బాబుకు తప్ప రాష్ట్ర ఆర్ధిక వ్యవస్ధకు ఢోకా లేదు

– దేశ జీడీపీలో మన వాటా పెరిగింది
– కేంద్రం చేసిన అప్పులు పతాకస్థాయికి చేరుకున్నాయి
– దేశంలో అనేక రాష్ట్రాలకన్నా మెరుగ్గా రాష్ట్ర ఆర్ధిక వ్యవస్ధను నిర్వహిస్తున్నాం
– చంద్రబాబునాయుడు కన్నా మనం తక్కువ అప్పులు చేశాం
– రాష్ట్ర ఆర్ధిక వ్యవస్ధపై శాసనసభలో సీఎం వైయస్‌.జగన్‌

ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే…:
బాబుకు తప్ప రాష్ట్ర ఆర్ధిక వ్యవస్ధకు ఢోకా లేదు
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు, ఆర్థిక ఆరోగ్యానికి వచ్చిన ఢోకా ఎక్కడా, ఏమీ లేదు. ఆరోగ్య పరంగా ఇబ్బందులు ఏమైనా ఉంటే, అది చంద్రబాబునాయుడు గారికి ఉండి ఉండాలి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుండకపోతే… తమకు బాగుంటుందని భావించే ఎల్లో మీడియాకు, చంద్రబాబునాయుడు గారికి మాత్రం ఇదొక చేదువార్త. ఎందుకంటే రాష్ట్రం బాగుంది, ఆర్ధిక పరిస్థితులు బాగున్నాయంటే వాళ్లు అస్సలు జీర్ణించుకోలేరు.

రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఎలాగోలా డబ్బు రాకుండా ఆగిపోతే, లేదా ఆపేయగలిగితే… కేంద్రప్రభుత్వానికి, రిజర్వ్‌ బ్యాంక్‌కు, దేశంలోని ఆర్థిక సంస్థలకు, బ్యాంకులకు… ఇలా అన్నింటికీ తప్పుడు ఉత్తరాలు రాసి, కోర్టుల్లో సైతం తప్పుడు కేసులు వేసి మరీ ఆపేయగలిగితే… ఇక్కడ పేదలకు మనం అమలు చేస్తున్న మంచి స్కీములన్నీ ఆగిపోతాయన్న ఒకే ఒక్క స్కీమ్‌తో రాత్రనక, పగలనక కష్టపడుతున్న శక్తులను మనం చూస్తున్నాం. మనకి కనిపిస్తున్నాయి.

రాష్ట్ర ఆర్థిక నిర్వహణ ఎంత పెద్ద సవాలు అయినా, కోవిడ్‌ లాంటి మహమ్మారి వచ్చి, రకరకాల సవాళ్లు విసిరినా కూడా.. గత ప్రభుత్వం కంటే మెరుగ్గా… దేశంలో అనేక రాష్ట్రాలకన్నా మెరుగ్గా రాష్ట్ర ఆర్ధిక వ్యవస్ధను నిర్వహిస్తున్నాం. మన 5.3 కోట్ల ప్రజల కోసం.. ఇంటింటికి సంక్షేమం, అభివృద్ధి చేస్తూ…మేనిఫెస్టోలో చెప్పిన 98.4 శాతం హామీలను అమలు చేసిన, చేస్తున్న ప్రభుత్వంగా… ఈ రాష్ట్ర శాసన సభ వేదికగా ఆర్థిక రంగానికి సంబంధించిన కొన్ని వివరాలను తెలియజేస్తున్నాను.

మొట్టమొదటిగా ఈ మధ్య కాలంలో కనిపించినట్టుగా… రాష్ట్రం అన్ని రకాలుగా బాగున్నా కూడా.. రాష్ట్రం బాగాలేదని, అన్ని రకాలుగా ఇబ్బందుల్లో పడిందని, చంద్రబాబు ఆయనతో పాటు ఉన్న ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, తోడుగా ఉన్న దత్తపుత్రుడు వీళ్లంతా ఒక బ్యాచ్‌. ఇది దోచుకో, పంచుకో, తినుకో అనే దొంగల ముఠా. వీళ్లంతా కూడా రాష్ట్రం శ్రీలంక అయిపోయిందని రకరకాల ఊహాజనిత వార్తలు ప్రజల్లో సృష్టించే కార్యక్రమం చేస్తున్నారు. వీళ్ల చేతుల్లో పేపర్లు, టీవీలు ఉన్నాయి. వీళ్లు రాయాలనుకున్నది రాస్తారు, చూపాలనుకున్నది చూపిస్తారు. ఒక అబద్దాన్ని నిజం చేయడానికి వీళ్లదగ్గరున్న పత్రికలు, టీవీల ద్వారా గోబెల్స్‌ ప్రచారం చేస్తారు. ఈ సభావేదిక ద్వారా రాష్ట్రంలో ఆర్ధిక పరిస్థితులు ఎలా ఉన్నాయో చూపిస్తాను. రాష్ట్రాన్ని దేశంతో పోల్చడంతో పాటు చంద్రబాబు నాయుడు పాలనలో ఆర్ధిక పరిస్థితులు ఎలా ఉన్నాయో చూపిస్తాను. ఎందుకు ఇవన్నీ చెప్పాల్సివస్తుందంటే.. ఒక పద్ధతి ప్రకారం సాగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడానికే. చంద్రబాబు హయాలంలో వాళ్లు చేయలేదు.. దేవుడి దయతో మన ప్రభుత్వం చేస్తున్నదాన్ని వాళ్లు జీర్ణించు కోలేకపోతున్నారు.

గతం కన్నా బాగున్న జీడీపీ….
ముందుగా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితికి ప్రధాన సూచిన అయిన జీడీపీ (గ్రాస్‌ డొమెస్టిక్‌ ప్రొడక్ట్‌) గమనిస్తే… గతంలో కంటే చాలా బాగుంది. దేవుడి దయ వల్ల, ఇంతటి కోవిడ్‌ దాడిని కూడా మనం తట్టుకుని నిలబడ్డాం. 2018–19లో అంటే చంద్రబాబు గారి హయాంలో రాష్ట్ర జీడీపీలో పెరుగుదల 5.36 శాతం కాగా… మన హయంలో దేవుడి దయతో ఇప్పుడు 2019–20లోకి వచ్చేసరికి 6.89 శాతంతో దేశంలో 6వ స్థానానికి చేరుకుంది. గత ప్రభుత్వ హయాంలో జీడీపీ పరంగా 21 స్ధానంలో ఉన్నాం. ఈ మూడు సంవత్సరాలలో మనం ఎప్పుడూ కూడా టాప్‌మూడు రాష్ట్రాలలోనే కనిపిస్తున్నాం.

కేంద్రం గణాంకాల మేరకు తొలి స్ధానంలో ఏపీ…
ఇప్పుడు అది 2021–22లో… ఇప్పటిదాకా కేంద్రం విడుదల చేసిన గణాంకాల మేరకు, అందుబాటులో ఉన్న గణాంకాల మేరకు 11.43 శాతం పెరుగుదలతో… దేశంలోనే ఇప్పటివరకు ప్రకటించిన రాష్ట్రాలలో మొదటి స్థానంలో ఉన్నాం. దేశ జీడీపీలో రాష్ట్ర జీడీపీ వాటాను పోల్చి చూస్తే… 2014–19 మధ్య… అంటే గత ప్రభుత్వ హయాంలో 4.45 శాతమే ఉంటే… ఇప్పుడు అది మన హయాంలో 2019–22 మధ్య మూడేల్లలోనే 5 శాతానికి పెరిగింది. గత ప్రభుత్వం కంటే మెరుగైన పనితీరు కనపర్చాం. అంటే దేశ జీడీపీలో మన వాటా పెరిగింది. అంటే సహజంగానే రాష్ట్ర ప్రజల తలసరి జీడీపీ కూడా పెరుగుతుంది. కోవిడ్‌ గత రెండు సంవత్సరాలుగా సృష్టించిన విలయం నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల జీడీపీ, ప్రపంచ వ్యాప్తంగా స్థూల ఉత్పత్తి తగ్గిపోవటాన్ని కూడా మనం చూస్తున్నాం.

అందుకు భిన్నంగా, దేశంలో కేవలం నాలుగు రాష్ట్రాల్లోనే జీడీపీ పడిపోకుండా పెరుగుదల నమోదు అయింది. ఆ నాలుగింటిలో ఏపీ ఒకటి. మణిపూర్, పశ్చమబెంగాల్, తమిళనాడు, ఏపీలో మాత్రమే పెరుగుల కనిపిస్తుంది. ఇందుకు ముఖ్య కారణం ఏమిటంటే, ప్రజల కొనుగోలు శక్తి పడిపోకుండా, వస్తువులకు డిమాండ్‌ పడిపోకుండా కాపాడేలా మన ప్రభుత్వం అమ్మఒడి, చేయూత ,ఆసరా, సామాజిక పెన్షన్లు వంటి ఇతర కార్యక్రమాల ద్వారా డీబీటీ ద్వారా కానివ్వండి… ఇతరత్రా కానివ్వండి తీసుకున్న చర్యల వల్ల వల్ల కానివ్వండి… సరైన సమయంలో పేద వర్గాలను ఆదుకోగలిగాం. అదే సమయంలో నాడు–నేడు వంటి కార్యక్రమాలు, జలయజ్ఞం ద్వారా పెట్టుబడి వ్యయాన్ని(క్యాపిటల్‌ ఎక్స్‌పెండిచర్‌)ను చేయగలిగాం. ఇవన్నీ కలపడం వల్ల… మిగతా ప్రపంచం అంతా నెగెటివ్‌ గ్రోత్‌ రేట్‌ నమోదు చేస్తుంటే… మనం మాత్రం పాజిటివ్‌ గ్రోత్‌ రేట్‌ నమోదు చేయగలిగాం. ప్రజల కనీస అవనసరాలకోసం చేసే ఖర్చుకు తోడుగా నిలబడగలిగాం కాబట్టే…ఈ పాజిటివ్‌ గ్రోత్‌ సాధ్యమైంది.

ఇక రాష్ట్రం అప్పులు గురించి కూడా చూస్తే…
రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా అసాధారణ స్థాయిలో అప్పులు చేస్తోందని, దాని వల్ల రాష్ట్రం పూర్తిగా అప్పుల్లో కూరుకుపోతోందని విపక్షాలు, ఎల్లో మీడియా తరుచూ విమర్శలు చేస్తున్నాయి. ఈ విషయంలో ఏది నిజమో… ఏది అబద్ధమో చూద్దాం. మొదటగా, రాష్ట్రం రుణాలు ఎవరి హయాంలో ఎలా పెరిగాయో చూద్దాం…
2014లో రాష్ట్ర విభజన నాటికి ఉన్న అప్పు రూ.1,20,556 కోట్లు అయితే… 2019 మే నెలలో గత ప్రభుత్వం దిగిపోయే నాటికి ప్రభుత్వానికి ఉన్న అప్పు రూ.2,69,462 కోట్లు. ఇవన్నీ కూడా కాగ్‌ రిపోర్ట్స్‌ ప్రకారమే. అంటే ఆ 5 ఏళ్లలో రాష్ట్ర రుణం 123.52 శాతం పెరిగింది.
అదే ‘కాంపౌండెడ్‌ యాన్యువల్‌ గ్రోత్‌ రేట్‌’ (సీఏజీఆర్‌) ప్రకారం చూస్తే ఆ అయిదేళ్లలో పెరిగిన రాష్ట్ర రుణం 17.45 శాతంగా కనిపిస్తోంది.
2019 మే నెలలో మనందరి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన నాటికి ఉన్న గత ప్రభుత్వం చేసిన అప్పులు రూ.2,69,462 కోట్లు.
ఈ మూడేళ్లలో, అంటే ఈ ఏడాది మార్చి నాటికి ఉన్న ప్రభుత్వ రుణం రూ.3,82,165 కోట్లు.
అంటే ఈ మూడేళ్లలో పెరిగిన రాష్ట్ర రుణం 41.83 శాతం. అదే సీఏజీఆర్‌ ప్రకారం చూస్తే, మూడేళ్లలో పెరిగిన రాష్ట్ర అప్పులు 12.73 శాతం మాత్రమే. మరి ఇంతగా ఆక్రందనలు చేసే ఈనాడు, టీవీ5, చంద్రబాబునాయుడు గారికి వారి హయంలో చేసిన అప్పులు, మన హయాంలో చేసిన అప్పులు గురించి ఎందుకు రాయరు అన్నది ఆలోచన చేయాలి.
అంటే గత ప్రభుత్వ హయాంలో కంటే, మా ప్రభుత్వం వచ్చాక ఈ మూడేళ్లలో పెరిగిన అప్పులు చాలా తక్కువ.
ఈ గణాంకాలు మేము చెబుతున్నవి కావు. ఈ వివరాలన్నీ కంట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) నివేదికలోనే స్పష్టంగా ఉన్నాయి.
ప్రభుత్వ గ్యారంటీలకు సంబంధించిన నిజాలను చూద్దాం.
ఇవి కూడా గత ప్రభుత్వ హయాంలోనే ఎక్కువ.
2014 నాటికి రాష్ట్ర విభజన నాటికి ప్రభుత్వ రంగ సంస్థ (పీఎస్‌యూ)లు, ప్రభుత్వ గ్యారెంటీతో చేసిన రుణాలు రూ.14,028.23 కోట్లు.
2019 మే నెలలో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి ప్రభుత్వ గ్యారెంటీతో చేసిన రుణాల ఎగపాకి మొత్తం రూ.59,257.31 కోట్లు. దీంతో గత ప్రభుత్వం దిగిపోయే నాటికి ఉన్న మొత్తం రుణాలు రూ.3,28,719 కోట్లు. అంటే ఆ 5 ఏళ్లలో పెరిగిన రుణాలు ఏకంగా 144.25 శాతం.
ఇక సీఏజీఆర్‌ పరంగా చూస్తే ఆ అయిదేళ్లలో పెరిగిన రాష్ట్ర రుణం సాలీనా 19.55 శాతం.
2019 మే నెలలో మన ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన నాటికి ప్రభుత్వ రంగ సంస్థ (పీఎస్‌యూ)లు, ప్రభుత్వ గ్యారెంటీతో చేసిన రుణాలు రూ.59,257.31 కోట్లు ఉంటే…
ఈ మూడేళ్లలో, అంటే ఈ ఏడాది మార్చి నాటికి ప్రభుత్వ గ్యారెంటీతో చేసిన రుణాల మొత్తం రూ.1,17,730.33 కోట్లు.
అంటే ఈ మూడేళ్లలో రాష్ట్ర ప్రభుత్వ మొత్తం రుణాలు రూ.4,99,895 కోట్లు. అంటే ఈ మూడేళ్లలో పెరిగిన రాష్ట్ర రుణం 52.07 శాతం.
అదే సీఏజీఆర్‌ ప్రకారం చూస్తే, మూడేళ్లలో సాలీనా పెరిగిన రాష్ట్ర అప్పు 15.46 శాతం మాత్రమే. అంటే గత ప్రభుత్వ హయాంలో 144 శాతం పెరిగితే… మన ప్రభుత్వ హయాంలో 52 శాతం పెరుగుదల . గత ప్రభుత్వం హయాంలో సాలీనా పెరుగుదల 19.55 శాతం అయితే మన ప్రభుత్వ హయాంలో సాలీనా పెరుగుదల 15.46 శాతం మాత్రమే అని లెక్కలుతో సహా కాగ్‌ రిపోర్టుల ఆధారంగా కనిపిస్తోంది. అయితే ఇవేవీ పట్టనట్టుగా చంద్రబాబు హయాంలో బాగా జరిగింది, మన ప్రభుత్వ హయాంలో బాగా జరగలేదు అన్నట్టుగా రాయడం, చెప్పడం అన్నది ఎంతవరకు సమంజసం అన్నది ప్రజలంతా ఆలోచన చేయాలి.
కేంద్రంలో పోల్చి చూస్తే…
స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)తో పోలిస్తే కేంద్రం చేసిన అప్పులు (డెట్‌ టు జీడీపీ) పతాకస్థాయికి చేరుకున్నాయి. కోవిడ్‌ సమయంలో దాని ప్రభావం ఎలా పడిందో కనిపిస్తోంది. 2020–21తో పాటు, 2021–22లో డెట్‌ టు జీడీపీ దేశ ఆర్థిక వ్యవస్థమీద ప్రభావం చూపే స్థాయికి చేరుకుంది.
2014–15లో స్థూల దేశీయ ఉత్పత్తి రూ.124 లక్షల కోట్లు అయితే, ఆ ఏడాది కేంద్రానికి ఉన్న అప్పులు రూ.62,42,220 కోట్లు. ఈ అప్పులు కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి తీసుకున్న అప్పులు పరిగణలోకి తీసుకోకుండా చెప్పిన వివరాలు. అంటే డెట్‌ టు జీడీపీ 50.07 శాతం.
ఇక 2020–21లో జీడీపీ రూ.198,00,913 కోట్లు కాగా, ఆ ఏడాది కేంద్రం అప్పులు రూ.120,79,018 కోట్లు. అంటే డెట్‌ టు జీడీపీ ఏకంగా 61 శాతానికి పెరిగింది. దేశానికే ఈ రకమైన తల్లడిల్లే పరిస్థితి వచ్చింది.

ఆ తర్వాత ఏడాది 2021–22లో జీడీపీ రూ.236,64,636 కోట్లు కాగా, అప్పుల మొత్తం రూ.135,88,193 కోట్లు. అంటే డెట్‌ టు జీడీపీ 57.42 శాతం. ఈ విషయం బడ్జెట్‌ డాక్యుమెంట్లతో పాటు, గణాంకాలు–కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ (ఎంఓఎస్‌పీఐ) నివేదికలో స్పష్టంగా ఉంది.

కేంద్రం అప్పులు… రాష్ట్రం అప్పులు
ఎలా పెరుగుతున్నాయో కూడా ఒక్కసారి గమనిద్దాం… రాష్ట్ర విభజనకు ముందు నుంచి కేంద్రంతో పోలిస్తే, రాష్ట్ర రుణాలు పెంపు తక్కువగానే ఉంది.
రాష్ట్ర విభజనకు ముందే, అంటే 2014 మే 31 నాటికి, కేంద్రానికి ఉన్న రుణాలు రూ.59,09,965.48 కోట్లు.
– 2019 మే 31 నాటికి ఆ రుణం రూ.94,49,372.03 కోట్లకు చేరింది.
అంటే 5 ఏళ్లలో కేంద్రం అప్పులు 59.88 శాతం పెరిగాయి. ‘కాంపౌండెడ్‌ యాన్యువల్‌ గ్రోత్‌ రేట్‌’ (సీఏజీఆర్‌) ప్రకారం చూస్తే ఆ అయిదేళ్లలో పెరిగిన కేంద్ర రుణం 9.84 శాతం.

ఒక్కసారి మన బుద్దిమంతుడు, చంద్రబాబునాయుడు గారి పరిపాలనలో ఏం జరిగిందో చూద్దాం. మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి చూస్తే, విభజనకు కొన్నాళ్ల ముందు, అంటే 2014 మే 31 నాటికి రాష్ట్ర రుణం రూ.1,20,556 కోట్లు.
2019 మే 31 నాటికి రాష్ట్ర రుణం మొత్తం రూ.2,69,462 కోట్లు పెరింది. అంటే ఆ 5 ఏళ్లలో రాష్ట్ర అప్పులు 123.52 శాతం పెరిగాయి.
‘కాంపౌండెడ్‌ యాన్యువల్‌ గ్రోత్‌ రేట్‌’ (సీఏజీఆర్‌) ప్రకారం చూస్తే ఆ అయిదేళ్లలో పెరిగిన రాష్ట్ర రుణం 17.45 శాతం. అంటే ఒకవైపు కేంద్రం 59శాతం పెరిగితే రాష్ట్రం అప్పులు 123 శాతం మన పెద్దమనిషి చంద్రబాబు హయాంలో పెరిగాయి.
ఆ తర్వాత 2019, మే 31 నాటికి కేంద్రానికి ఉన్న అప్పులు రూ.94,49,372.03 కోట్లు. ఈ మూడేళ్లలో అంటే 2022 మార్చి 31 నాటికి కేంద్ర రుణాల మొత్తం రూ.1,35,88,193.16 కోట్లకు పెరిగాయి. అంటే 3 ఏళ్లలో కేంద్రం అప్పులు 43.80 శాతం పెరిగాయి.
‘కాంపౌండెడ్‌ యాన్యువల్‌ గ్రోత్‌ రేట్‌’ (సీఏజీఆర్‌) ప్రకారం చూస్తే ఆ అయిదేళ్లలో పెరిగిన కేంద్ర రుణం 13.68 శాతం.

అదే సమయంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 దుష్ప్రచారం చేస్తున్న మన అప్పులు సంగతి చూస్తే… మన రాష్ట్ర ప్రభుత్వ అప్పులు చూస్తే.. 2019 మే 31 నాటికి రాష్ట రుణం రూ.2,69,462 కోట్లు.
అదే ఈ మూడేళ్లలో, అంటే ఈ ఏడాది మార్చి 31 నాటికి రాష్ట్రానికి ఉన్న రుణ మొత్తం రూ.3,82,165 కోట్లు. అంటే ఈ 3 ఏళ్లలో రాష్ట్ర అప్పులు 41.83 శాతం పెరుగుదల కనిపిస్తే… ‘కాంపౌండెడ్‌ యాన్యువల్‌ గ్రోత్‌ రేట్‌’ (సీఏజీఆర్‌) ప్రకారం చూస్తే ఈ మూడేళ్లలో పెరిగిన రాష్ట్ర రుణం 12.73 శాతం. అంటే, కేంద్రంతో పోలిస్తే, రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ చాలా తక్కువ అప్పు చేసింది. అదే చంద్రబాబు హయాంలో చూస్తే అప్పటి కేంద్ర ప్రభుత్వం కన్నా బాబుæ ప్రభుత్వం ఎక్కువ అప్పులు చేసింది. ఇవన్నీ ప్రజలకు తెలియాల్సి ఉంది. ఎవరి హయాంలో ఎవరు రాష్ట్ర ఆర్ధిక వ్యవస్ధను మెరుగ్గా నడిపిస్తున్నారు.. ఎవరి హయాంలో రాష్ట్ర ఆర్ధిక వ్యవస్ధ గాడి తప్పి దోచుకో, పంచుకో, తినుకో అనిఎవరి హయాంలో దోచేశారో ప్రజలకు తెలియాల్సి ఉంది.

అయితే ఇక్కడ మరో విషయం మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది.
2014 నుంచి 2019 వరకు రాష్ట్రంలో ఆర్థికంగా ప్రభావితం చేసే కరోనా మహమ్మారి వంటి సమస్యలేవీ అప్పుడు లేవు. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రత్యేక సమస్యను మనం ఎదుర్కొన్నాం.
అయినప్పటికీ బాబు ప్రభుత్వం, ఈ మూడేళ్లలో మనం ప్రభుత్వం తీసుకున్న రుణాల కంటే, చాలా ఎక్కువ అప్పులు చేసింది. ఇవన్నీ స్పష్టంగా కనిపిస్తున్నా ఎల్లో మీడియా, చంద్రబాబు పనికట్టుకుని దుష్ప్రచారం చేసే కార్యక్రమం చేస్తున్నారు.

చేసిన అప్పులు చెల్లించే విషయంలో..
ఇక చేసిన అప్పులు చెల్లించే విషయంలో కూడా మన పరిస్థితి ఏంటో చూద్దాం.
దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ద్రవ్య లోటు విషయంలో మనం ఎలా ఉన్నామో చూద్దాం…
ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ద్రవ్యలోటులోనూ ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితి ఈ మూడేళ్లలో చాలా మెరుగ్గా ఉంది.
2014 నుంచి 2019 వరకు దేశంలోని అన్ని రాష్ట్రాల సగటు ద్రవ్యలోటుతో పోలిస్తే, ఆంధ్రప్రదేశ్‌ సగటు ద్రవ్యలోటు 6.58 శాతంగా తేలింది.
అదే ఈ మూడేళ్లలో అంటే, 2019 నుంచి 2022 వరకు, దేశంలోని అన్ని రాష్ట్రాల సగటు ద్రవ్యలోటుతో పోలిస్తే, రాష్ట్ర ద్రవ్యలోటు 5.73 శాతం మాత్రమే.

రాష్ట్రం చేస్తున్న భారీ అప్పుల వల్ల, రుణాలను తిరిగి చెల్లించటం చాలా కష్టం అవుతోందని, ఇది ప్రభుత్వం మీద మోయలేని భారం వేస్తోందని చంద్రబాబు నాయుడు తన అనుకూల మీడియా పదే పదే వక్రీకరించి రాస్తున్నాయి.
పన్నుల ఆదాయంలో అత్యధిక భాగం రుణాల తిరిగి చెల్లింపులకే సరిపోతోందని అంతా ఒక్కటై ప్రభుత్వంమీద దాదాపు రోజూ ఇటువంటి వార్తలే రాస్తున్నారు.

కానీ నిజానికి రుణాల తిరిగి చెల్లింపులో గత ప్రభుత్వం కంటే, ఈ ప్రభుత్వం చాలా సమర్థంగా వ్యవహరిస్తోంది.

2018–19లో చంద్రబాబు హయాంలో గత ప్రభుత్వం రుణాల తిరిగి చెల్లింపులో వడ్డీ కింద రూ.15,342 కోట్లు, అసలు కింద రూ.13,545 కోట్లు చెల్లించింది.
అంటే ఆ ఏడాది గత ప్రభుత్వం మొత్తం రూ.28,886.69 కోట్లు రుణాల కింద చెల్లించింది. అదే మన ప్రభుత్వం వచ్చాక గత ఏడాది, 2021–22లో వడ్డీ కింద రూ.21,449 కోట్లు, అసలు కింద రూ.14,559 కోట్లు చెల్లించింది.
అంటే మా ప్రభుత్వం గత ఏడాది మొత్తం రూ.36,008 కోట్లు రుణాల కింద చెల్లించాం.

రాష్ట్ర సొంత ఆదాయం ఎలా ఉందన్నది గమనిస్తే.. 2018–19లో రూ.62,426 కోట్లు అయితే అందులో రూ.28,886 కోట్లు అప్పులు చెల్లించారు అంటే 46.3 శాతం అప్పుల కోసం పెట్టాల్సి వచ్చింది. మన హయాంలో చూస్తే రాష్ట్ర ఆదాయాలు 2021–22లో రూ.75,696 కోట్లు అయితే అంతే శాతం అంటే 47.6 శాతం మాత్రమే అప్పులు చెల్లించడానికి మాత్రమే రాష్ట్ర సొంతఆదాయంలో ఖర్చు చేయాల్సి వస్తోంది.

ఇక్కడ గమనించాల్సినది ఏమిటంటే… కోవిడ్‌ సమయంలో మనకు రావాల్సిన ఆదాయం అంటే 2021–22 ఏప్రిల్, మే నెలలో లాక్‌డౌన్‌ అయి రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం గండిపడింది. ఆ రెండు నెలల్లో ఆదాయం కలుపుకుంటే మనది 47.6 శాతం కాకుండా ఇంకా తగ్గిపోయే పరిస్థితి ఉండేది.
దేవుడి దయలో ఇవాళ ఎకానమీ బాగుంది. గ్రోత్‌ రేట్‌ పరుగులు తీస్తోంది. ఈ గ్రోత్‌రేట్‌ ఆధారంగా రాష్ట్ర ఆదాయాలు కూడా పెరుగుదల నమోదవుతుంది. ఇవన్నీ రాష్ట్రానికి మంచి చేసే పరిణామాలు. ఈ ఐదేళ్లు ముగిసేసరికి గత ప్రభుత్వం కన్నా మన ప్రభుత్వం ఐదేళ్లలో మెరుగైన పనితీరు చూపిస్తుందని కూడా కచ్చితంగా చెపుతున్నాను.

మరో ముఖ్యమైన సబ్జెక్ట్‌ క్యాపిటల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌… అంటే మూలధన వ్యయం మనం ఎంత చేశాం అన్నది… చంద్రబాబు నాయుడు, ఎల్లో మీడియా విమర్శిస్తూ ఉంటారు. మన హయాంలో సరిగా జరగడం లే దని విమర్శిస్తూ ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వం ఆస్తులు, సంపద సృష్టి కోసం కాకుండా ఎంతసేపూ ప్రజాకర్షక పథకాలు, కార్యక్రమాలకే నిధులు వ్యయం చేస్తోందని ఇటువంటి ప్రచారాలు కూడా ఎల్లోమీడియా చేస్తోంది. ఇది కూడా పూర్తిగా అవాస్తవం. వాస్తవానికి గత ప్రభుత్వ హయాంలో కంటే, మనందరి ప్రభుత్వం ఈ మూడేళ్లలో చాలా ఎక్కువ మొత్తాన్ని (క్యాపిటల్‌ ఇన్వెస్టిమెంట్‌) మూలధన వ్యయం కింద ఖర్చు చేయడం జరిగింది.

విద్య, వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యత
విద్య, వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్న మనందరి ప్రభుత్వం వాటి కోసం పెద్ద ఎత్తున ఖర్చు చేస్తోంది.
ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిస్థాయిలో అత్యాధునిక మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది. స్కూళ్లను సమగ్రంగా మారుస్తోంది. అదే విధంగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వైద్య రంగంలో గణనీయ మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇవన్నీ రాష్ట్ర ప్రజల మంచి కోసం మనం చేస్తున్నాం.

మూలధన వ్యయం కింద గత ప్రభుత్వం 2014–15లో రూ.7265 కోట్లు, 2015–16లో రూ.15,042 కోట్లు, 2016–17లో రూ.15,707 కోట్లు, 2017–18లో రూ.16,280 కోట్లు, 2018–19లో రూ.21,845 కోట్లు ఖర్చు చేసింది.
ఆ విధంగా 5 ఏళ్లలో మూలధన వ్యయం కింద మొత్తం రూ.76,139 కోట్లు ఖర్చు చేయగా, ఏటా అది సగటున రూ.15,228 కోట్లు.

మన ప్రభుత్వ హయాంలో మూలధనఖర్చు…
ఇక మనందరి ప్రభుత్వం వచ్చాక 2019–20లో మూలధన వ్యయంగా చేసిన ఖర్చు రూ.17,601 కోట్లు, 2020–21లో రూ.20,690 కోట్లు, 2021–22లో రూ.16,795 కోట్ల చొప్పున ఈ మూడేళ్లలో మొత్తం రూ.55,086 కోట్లు ఖర్చు చేసింది.
గత ప్రభుత్వం కంటే ఎక్కువగా ఈ మూడేళ్లలోనే మనందరి ప్రభుత్వం ఏటా సగటున రూ.18,362.07 కోట్లు ఖర్చు చేశాం. మరి ఏ విధంగా వీళ్లు మనం క్యేపిటల్‌ ఇన్వెస్టిమెంట్‌ తక్కువ చేస్తున్నామని బురద జల్లుతారు.

ఇదే సమయంలో కేంద్ర స్థాయిలో మూలధన వ్యయం (గ్రాస్‌ ఫిక్స్‌డ్‌ క్యాపిటల్‌ ఫార్మేషన్‌–జీఎఫ్‌సీఎఫ్‌) చూస్తే, అంతకు ముందు 4 ఏళ్ల కంటే, గత మూడేళ్లలో తగ్గుతూ వస్తోంది.

కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా ఎలా ఉందో చూడాల్సిన అవసరం ఉంది.
కేంద్రం రకరకాల పన్నులు వసూలు చేస్తుంది. అలా వసూలు చేసే పన్నుల్లో రాష్ట్రాలకు వచ్చే వాటా, అందులో మన రాష్ట్రానికి వచ్చే వాటా కూడా గత మూడేళ్లుగా తగ్గుతూ వస్తోంది.
14వ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు, కేంద్రం వసూలు చేసే పన్నుల్లో 2015 నుంచి 2020 వరకు సెస్, సర్‌ఛార్జ్‌ మినహాయించి, 42 శాతం మొత్తాన్ని రాష్ట్రానికు ఇవ్వాల్సి ఉంది. ఇక 15వ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు ఆ పన్నుల్లో 2025 వరకు 41 శాతం రాష్ట్రాలకు ఇవ్వాల్సి ఉంది. కానీ కేంద్రం ఏనాడూ ఆ మొత్తంలో రాష్ట్రాలకు తమ పన్నుల ఆదాయాన్ని పంచలేదు.

2019 నుంచి తగ్గిన రాష్ట్ర ఆదాయం..
ఇంకా చెప్పాలంటే 2019 నుంచి మన రాష్ట్రానికి ఆ ఆదాయం ఇంకా తగ్గింది.
2015–16లో పన్నుల రూపంలో కేంద్రానికి మొత్తం రూ.14,49,958 కోట్ల ఆదాయం రాగా, అందులో రాష్ట్రాలకు ఇచ్చింది రూ.5,06,193 కోట్లు. అంటే 42 శాతం ఇవ్వాల్సిన చోట 34.91 శాతం మాత్రమే ఇచ్చింది.

ఆ ఐదు సంవత్సరాల పీరియడ్‌లో గమనించినట్లయితే… సరాసరి 34, 35 శాతం ఇస్తున్నారు. దానిలో మన రాష్ట్రానికి 4.30 శాతం వస్తుంది. మన మూడు సంవత్సరాలకి వచ్చేసరికి గతంలో వచ్చిన ఆ 35 శాతం సరాసరి కూడా రావడం లేదు.
2015–16లో 34.91 శాతం, 2016–17లో 35.57 శాతం 2017–18లో 35.13 శాతం 2018–19లో 36.63 శాతం వస్తే.. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అది కూడా మనకు తగ్గింది.
2019–20లో 32.41 శాతం 2020–21లో 29.35 శాతం 2021–22 లో 32.56 శాతం వచ్చింది. అంటే కేంద్రం మనకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా తగ్గించి ఇస్తున్న పరిస్థితులు. దీనివల్ల రాష్ట్రాలకు రావాల్సిన ఆదాయాల శాతం తగ్గుతూ వస్తోంది.. అయినప్పటికీ కూడా దేవుడి దయతో గవర్నెన్స్‌లో తీసుకొచ్చిన మార్పులు, డీబీటీ పద్ధతి, పారదర్శకంగా డెలివరీ మెకానిజమ్, లంచాలకు ఏమాత్రమూ తావు లేకుండా పంపిణీ వ్యవస్ధను అభివృద్ధి చేయడం వంటి మెరుగైన పరిపాలన, విధానాలను తీసుకురావడం వలన మెరుగైన ఆర్ధిక క్రమశిక్షణను తీసుకురాగలిగాం.

ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే…. వాస్తవాలన్నీ ప్రజలకు తెలియాలి. ఎందుకంటే వాళ్లకు సంబంధించిన మనిషి ముఖ్యమంత్రి స్ధానంలో లేడు కాబట్టి.. ఒక విష ప్రచారం.. ఈ ప్రభుత్వం మీద బురదజల్లాలన్న మైండ్‌సెట్‌తో కావాలనే చేస్తున్నారు. అదే బడ్జెట్, చేసిన అప్పులు గతం కంటే తక్కువ చేశాం. 2018–19లో ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన బడ్జెట్‌ రూ.2.28 లక్షల కోట్లు, మూడేళ్ల తర్వాత కూడా మనం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ రూ.2.50 లక్షల కోట్లు. బడ్జెట్‌ అదే, చంద్రబాబునాయుడు కన్నా మనం తక్కువ అప్పులు చేశాం.

మరి బాబు హాయంలో అమ్మ ఒడి, చేయూత, ఆసరా వంటి పథకాలు లేవు. అప్పుడు పెన్షన్‌ కేవలం ముష్టి వేసినట్టు… రూ.1000 ఇచ్చారు. ఇవాళ రూ.2500 ఇస్తున్నాం. ఇవన్నీ కాకుండా మూలధన వ్యయం కూడా వాళ్ల కన్నా మన ప్రభుత్వమే ఎక్కువ చేసింది. ఇవన్నీ ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. కారణం అప్పట్లో దోచుకో, పంచుకో, తినుకో ఒక్కటే స్కీం. చంద్రబాబు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడు. ఎవరెవరికి ఎంత వాటాలు రావాలో అంత పంచుకుంటారు. ఎవరూ రాయరు, ఎవరూ చూపరు. అప్పుడప్పుడూ చంద్రబాబు మీద మా బాబు మంచోడనే రాతలు రాస్తారు. ఇవాళ అవినీతి లేదు, లంచాలు, వివక్ష కూడా లేదు. పాలనలో పారదర్శకత ఉంది. ఇవన్నీ రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయాలి. గతంలో ఇవన్నీ లేవు ఈ రోజు ఉన్నాయి. రాష్ట్ర ప్రజలందరికీ కూడా మీ ద్వారా ఈ సభ ద్వారా విన్నవిస్తున్నాను. ఇటువంటి తప్పుడు మాటలు, అబద్దాలను నమ్మవద్దని, ప్రభుత్వం చేసే మంచిని చూడమని సవినయంగా వేడుకుంటున్నాను అని సీఎం వైయస్‌.జగన్‌ తన ప్రసంగం ముగించారు.

Leave a Reply