Suryaa.co.in

Andhra Pradesh

పర్యావరణ హితం అనేది పరిశ్రమల బాధ్యత

• పర్యావరణాన్ని రక్షించుకోవడానికి సమష్టిగా ముందుకు కదలాలి
• ఎన్జీవోలు, నిపుణుల సూచనలు తీసుకుంటాం
• కాలుష్యరహిత పరిశ్రమలకు ప్రోత్సాహం
• విజయవాడలో కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో వర్క్ షాపు ప్రారంభించి, ప్రసంగించిన ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ 

‘పర్యావరణ హితం అనేది పరిశ్రమల బాధ్యత కావాలి. అభివృద్ధిలో భాగమయ్యే పరిశ్రమలు భావి తరాలకు చక్కటి పర్యావరణం అందించడం కూడా తమ బాధ్యతగా గుర్తించాల’ని ఉప ముఖ్యమంత్రివర్యులు, అటవీ పర్యావరణ శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రి  పవన్ కళ్యాణ్ తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు కావాలి.. అభివృద్ధి అవసరం అయిన నేటి తరుణంలో పరిశ్రమలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

అదే సమయంలో సాధ్యమైనంతగా కాలుష్య రహిత పరిశ్రమలను ప్రోత్సహించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని చెప్పారు. విజయవాడలోని ఓ హోటల్ లో బుధవారం కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఎన్జీవోలు, నిపుణులు, ఇతర శాఖల అధికారులతో నిర్వహించిన వర్క్ షాపును పవన్ కళ్యాణ్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్  మాట్లాడుతూ ‘‘భావి తరాలకు భవిష్యత్తు లేకుండా చేసే అభివృద్ధి సరికాదు. కాలుష్య నియంత్రణ మండలి అనగానే పరిశ్రమలకు వ్యతిరేకం అనే భావన సరికాదు. ప్రస్తుత పరిస్థితుల్లో పర్యావరణాన్ని కాపాడుకోవడం, అభివృద్దిపథంలో ముందుకు సాగడం అనేవి రెండూ కీలకమైనవే. దీనికి తగిన మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఉంది. నిపుణులు దీనిపై దృష్టి పెట్టాలి. విశాఖపట్నంలో కాలుష్యం విషయంలో కాని, ఇతర ప్రాంతాల్లో తీవ్రమవుతున్న కాలుష్యం విషయంలో శాశ్వతమైన పరిష్కారం, అందరూ ఆమోదించేలా విధానం తీసుకురావల్సిన అవసరం ఉంది. పరిశ్రమల్లో కాలుష్యంతోపాటు ప్రమాదాలు ఈ మధ్య కాలంలో ఎక్కువవుతున్నాయి. వీటి నివారణకు ఓ మార్గం చూపాలి.

974 కిలోమీటర్ల కోస్టల్ కారిడార్ ఉంది. దానిని అభివృద్ది చేయాలి. పర్యావరణ సమతౌల్యం దెబ్బ తినకుండా పరిశ్రమల ఏర్పాటు కావాలి. భవిష్యత్ తరాల కోసం.. మనమంతా ఇప్పటి నుంచే ఆలోచన చేయాలి. జల, వాయు కాలుష్యాలను నియంత్రించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. వేగవంతమైన అభివృద్ధి కోసం ప్రభుత్వం తపిస్తున్న సమయంలో కాలుష్య రహిత పరిశ్రమలు, వాటి విధివిధానాల రూపకల్పనకు నిపుణులు, మేధావులు విలువైన సూచనలు అందించాలి. వారి సూచనలు సమాజానికి ఎంతో ప్రయోజనం చేకూరుస్తాయి.

పర్యావరణం మేలు గురించి ఎన్జీవోలు చేస్తున్న కృషి అభినందనీయం. వారి సేవలను కాలుష్య నియంత్రణ మండలి ఉపయోగించుకుంటుంది. ఈ వర్కుషాపు ద్వారా పరిశ్రమల ఏర్పాటు, పర్యావరణ పరిరక్షణ రెండు అంశాలపై వేసే అడుగులపై అందరికీ స్పష్టత వస్తుంది. ఈ ఐదేళ్ల కాలంలో ఎంతవరకు కాలుష్యాన్ని నియంత్రించాలనే అంశంపై ఆలోచన చేస్తున్నాం. పర్యావరణ పరిరక్షణకు అందరూ సమష్టిగా పని చేయాలి’’ అన్నారు. ఈ కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్ పి.కృష్ణయ్య, ఏపీఐఐసీ డైరెక్టర్ చెరుకూరి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE