– వ్యవసాయ ఎగుమతులను విస్తరించడంలో FPOs కీలక పాత్ర పోషించగలవు –
– రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత
– – వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ మరియు ఉద్యానవన ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లలో విస్తృత అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర వ్యవసాయ మంత్రి తెలిపారు. Federation of Telangana Chambers of Commerce and Industry ఆధ్వర్యంలో KLN ఆడిటోరియం, Federation house, Redhills లో నిర్వహించిన వ్యవసాయ ఎగుమతులపై అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో APEDA, DGFT అధికారులు, పరిశ్రమల ప్రతినిధులు, ఎగుమతిదారులు, Farmer Producer Organizations (FPOs) సభ్యులు మరియు రైతులు పాల్గొన్నారు.
మంత్రి మాట్లాడుతూ… రాష్ట్రంలో అమలు చేస్తున్న రైతు సంక్షేమ మరియు వ్యవసాయ అభివృద్ధి విధానాల ఫలితంగా తెలంగాణ దేశంలోనే అత్యధిక వరి ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రంగా నిలిచిందని చెప్పారు. అదే సమయంలో ఉద్యానవన పంటల ఉత్పత్తి కూడా గణనీయంగా పెరిగిందని, పండ్లు, కూరగాయలు, పసుపు, మిర్చి వంటి పంటలకు దేశీయ మార్కెట్లతో పాటు అంతర్జాతీయ మార్కెట్లలో కూడా మంచి డిమాండ్ ఉన్నట్లు వివరించారు.
ఉత్పత్తి పెంపుతో పాటు రైతులకు మెరుగైన ధరలు అందేలా చేయడం, కొత్త మార్కెట్ అవకాశాలు కల్పించడం మరియు రైతుల ఆదాయాన్ని పెంచడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు.
ఈ లక్ష్యాన్ని సాధించడానికి వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను విస్తరించడం అత్యంత ముఖ్యమని ఆయన తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లకు తీసుకెళ్లాలంటే కేవలం ఉత్పత్తి పెరగడం మాత్రమే సరిపోదని, గ్రేడింగ్, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, బ్రాండింగ్ మరియు అంతర్జాతీయ నాణ్యత ప్రమాణాలు కూడా అత్యంత అవసరమని మంత్రి చెప్పారు.
ఈ నేపథ్యంలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించేందుకు అనేక చర్యలు చేపడుతోందని చెప్పారు.
అందులో భాగంగానే ఖమ్మం జిల్లా బుగ్గపాడు వద్ద మెగా ఫుడ్ పార్క్ ద్వారా ఆధునిక ప్రాసెసింగ్ సదుపాయాలు, కోల్డ్ స్టోరేజ్, లాజిస్టిక్స్ మరియు విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకి అవకాశాలు కల్పించిందని వివరించారు. దీని ద్వారా రైతుల పంటలకు మెరుగైన మార్కెట్ లభించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని మంత్రి తెలిపారు.
తెలంగాణలో ఉద్యానవన పంటల ఎగుమతులకు అపార అవకాశాలు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. సరైన సరఫరా వ్యవస్థలు, ప్యాక్ హౌసులు, కోల్డ్ స్టోరేజ్ సదుపాయాలు మరియు లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేస్తే రాష్ట్రం అంతర్జాతీయ మార్కెట్లలో మరింత ముందుకు వెళ్లగలదని అన్నారు. ఈ దిశగా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
అదే సమయంలో రైతుల ప్రయోజనాలను కాపాడటం కూడా ఎంతో ముఖ్యమని మంత్రి స్పష్టం చేశారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ మరియు వంటనూనెలపై దిగుమతి సుంకాలను తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయాలపై రైతుల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు.
ఇటువంటి నిర్ణయాలు దేశీయ రైతులపై ప్రభావం చూపే అవకాశముందని, రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి తెలిపారు.
అమెరికా వంటి దేశాలతో వ్యవసాయ వాణిజ్య ఒప్పందాల విషయంలో కూడా జాగ్రత్తగా వ్యవహరించాలని అన్నారు. అంతర్జాతీయ వాణిజ్యం అవసరమైనదే అయినా, అది దేశీయ రైతుల ప్రయోజనాలకు భంగం కలిగించకుండా ఉండాలని మంత్రి పేర్కొన్నారు.
Farmer Producer Organizations (FPOs) వ్యవసాయ ఎగుమతులను విస్తరించడంలో కీలక పాత్ర పోషించగలవని మంత్రి చెప్పారు. రైతుల ఉత్పత్తులను సమీకరించడం, నాణ్యతను నిర్ధారించడం మరియు రైతులను నేరుగా ఎగుమతిదారులతో అనుసంధానం చేయడం ద్వారా చిన్న రైతులు కూడా ప్రపంచ మార్కెట్లలో భాగస్వాములు కావచ్చని తెలిపారు. FPOలను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం పలు కార్యక్రమాలు అమలు చేస్తోందని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ ఎగుమతులను ప్రోత్సహించేందుకు APEDA, DGFT మరియు ఇతర పరిశ్రమల సంస్థలతో సమన్వయం చేసుకుంటూ పనిచేస్తోందని మంత్రి తెలిపారు. రైతులు మరియు పారిశ్రామికవేత్తలలో అవగాహన పెంచేందుకు పలు శిక్షణ కార్యక్రమాలు మరియు అవగాహన సమావేశాలు నిర్వహిస్తున్నామని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన Vision–2047 వ్యవసాయం మరియు ఉద్యానవన రంగాల దీర్ఘకాలిక అభివృద్ధికి మార్గదర్శకంగా నిలుస్తుందని మంత్రి తెలిపారు. ఇందులో ఉత్పత్తి పెంపుతో పాటు విలువ ఆధారిత ఉత్పత్తులు, ఫుడ్ ప్రాసెసింగ్, వ్యవసాయ ఎగుమతుల ప్రోత్సాహం మరియు రైతుల ఆదాయాల పెంపుపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు.
తెలంగాణ రాష్ట్రానికి వ్యవసాయ మరియు ఉద్యానవన ఉత్పత్తుల ఎగుమతుల్లో దేశంలోనే ముందంజలో నిలిచే పూర్తి సామర్థ్యం ఉందని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ సెమినార్ వంటి కార్యక్రమాలు రైతులు, ఎగుమతిదారులు, పరిశ్రమలు, ఆర్థిక సంస్థలు మరియు విధాన నిర్ణేతలను ఒకే వేదికపైకి తీసుకువస్తాయని మంత్రి తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలు మార్కెట్ అవసరాలను అర్థం చేసుకోవడంలో, కొత్త ఎగుమతి అవకాశాలను గుర్తించడంలో మరియు వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయడంలో కీలకంగా ఉంటాయని చెప్పారు. ఈ సెమినార్ లో FICC ప్రతినిధులతో పాటు APEDA, DGFT మరియు ఎగుమతి రంగ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు