– దేశంలోని పోలీస్ వ్యవస్థ కు తెలంగాణ పోలీస్ ఆదర్శం
– జీతం కోసమే పోలీసులు ఉద్యోగాలు చేయడం లేదు
– ఛీత్కరించుకునేలా మన పనులు ఉండొద్దు
– పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం లో సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్: విధి నిర్వహణలో అమరులైన పోలీసులందరికి తెలంగాణ తరపున నివాళి అర్పిస్తున్నా. దేశంలోని 140 కోట్ల ప్రజలు గుండెలపై చేయి వేసుకొని నిద్ర పోతున్నారంటే దానికి కారణం పోలీసులు.ఏ రాష్ట్రమైనా అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లాలంటే శాంతి భద్రతలు అత్యంత కీలకం. శాంతిభద్రతలు లేని ప్రాంతంలో పెట్టుబడులు రావు.
తెలంగాణలో పోలీసులు అవసరమైతే తమ ప్రాణాలైనా వదులుతున్నారు. కానీ శాంతి భద్రతల్లో మాత్రం వైఫల్యం చెందకుండా కాపాడుతున్నారు.వారికి అభినందనలు. అమరులైన పోలీసుల కుటుంబాలను ప్రభుత్వాలు ఆదుకుంటాయనే విశ్వాసాన్ని ఈ కార్యక్రమం ద్వారా కల్గిస్తున్నాం. అమరులైన పోలీసుల కు నివాళులర్పించడం ద్వారా స్పూర్తిని నింపుతున్నాం.
కె ఎస్ వ్యాస్, పరదేశి నాయుడు, ఉమేష్ చంద్ర , కృష్ణ ప్రసాద్ లాంటి వందలాది మంది పోలీసు అధికారులు అమరులై శాంతి భద్రతలను కాపాడటంలో స్ఫూర్తిగా నిలిచారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడటంలో అమరులైన పోలీసులకు రాష్ట్రం ఘనమైన నివాళులు అర్పిస్తోంది.
నేరగాళ్లు ఇప్పుడు సరికొత్త పద్దతుల్లో వస్తున్నారు. ఎస్ఐబీ, గ్రేహౌండ్స్ లాంటి సంస్థలను ఏర్పాటు చేసి మన రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలబడింది. దేశంలోని పోలీస్ వ్యవస్థ కు తెలంగాణ పోలీస్ ఆదర్శంగా నిలబడింది..
సమాజంలో వచ్చే మార్పులను పోలీసులు నిశితంగా గమనించాలి. సైబర్ క్రైమ్స్ లో చదువుకున్న వారే ఎక్కువగా మోసం చేస్తున్నారు.. క్షణికమైన వాటి కోసం సైబర్ క్రైమ్స్ వలలో పడుతున్నారు. సైబర్ క్రైమ్స్ కట్టడిలో తెలంగాణ పోలీసుల కృషి ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అభినందించారు.
పంజాబ్ లో యువత డ్రగ్స్ కు బానిస అయ్యారు.. ఆ రాష్ట్రం విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటోంది. తెలంగాణలో గత పదేళ్లలో గంజాయి, హెరాయిన్ , కొకైన్ లాంటి డ్రగ్స్ వినియోగం బాగా పెరిగింది. పక్క రాష్ట్రాల నుంచి గంజాయి ని రాష్ట్రంలోకి తీసుకువస్తున్నారు. తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో ను ఏర్పాటు చేసి డ్రగ్స్ ను నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నాం.
నార్కోటిక్ బ్యూరో కు కావాల్సిన అన్ని సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తుంది. డ్రగ్స్ నియంత్రణకు పోలీసు శాఖ తీవ్ర కృషి చేస్తోంది. హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది. ట్రాఫిక్ నియంత్రణ లో ఆర్టీఫిషియల్ ఇంటలిజెన్స్ ను ఉపయోగించాలి. భావోద్వేగం, ఉన్మాదంతో కొందరు మందిరంపై దాడి చేయడం ద్వారా అలజడులు సృష్టిస్తున్నారు.
తెలంగాణ ప్రజలు తెలివైన వారు..ఇలాంటి వాటి పైన అప్రమత్తంగా ఉండాలి. ముత్యాలమ్మ గుడి లో సంఘటన ఆందోళనకరం. వెంటనే నేరానికి పాల్పడిన వారిని అరెస్ట్ చేయడం ద్వారా ఎవరినీ ఉపేక్షించమనే సంకేతాలను పోలీసులు ఇచ్చారు. నేరాలకు పాల్పడే వారిని తామే శిక్షించాలని కొందరు ప్రయత్నిస్తున్నారు. నేరాలకు పాల్పడే వారిని శిక్షించడానికి పోలీసులు సిద్ధంగా ఉన్నారు.
మొహర్రం, బక్రీద్, క్రిస్మస్, వినాయకచవితి, హనుమాన్ జయంతి వంటి ఉత్సవాల సమయంలో మౌలిక సదుపాయాలు లేకపోయినా పోలీసులు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
జీతం కోసమే పోలీసులు ఉద్యోగాలు చేయడం లేదు.. శాంతిభద్రతలు తమ బాధ్యతగా భావించి పని చేస్తున్నారు. ఇటీవల జరిగిన పోలీస్ నియామకంలో ఉన్నత విద్య అభ్యసించిన వారు కానిస్టేబుల్, ఎస్.ఐ లుగా చేరారు.గొప్ప లక్ష్యం కోసం యువత పోలీస్ జాబ్స్ లో చేరుతున్నారు.
శాంతిభద్రతలు కాపాడటంలో పోలీసుల కృషిని ప్రజలు గుర్తించాలి. క్రిమినల్స్ తో ఫ్రెండ్లీ పోలీస్ ఉండొద్దు.. కఠినంగా ఉండాలి.. బాదితులతో ఫ్రెండ్లీ గా ఉండాలి.పోలీసులు ఆత్మగౌరవంతో తలెత్తుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ని 50 ఎకరాల్లో ప్రారంభించబోతున్నాం.
విద్యతో పాటు స్సోర్ట్స్, గేమ్స్ ను ఇందులో ప్రవేశపెడతాం. పోలీసు పిల్లల భవిష్యత్తు కు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది. ఒక్క శాతం కూడా తప్పు జరగకుండా పోలీసులు సమన్వయంతో వ్యవహారించాలి. పోలీసులు సహనం కోల్పోకుండా ఓపికతో పనిచేయాలి. విధి నిర్వాహణ లో అమరులైన వారి కుటుంబాలకు పరిహారాన్ని పెంచుతున్నాం.
సీనియర్ ఐపిఎస్ అధికారి రాజీవ్ రతన్ చనిపోతే ఆయన కుమారుడికి నిబంధనలు సడలించి గ్రేడ్ టు మున్సిపల్ కమిషనర్ గా అవకాశం ఇచ్చాం. పోలీసులపై నాకు ప్రత్యేక అభిమానం ఉంది. ఆత్మగౌరవంతో బతుకుదాం. పోలీసులు గొప్పగా మాట్లాడుకునేలా పనిచేయాలి.. ఛీత్కరించుకునేలా మన పనులు ఉండొద్దు.
ఉన్నతాధికారులు పోలీస్ సిబ్బందికి మౌలిక సదుపాయాలు కల్పించాలి. పోలీసుల గౌరవాన్ని పెంచేలా చర్యలు ఉండాలి.. ఇతరులకు ఖాకీలు ఆదర్శంగా ఉండాలి.