Suryaa.co.in

National

రైల్వే బోర్డు చైర్మన్‌గా తొలిసారి దళితుడి నియామకం

న్యూఢిల్లీ: ఇండియన్ రైల్వే మేనేజ్‌మెంట్ సర్వీస్ అధికారి సతీష్ కుమార్ రైల్వే బోర్డు చైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా నియమితులయ్యారు. షెడ్యూల్డ్ కులం నుండి ఈ స్థానానికి ఎంపికైన మొదటి వ్యక్తి ఈయనే కావడం విశేషం. ఆగస్టు 31న పదవీ విరమణ చేయనున్న ప్రస్తుత బోర్డు చైర్‌పర్సన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస జయ వర్మ సిన్హా స్థానంలో కుమార్ సెప్టెంబర్ 1నుంచి పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇండియన్ రైల్వే మేనేజ్‌మెంట్ సర్వీస్ సభ్యుడు (ట్రాక్షన్ అండ్‌ రోలింగ్ స్టాక్), రైల్వే బోర్డు చైర్మన్ అండ్‌ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పదవికి సతీష్ కుమార్ నియామకం కావడంపై క్యాబినెట్ నియామకాల కమిటీ ఆమోదించింది.

సతీష్ కుమార్ ఎవరంటే..
ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ మెకానికల్ ఇంజనీర్స్ 1986 బ్యాచ్‌కు చెందినవారు సతీష్‌ కుమార్. 34 ఏళ్ళకు పైగా భారతీయ రైల్వేలకు విశేషమైన సేవలందించారు. నవంబర్ 8, 2022న, ప్రయాగ్‌రాజ్‌ నార్త్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్‌గా బాధ్యతలు స్వీకరించారు. జైపూర్‌లోని ప్రతిష్ఠాత్మక మాలవ్య నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి మెకానికల్ ఇంజనీరింగ్‌(బి.టెక్‌) పూర్తి చేశారు. ఆపరేషన్ మేనేజ్‌మెంట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమాతో తన పరిజ్ఞానాన్ని మరింత పెంచుకున్నారు. ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ నుండి సైబర్ లా పూర్తి చేశారు. కుమార్ మార్చి 1988లో ఇండియన్ రైల్వేస్‌తో తన కెరీర్‌ను ప్రారంభించారు. అప్పటి నుండి అనేక జోన్‌లు, డివిజన్‌లలో వివిధ కీలకమైన పదవులను నిర్వహించారు. తన పదవీకాలంలో కొత్త సంస్కరణలు ఆవిష్కరించడం, రైల్వే వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచడం, క్లిష్టమైన భద్రతా వ్యవస్థకు మెరుగులు దిద్దడం వంటి కీలకపాత్రలు పోషించారు.

LEAVE A RESPONSE