటాయి. అంటే దీన్నిబట్టి చైర్మన్కు అధికారులు, ఆ బుక్ ఇప్పటిదాకా ఇవ్వలేదని అర్ధం చేసుకోవాలి. అదీకాకపోతే ఆయనను ఈఓ, ఏఈఓ లెక్కచేయకపోయినా అయి ఉండాలి. లేకపోతే అధికారులు యాక్టు బుక్కు ఇచ్చినా, ఎందుకొచ్చిన రిస్కు అని చైర్మన్గారే అన్నీ సీఎం నిర్ణయానికే వదిలేస్తున్నారా అర్ధం కావడం లేదు. మొత్తంగా టీటీడీ బోర్డుకు ఉన్న అధికారాలను వినియోగించుకునేందుకు, ఈ చైర్మన్ సాహసించడం లేదని అర్ధమవుతోంద’ని ఓ మాజీ సభ్యుడు విశ్లేషించారు.
చైర్మన్ బీఆర్ నాయుడు తాజాగా మీడియాతో.. నాటి గోశాల డైరక్టర్ హరినాధ్రెడ్డి ఆక్రమాల గురించి ప్రస్తావించారు. ఆవులకు సంబంధించిన వివరాల రికార్డులు మాయం చేశారని ఆయనతోపాటు, ఈఓ కూడా గతంలో మీడియాకు వెల్లడించారు. అయితే చైర్మన్ నాయుడు దీనికి సంబంధించి.. టీటీడీ గోశాలలో పనిచేసే ఉద్యోగులను గానీ, అడ్మినిస్ట్రేటివ్ అధికారులను గానీ విచారించకపోవడమే ఆశ్చర్యం. పక్కన ఉన్న ఒక్కరి పేరునే ప్రస్తావించారు.
నిజానికి గోవుల లె క్కలకు సంబంధించిన రికార్డులు ఎక్కడికీ వెళ్లవు. మొత్తం మూడు విభాగాల్లో ఆ వివరాలు నమోదయి ఉంటాయి. పైగా అన్నీ కంప్యూటరైజ్డ్ కాబట్టి, అవి దొరకటం పెద్ద కష్టం కాదు. ఇక చైర్మన్ ఆరోపించినట్లు, గడ్డి లెక్కలు కూడా రికార్డయి ఉంటాయి. దానిపై బోర్డు అంతర్గతంగా ఒక విచారణ కమిటీ వేసి, అక్రమాలు తేల్చవచ్చు. అందుకు సొంతగా ఉన్న విజిలెన్స్ను కూడా వినియోగించుకోవచ్చు.కానీ ఈ మర్గాలపై చర్చించకుండా, ఏకంగా ఏసీబీ విచారణ గురించి ప్రస్తావించడమే ఆశ్చర్యం.
చైర్మన్-ఈఓ ప్రకటనలతో టీటీడీకి లాభమా? నష్టమా?
నిజానికి ఈ వ్యవహాలన్నీ అధికారులతో కలసి అంతర్గతంగా చర్చించుకుని, తేల్చాల్సినవి. కానీ అందుకు భిన్నంగా మీడియా సమక్షంలో ‘‘ఆవుల వివరాలు లేవు.రికార్డులు మాయం చేశారని’’ స్వయంగా చైర్మన్-ఈఓ చెప్పడం వల్ల, భవిష్యత్తులో భక్తులు ఇక గోవులు ఇచ్చేందుకు ముందుకు వచ్చే అవకాశం ఉండదు. అంటే చైర్మన్-ఈఓ ప్రకటనలు టీటీడీకి లాభం చేస్తున్నాయా? నష్టం చేస్తున్నాయా? అన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.
ఒక ఆవు గోశాలలో అడుగుపెట్టినప్పటి నుంచి అది చనిపోయేవరకూ, దాని రంగులు, బ్రీడు, పాల ఉత్పత్తి వంటి అంశాలన్నీ రికార్డు నిర్వహిస్తుంటారు. అది గోశాల, మార్కెటింగ్, అడ్మినిస్ట్రేషన్ విభాగాల్లో కూడా రికార్డు చేస్తారు. అంతిమంగా అది ఈఓ ఆఫీసులో నమోదవుతుంది. అంటే దీనిని బట్టి చైర్మన్ ఈ అంశానికి సంబంధించి అధికారులతోగానీ, ఈఓతో గానీ చర్చించకుండా, ప్రకటన ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. నిజానికి చైర్మన్ వారితో చర్చించి ఉంటే ఆవిధంగా ప్రకటించేవారు కాదేమో!
ఆవునెయ్యిలో పందికొవ్వు కలిసిందన్న ఈఓ వ్యాఖ్యలతో టీటీడీకి జరిగిన నష్టం అంతా ఇంతా కాదు. ఆ అప్రతిష్ఠ నుంచి బయటపడేందుకు మరిన్ని కొత్త అంశాలను తెరపైకి తెచ్చి, కల్తీ నెయ్యి వ్యవహారం నుంచి బయటపడాల్సి వచ్చింది. అలాంటి చేదు అనుభవాలను పరిగణనలోకి తీసుకోకుండా, గోశాల-టీటీడీ అక్రమాలపై ఏసీబీ విచారణ కోరతామన్న చైర్మన్ వ్యాఖ్య ఫలితంగా.. ఇక టీటీడీకి విరాళం ఇచ్చేందుకు, దాతలెవరూ ముందుకు రాకపోయే ప్రమాదం లేదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. గోశాల, టీటీడీ వ్యవహారాలపై సీఎంను కలసి ఏసీబీ విచారణ కోరతానన్న చైర్మన్ ప్రకటన.. టీటీడీకి దాతలు ఇచ్చే విరాళాలు సక్రమంగా వినియోగం కావడం లేదన్న సంకేతాలకు కారణమయి, దాతలు అనుమానంతో వెనక్కి వెళ్లేందుకు కారణమవుతోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
‘‘ ఒక సంస్థలో అవినీతి జరుగుతుందని అందులో పనిచేసేవారే మీడియాకు చెబితే ఇక దానికి డబ్బులిచ్చేందుకు దాతలు ముందుకు ఎలా వస్తారు? ఏ దాత అయినా తమ విరాళం భక్తులకు ఉపయోగపడాలన్న సదాశయంతోనే కదా ఇచ్చేది? అలాంటిది టీటీడీలో జరిగే అక్రమాలపై ఏసీబీ విచారణ జరిపిస్తామని స్వయంగా చైర్మనే చెప్పారంటే.. గతంలో అవినీతి జరిగిందనే కదా అర్ధం? అవినీతి జరిగే చోట దాతలు విరాళాలు ఎందుకు ఇస్తారు? బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వారు ఆచితూచి మాట్లాడకపోతే అది బూమెరాంగవుతుంది. కల్తీ లడ్డు, పందికొవ్వుపై ఈఓ వ్యాఖ్యల తర్వాత జరిగిన నష్టాన్ని చైర్మన్ పరిగణనలోకి తీసుకోకపోతే ఎలా’’ అని బోర్డు మాజీ సభ్యుడొకరు వ్యాఖ్యానించారు. చైర్మన్ సదుద్దేశంతోనే చెప్పినప్పటికీ.. అది వేరే సంకేతాలకు దారి తీసి, దానిని రాజకీయ ప్రత్యర్ధులు మరోలా వాడుకునే అవకాశం ఉందని విశ్లేషించారు.
ఇదిలాఉండగా, కొండపై కొలువు తీరిన చైర్మన్, ఈఓ, ఏఈఓ మధ్య సమన్వయం లేదన్న విషయం అనేక ఘటనల్లో స్పష్టయింది. తాజా గోవుల మరణాల సంఖ్యలోనూ అది వె ల్లడయింది. ఇక చైర్మన్ బీఆర్ నాయుడు తరచూ కొండపై నిర్వహించే ఆకస్మిక తనిఖీలలో ఏఈఓ, జేఈఓలు కనిపించడం లేదు. ఆయన ఒంటరిగానే తనిఖీలకు వెళుతున్నారు. దీనివల్ల మీడియాలో ప్రచారం రావడం తప్ప, ఫలితం కనిపించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయన వెంట ఏఈఓ ఉంటేనే తనిఖీలకు ఫలితం ఉంటుందని, ఎందుకంటే వ్యాపారులు అధికారుల మాట వింటారు తప్ప, చైర్మన్లకు భయపడరని చెబుతున్నారు.
ఇక ఈఓలు ఎప్పుడూ ఒక్కరే మీడియా ముందుకు వచ్చిన సందర్భాలు కూడా లేవంటున్నారు. బ్రహ్మోత్సవాలు, ఏదైనా ప్రత్యేక అంశంపై విమర్శలు-ఆరోపణలు వచ్చిన సందర్భంలోనే ఏఈఓలు మీడియా ముందుకొస్తుంటారు. అప్పుడు కూడా చైర్మన్ పక్కనే కనిపిస్తుంటారు. కానీ ఈఓ శ్యామలరావు మాత్రం తరచూ ఒక్కరే ప్రెస్మీట్లు నిర్వహిస్తుండటం వివాదాస్పదమవుతోంది. పైగా ఆయన తరచూ తన వ్యాఖ్యల్లో ‘గత పాలకులు’ అంటూ నొక్కివక్కాణించడంపై అభ్యంతరం వ్యక్తమవుతోంది. ఈఓ ప్రభుత్వ ప్రతినిధి. ఆయనకు రాజకీయాలతో సంబంధం ఉండదు. ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వ విధానాలు అమలుచేయడమే ఆయన విధి.
అదే చైర్మన్ అయితే ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలయినా చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న పార్టీ ఆయనను నియమించింది కాబట్టి, ఆయనకు ఆ వెసులుబాటు ఉంటుంది. కానీ ఈఓ శ్యామలరావు మాత్రం అందుకు భిన్నంగా.. గత పాలకులంటూ వ్యాఖ్యానించడంపై, అధికార వర్గాల్లోనే ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. గత పాలకులంటూ మాట్లాడుతున్న ఇదే శ్యామలరావు, గత వైసీపీ ప్రభుత్వంలో కీలక బాధ్యతల్లో పనిచేశారు.
భూమన జమానాలో బోర్డు సొంత నిర్ణయాలు
కాగా భూమన కరుణాకర్రెడ్డి చైర్మన్గా ఉన్న టీటీడీ బోర్డు.. ప్రభుత్వ అనుమతితో సంబంధం లేకుండానే, గతంలో దళిత గోవిందం, బెస్త గోవిందం, కల్యాణమస్తు వంటి పెద్ద పథకాలు అమలుచేసింది. ఇటీవల అన్నదానంలో వడ పెట్టేందుకు సీఎం అనుమతి తీసుకుంటామని చైర్మన్ బీఆర్ నాయుడు చెప్పారు. కానీ భూమన చైర్మన్గా ఉన్న సమయంలో అన్నదానంలో ముద్దపప్పు, నెయ్యిని ప్రభుత్వ అనుమతి తీసుకోకుండానే, బోర్డులో తీర్మానం ఆమోదించి, అమలుచేశారు. దానిని అప్పట్లో తిరుమలకు వచ్చి అన్నదాన సత్రంలో భోజనం చేసిన ప్రణబ్ అన్నదానం అద్భుతమంటూ బుక్లో ప్రశంసలు కురిపించారు. అదే సమయంలో అప్పటివరకూ విస్తరాకుల్లో భోజనం పెట్టే విధానం తొలగించి, అరిటాకుల్లో భోజనం పెట్టారు. అప్పట్లో రెండు విస్తరాకులు వేసినందుకు కాంట్రాక్టర్కు 80 పైసలు ఇవ్వగా, కేవలం 40 పైసలకే అరిటాకు కొనుగోలు చేయడం విశేషం. అప్పట్లో అది అసెంబ్లీలో చర్చనీయాంశంగా మారింది.
అదేవిధంగా ప్రభుత్వ అనుమతితో సంబంధం లేకుండానే.. ఎమ్మెల్యేలు కోరిన ప్రాంతాల్లో, వెంకటేశ్వర స్వామి మండపాలు నిర్మించారు. ఇవన్నీ రమణాచారి ఈఓ, భూమన కరుణాకర్రెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు.. ప్రభుత్వ అనుమతితో సంబంధం లేకుండా తీసుకున్న నిర్ణయాలు కావడమే విశేషం.