Suryaa.co.in

Andhra Pradesh

లూటీ కోసం మితిమీరిన అప్పులు

వడ్డీల చెల్లిపుల కోసం ఛార్జీలు, పన్నుల బాధుడు, సబ్ ప్లాన్ నిధుల దారిమళ్లింపుతో సామాజిక న్యాయం గొంతు కోస్తున్నారు.
ధరలు, ఛార్జీల బాదుడు వల్ల ఒక్కో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కుటుంబంపై రూ.2,79,136 అదనపు భారం మోపారు.
రూ.1.14 లక్షల కోట్లు సబ్ ప్లాన్ నిధులు దారిమళ్లించారు.

– శాసనమండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు

వైకాపా ప్రభుత్వం లూటీ కోసమే అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని ఆర్ధిక వ్యవస్థను ఊబిలోకి నెట్టింది. రాష్ట్రం క్లాసిక్ డెట్ ట్రాప్‌లోకి వెళుతోందని గత నాలుగేళ్లుగా ఏకరవు పెడుతున్నా ప్రతిపక్షాలపై విరుచుకుపడటం తప్ప ఏమాత్రం దిద్దుబాటు చర్యలు తీసుకోలేదు. ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాద్ రెడ్డి వాస్తవ ఆర్ధిక పరిస్థితిని విశ్లేషించకుండా పదేపదే అబద్దాలను వల్లెవేస్తున్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై కాగ్, క్రిసిల్ లాంటి సంస్థలు తీవ్రంగా హెచ్చరిస్తున్నా పట్టించుకోకుండా అబద్దాలను ప్రచారం చేస్తున్నది.

ఈ ఏడాది ఆగష్టు నెలలో డాయిష్ బ్యాంకు ముఖ్య ఆర్ధికవేత్త కౌశిక్ దాస్ తన నివేదికలో రాష్ట్రాల ఆర్ధిక వ్యవస్థల్లో ఏపీ 8వ స్థానం నుంచి 11 వ స్థానానికి పడిపోయిందని చెప్పారు. నిన్న క్రిసిల్ రేటింగ్ సంస్థ అమరావతి బాండ్ల రేటింగ్‌ను తగ్గించింది. చేబదుళ్లు, ఓవర్ డ్రాప్ట్‌లతోనే ఆర్ధిక నిర్వాహణ చేసే స్థితికి దిగజారిందని చెప్పింది. జగన్ రెడ్డి దోపిడీ, దుబారాల వల్లే నేడు రాష్ట్రానికి ఈ దుస్థితి దాపురించింది. ప్రభుత్వ గ్యారెంటీలతో కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన అప్పుల సమాచారం కాగ్ అడిగినా ఆ లెక్కలు వెల్లడించడం లేదు. పబ్లిక్ అకౌంట్ నుంచి ఎంత మొత్తం రుణం ప్రభుత్వం వినియోగించుకుంటుందో కూడా చెప్పడం లేదు.

వైకాపా ప్రభుత్వం వెల్లడిస్తున్న కుట్రపూరిత గణాంకాలను రాష్ట్రం ఆవిర్భవించాక ఎన్నడూ చూడలేదు. రాష్ట్ర స్థూల ఉత్పత్తిపై, తలసరి ఆదాయంపై, అప్పులపై తప్పుడు లెక్కలను నిస్సిగ్గుగా పుస్తకాలు వేసి ప్రచారం చేస్తోంది. 2019-20 లో వృద్దిరేటు ఎక్కువగా చూపించుకోవడం కోసం టీడీపీ హయాంలో సాధించిన వృద్ధిరేటును తారుమారు చేశారు. 2018-19 ఆర్ధిక సంవత్సరంలో రూ.6,80,332 కోట్లు (11.02 శాతం) స్థూల ఆదాయం అని ముందస్తు అంచనాల్లో ప్రకటించి 2018-19 ఆర్ధిక సర్వే విడుదల చేశారు. ఈ జీడీపీని రూ.6,21,301 కోట్లకు (4.45) కుదించి 2019-20 ఎకనామిక్ సర్వేలో చూపించారు.

2018-19లో టీడీపీ సాధించిన జీడీపీ కన్నా 2019-20 లో రూ.53,718 కోట్లు తగ్గించి 11.02 శాతం వృద్దిరేటును 5.36 శాతంకు కుదించారు. 2020-21 లో కోవిడ్‌తో పూర్తిగా పతనమైనటువంటి ఆర్ధిక వ్యవస్థ నేపధ్యంలో దేశంలోనూ, రాష్ట్రంలోనూ నెగెటివ్ వృద్ధిరేట్లు నమోదయ్యాయి. కానీ, వైసీపీ ప్రభుత్వం మాత్రం రొయ్యలు, చేపలు ఎగుమతుల్లో దేశంలోనే 3 వ స్థానంలో నిలిచిందని తప్పుడు లెక్కలు చూపారు. కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతులు నిలిచిపోయి దారుణమైన పరిస్థితులు నెలకొంటే వైసీపీ ప్రభుత్వం మాత్రం ఏకంగా రూ.40 వేల కోట్లు మేర రొయ్యల ఎగుమతులు జరిగాయని నిస్సిగ్గుగా అబద్దాలు వల్లెవేసింది.

ఈ తప్పుడు లెక్కలపై, రాష్ట్ర ఆర్ధికస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసి బహిరంగ చర్చకు రావాలని పిలిచినా వైసీపీ నుంచి ఎటుంవంటి స్పందన లేదు. జగన్ రెడ్డి ప్రభుత్వ ఆర్ధిక అరాచకపాలనతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. తెచ్చిన అప్పులు, వడ్డీల చెల్లింపుల కోసం, ఛార్జీలు, పన్నుల బాధుడు, సబ్ ప్లాన్ నిధుల దారిమళ్లింపుతో సామాజిక న్యాయం గొంతు కోస్తున్నారు. ఈ వర్గాల ప్రజల కొనుగోలుశక్తి దారుణంగా పడిపోయింది.

పొదుపుశక్తి పూర్తిగా మందగించింది. నాలుగేళ్లల్లో చేపట్టిన అభివృద్ధి మచ్చుకైనా లేదు. తన లూటీ, దుబారాతో రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టారు. భావితరాల భవిష్యత్‌ను సర్వనాశనం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు సొంత కాళ్లపై నిలబడేలా సబ్ ప్లాన్ అమలు చేస్తే, వైకాపా ప్రభుత్వం సబ్ ప్లాన్ నిధులు, అన్న క్యాంటీన్, నిరుద్యోగ భృతి లాంటి 120 పథకాలను రద్దు చేసింది.

ఈ వర్గాలకు చెందిన రూ.1.14 లక్షల కోట్ల సబ్ ప్లాన్ నిధులు దారిమళ్లించారు. 14 లక్షల ఎకరాల అసైన్డ్ భూముల్ని కబ్జా చేసేందుకు జగన్ రెడ్డి ముఠా ప్రయత్నిస్తున్నది. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 10 శాతం రిజర్వేషన్లను కోత కోసి 16,800 మందికి రాజ్యాంగబద్ద పదవులు దూరం చేశారు. జగన్ రెడ్డి ఆర్ధిక విధానాలతో, పెరిగిన నిత్యవసర వస్తువుల ధరల వల్ల 53 నెలల జగన్ రెడ్డి పాలనలో ఒక్కో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కుటుంబంపై రూ.2,79,136 ల భార అధనంగా పడింది.

 

LEAVE A RESPONSE