– 29న విశాఖ 12వ అదనపు జిల్లా కోర్టుకి హాజరు కానున్న మంత్రి
– చినబాబు చిరుతిండి.. 25 లక్షలండి శీర్షికతో వెలువడిన కథనంపై లోకేష్ న్యాయపోరాటం
అమరావతి, మహానాడు: సాక్షిపై వేసిన పరువునష్టం కేసులో విశాఖ 12వ అదనపు జిల్లా న్యాయస్థానంలో 29న జరగనున్న క్రాస్ ఎగ్జామినేషన్కి మంత్రి నారా లోకేష్ హాజరు కానున్నారు. చినబాబు చిరుతిండి.. 25 లక్షలండి శీర్షికతో 2019 అక్టోబర్ 22న సాక్షిపత్రికలో ఓ కథనం వెలువడింది. అవాస్తవాలతో ఉద్దేశపూర్వకంగా తనను డ్యామేజ్ చేయాలని ఈ కథనాన్ని ప్రచురించారని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన న్యాయవాదుల ద్వారా రిజిస్టర్ నోటీసుని సాక్షికి పంపించారు.
సాక్షి ఎటువంటి వివరణ వేయకపోవడం, నోటీసులకు స్పందించకపోవడంతో నారా లోకేష్ పరువునష్టం దావా వేశారు. తన పరువుకు భంగం కలిగించేందుకు అసత్యాలతో కథనం వేశారని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. తాను విశాఖలో ఉన్నానని ప్రచురించిన తేదీల్లో తాను అసలు విశాఖలోనే లేనని ఖండించారు. ప్రభుత్వం ఆహ్వానం మీద వచ్చే అతిథులకు చేసిన అతిథి మర్యాదల కోసం చేసిన ఖర్చుని తనకు అంటగడుతూ తన ప్రతిష్ఠని మంటగలిపేందుకు ప్రయత్నించారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మంత్రిగా తాను అనేక సార్లు విశాఖపట్నం వెళ్ళినా ఎయిర్ పోర్ట్ లో ఎటువంటి ప్రోటోకాల్ సౌకర్యాలు తాను స్వీకరించలేదని స్పష్టం చేశారు. వివిధ కారణాలతో చాలా రోజులుగా వాయిదాలు పడిన ఈ కేసు మంత్రి నారా లోకేష్ క్రాస్ ఎగ్జామినేషన్తో మళ్ళీ మొదలు అవుతోంది.