* దాడులు, బెదిరింపులతో మత్స్యకారుల కష్టాన్ని దోచుకుంటున్నారు
* హార్బర్ ను ఆధునికీకరణ అని చెప్పిన ప్రభుత్వం లైట్లు కూడా వేయలేదు
* 80 శాతం నష్టపరిహారం అని చెప్పి రూ.5 లక్షలు చేతులో పెట్టారు
* మిగతా సొమ్ము ఏమైందో మత్స్యకారులు నిలదీయాలి
* రూ. 451 కోట్లతో రుషికొండపై సీఎం రాజప్రసాదం
* కష్ట జీవుల గురించి ఆలోచిస్తే ఆ మొత్తంతో హార్బర్ నిర్మించేవారు
* ప్యాలెస్ మోజులో ముఖ్యమంత్రి ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారు
* ప్రభుత్వం మారగానే హార్బర్ పరిధిలో మెరైన్ పోలీసింగ్ తో భద్రత కల్పిస్తాం
* ప్రతి 30 కిలోమీటర్లకు జెట్టీ ఏర్పాటు చేస్తాం
* విశాఖ వస్తుంటే ఇంటెలిజెన్స్ అధికారి తప్పుడు సమాచారం ఇచ్చి విమానం పంపించేశారు
* విశాఖ మత్స్యకారుల భరోసా సమావేశంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్
* బోట్లు కాలిపోయిన 49 మంది బాధిత మత్స్యకారులకు రూ. 50 వేల చొప్పున ఆర్థిక సాయం
‘వైసీపీ పాలనలో రౌడీ మూకలు రాజ్యాలు ఏలుతున్నాయి. విశాఖ హార్బర్లో దండుపాళ్యం బ్యాచులు, చీకటి మూకలు రెచ్చిపోతున్నాయి. వేటకు వెళ్తున్న మత్స్యకారులను బెదిరిస్తున్నారు. ఒంటిరి మహిళలపై దాడులు చేసి సొమ్ములు దోచుకుంటున్నారు. చెమటోడ్చి కష్టపడింది అంతా లాక్కుంటున్నారు. మూడు నాలుగేళ్లుగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో.. విశాఖ ఫిషింగ్ హార్బర్ లో అలాంటి పరిస్థితులే ఉన్నాయ’ని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు.
సాగరమాల ప్రాజెక్టులో భాగంగా హార్బర్ ను ఆధునికీకరణ చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం కనీసం లైట్లు కూడా వేయలేకపోయిందని తెలిపారు. వైసీపీకి ఇంకా నాలుగు నెలల సమయం మాత్రమే ఉందని, వచ్చేది జనసేన – టీడీపీ ప్రభుత్వమే అన్నారు. హార్బర్ పరిధిలో మెరైన్ పోలీసింగ్ ఏర్పాటు చేయడంతో ప్రతి మత్స్యకార మహిళకు భద్రత కల్పించే బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు. శుక్రవారం విశాఖ ఫిషింగ్ హార్బర్ లోని అగ్ని ప్రమాద ఘటన స్థలాన్ని పవన్ కల్యాణ్ పరిశీలించారు. బాధిత మత్స్యకారులతో స్వయంగా మాట్లాడారు. బోట్లు కాలిపోయిన 49 మంది బాధిత మత్స్యకారులకు ఒక్కొక్కరికి రూ.50 వేలు చొప్పున ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “మత్స్యకార సోదరులను కుటుంబ సభ్యులుగా చూశాను తప్ప.. ఇతర రాజకీయ పార్టీల్లా ఏనాడూ ఓటు బ్యాంకులా చూడలేదు. కష్టాల్లో ఉన్న మీ కన్నీరు ఎలా తుడవాలనే ఆలోచించి ఇక్కడికి వచ్చాను తప్ప ఓట్లు కోసం కాదు. నేను అలాంటి వ్యక్తిని కూడా కాదు. మీ కష్టాల్లో మేము అండగా ఉన్నామని చెప్పడానికి తెలంగాణలో కీలమైన క్యాంపెయిన్ పక్కన పెట్టి మరి వచ్చాను. ఈ నెల 19వ తేదీన బోట్లు దగ్ధమైన ఘటన నా దృష్టికి రాగానే చాలా బాధపడ్డాను. నేను ఇచ్చే ఈ సహాయం మీ కష్టాన్ని తీరుస్తుందని చెప్పను.
మీ కష్టాల్లో మేము అండగా ఉన్నామని గుర్తు చేయడానికి మాత్రమే చేశాను. సాటి మనిషికి కష్టమొస్తే ఆదుకోవడానికి మేమున్నామనే భావనే బతుకునిస్తుందని నమ్ముతాను. 49 బోట్లు కాలిపోయి దాదాపు రూ.25 కోట్ల నష్టం వాటిల్లింది. ఒక్కొక్క బోటుకు దాదాపు 10 మంది మత్స్యకారులు పని చేస్తారు. ప్రతి వ్యక్తికి ఆదుకోవాలని ఉంది. ఆర్థిక పరిస్థితులు సహకరించక చేయలేకపోయాను. భవిష్యత్తులో ఏ మాత్రం అవకాశం ఉన్నా అందరినీ ఆదుకుంటాం.
మీకు ప్రభుత్వం ఏం చేసింది?
విశాఖ ఫిషింగ్ హార్బర్ ను 1976లో నిర్మించారు. 700 మరబోట్లు నిలిపే వెసులుబాటు ఉన్న ఈ హార్బర్ లో సరైన వసతులు కల్పించలేకపోయారు. ఈ హార్బర్ నుంచి 2.83 లక్షల మెట్రిక్ టన్నుల మత్స్య సంపద ఉత్పత్తి అయితే 2.64 లక్షల మెట్రిక్ టన్నుల మత్స్య సంపద ఎగుమతి అవుతుంది. దాదాపు రూ. 16 వేల కోట్ల ఆదాయం ప్రభుత్వ ఖజానాకు వెళ్తుంది. మీరు ఇంత చేస్తుంటే… మీ కోసం ప్రభుత్వం ఏం చేసింది? కనీసం ప్రకటించిన రూ.10 లక్షల ప్రమాద బీమా కూడా ఇవ్వడం లేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఈ నాలుగేళ్లలో 25 మందికి కూడా బీమా సొమ్ము ఇవ్వలేదు. అధికారంలో లేని మేమే మా క్రియాశీలక కార్యకర్త చనిపోతే రూ. 5 లక్షలు అందిస్తున్నాం. అధికారంలో ఉన్న వైసీపీ ఎందుకు చేయలేకపోతుంది? నేను ఇచ్చిన ఆర్థిక సాయం మీ కష్టాన్ని తీర్చలేదని తెలుసు. కానీ ప్రభుత్వాన్ని అంకుశంతో గుచ్చినట్లు పని చేస్తుంది. ఓట్లు పోతాయనే భయంతోనైనా వాళ్లు మీకు నష్టపరిహారం అందిస్తారు.
గుజరాత్, కేరళ రాష్ట్రాల తరహాలో జెట్టీలు నిర్మిస్తాం
మన రాష్ట్రంలో 970 కిలోమీటర్లకు పైగా తీర ప్రాంతం ఉంది. ఇంత పెద్ద ఎత్తున తీర ప్రాంతం ఉన్నా ప్రతి ఏడాది వేలాది మంది మత్స్యకారులు గుజరాత్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు వలసలు పోతున్నారు. కేరళ, గుజరాత్ రాష్ట్రాల్లో ప్రతీ 30 కిలోమీటర్లకు ఒక జెట్టీ ఉంటుంది. మన దగ్గర ఎందుకు నిర్మించలేదు? ఏడాదికి రూ. 16 వేల కోట్ల ఆదాయం ప్రభుత్వ ఖజానాకు అందిస్తున్న మత్స్యకారులు దేహీ అనే పరిస్థితి ఎందుకు నెలకొంది. మీకు అండగా నిలబడే సమూహం కావాలి. మిమ్మల్ని కుటుంబ సభ్యులుగా చూసుకోవాలి. జనసేన పార్టీ నుంచి మొట్ట మొదట ఏర్పాటు చేసిన విభాగం మత్స్యకార వికాస విభాగం. మత్స్యకార సోదరుల జీవితాల్లో వెలుగులు నింపడానికి ఈ విభాగాన్ని ఏర్పాటు చేశాం. మనం అధికారంలోకి వస్తే గుజరాత్, కేరళ తరహాలో ప్రతీ 30 కిలోమీటర్లకు ఒక జెట్టీని నిర్మిస్తాం.
రూ. 15 లక్షలు ఇస్తామని చెప్పి రూ. 5 లక్షలు చేతిలో పెట్టారు
రూ. 3502 కోట్లతో తీర ప్రాంతాల్లో హార్బర్లు నిర్మిస్తామని వైసీపీ నాయకులు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లు అవుతున్నా ఒక్క అడుగు ముందుకు పడలేదు. జాతీయ మత్స్యకార యోజన పథకం కింద రూ. 1850 కోట్లతో 37 ప్రాజెక్టులు రాష్ట్రానికి కేటాయిస్తే వాటి నిర్మాణం అతీగతీ లేదు. వైసీపీ నాయకులు ఓట్లు కోసం మీ ఇంటికి వస్తే ఈ ప్రాజెక్టులు, వాళ్లు చేసిన హామీ లు ఏమయ్యాయని నిలదీయండి. అప్పుడు ఈ రూపాయి పావల ప్రభుత్వాన్ని నమ్మాలో వద్దో మీరే నిర్ణయించుకోండి. ఇప్పుడు కూడా బోట్లు దగ్ధమై రూ. 25 కోట్ల నష్టం వాటిల్లితే ప్రతి ఒక్కరికీ రూ. 15 లక్షలు ఇస్తామని చెప్పి రూ. 5 లక్షలు చేతిలో పెట్టారు. ప్రభుత్వం ఒక వైపు 80 శాతం నష్ట పరిహారం ఇచ్చామని చెబుతోంది. మత్స్యకారులకు మాత్రం ఆ డబ్బు చేరలేదు. మిగతా డబ్బు ఏమైపోయిందో అందరూ ఆలోచించాలి.
పని చేసేవాడు ప్యాలస్ లు చూసుకోడు
ముఖ్యమంత్రికి ఎన్ని ప్యాలెస్ లు ఉన్నా సరిపోవడం లేదు. తాజాగా రుషికొండపై రూ. 451 కోట్ల ప్రజాధనంతో మరో రాజ ప్రసాదం నిర్మించుకున్నారు. నిజంగా పనిచేయాలి అనుకున్న వాడు గాంధీ గారిలా ఆశ్రమం నుంచైనా పని చేస్తాడు. ముఖ్యమంత్రి ఉండాలి అనుకుంటే విశాఖలో సర్క్యూట్ హౌస్ ఉంది. చాలా ప్రభుత్వ భవనాలు ఖాళీగా ఉన్నాయి. దానిలో ఉండి పని చేయొచ్చు. కానీ ఈయన విలాసాల కోసం రూ.451 కోట్లు ఖర్చే చేశారు. ముఖ్యమంత్రి తన విలాసాలకు కాకుండా మత్స్యకారుల అభ్యున్నతికి ఈ మొత్తం ఖర్చు చేసి ఉంటే దాదాపు 10 వేల మంది మత్స్యకారులకు ఉపాధి లభించేది. ముఖ్యమంత్రి తన జేబు నుంచి ఏనాడూ రూపాయి తీయలేదు. ఎవడి జేబు ఏలా ఖాళీ చేయాలని చూస్తాడు తప్ప డబ్బులు తీసి ఇచ్చే మనిషి కాదు. నేను ఇప్పుడు ఇస్తున్న ఈ రూ. 30 లక్షలు నా కష్టార్జితం. చాలా మంది కష్టపడి పార్టీకి ఇచ్చిన విరాళాలు. ఎవరిని దోచుకున్నవి కాదు.
ఛాన్స్ తీసుకోకూడదనే పొత్తు
రాష్ట్రంలో త్రిముఖ పోటీ జరిగితే వైసీపీ లాభపడే ప్రమాదం ఉంది. వైసీపీకి ఒకసారి ఛాన్సు ఇచ్చినందుకు రాష్ట్రం పదేళ్లు వెనక్కి వెళ్లింది. మరో ఛాన్సు ఇస్తే మన జీవితాలు నాశనమవుతాయి. హార్బర్ లో జరుగుతున్న దాడులే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతాయి. చీకటి మూకలు, దండుపాళ్యం గ్యాంగులు రెచ్చిపోతాయి. ఈ సారి 5 వేల ఓట్లుతో ఓడిపోయాం అనే మాట వినపడకూడదు. 25 వేలు 50 వేల మెజార్టీతో గెలిచాం అనే మాట వినబడాలి. అందుకే పొత్తు పెట్టుకున్నాం. వచ్చేది కచ్చితంగా జనసేన – టీడీపీ ప్రభుత్వమే. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే హార్బర్ పరిధిలో మెరైన్ పోలీసింగ్ , ఫ్లడ్ లైట్స్ ఏర్పాటు చేస్తాం. మత్య్సకార మహిళపై దాడులు జరగకుండా భద్రత కలిపించే బాధ్యత తీసుకుంటాం.
జనసేన అంటే ఎందుకంత భయం?
నేను ఎప్పుడు విశాఖ వచ్చిన ప్రభుత్వం ఏదో ఒక అడ్డంకి సృష్టిస్తోంది. గత ఏడాది ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి విశాఖ వచ్చినప్పుడు పోలీసులతో నిర్భందించారు. ఇప్పుడు మత్స్యకారులకు అండగా ఉండేందుకు వస్తుంటే నా ఫ్లైట్ ను విమానాశ్రయంలో లేకుండా చేశారు. నా పర్యటన క్యాన్సిల్ అయ్యిందని చెప్పి ఒక ఇంటిలిజెన్స్ ఆఫీసర్ నా ఫ్లైట్ ను విమానాశ్రయం నుంచి పంపిచేశాడు. జనసేన అంటే ఎందుకంత భయం?
ఈ రోజు నేను మాట ఇస్తున్నాను. మత్స్యకారులు ఎంత గుండె ధైర్యంతో సముద్రంపై వేటకు వెళ్లి మత్స్య సంపదను తీసుకొస్తారో.. మీ బంగారు భవిష్యత్తు కోసం నేను కూడా ఈ కుళ్ళిన రాజకీయాలను కడిగి మీకు బంగారు భవిష్యత్తు ఇస్తాను. మనస్ఫూర్తిగా మమ్మల్ని నమ్మండి మీకు న్యాయం జరిగే వరకు పనిచేస్తాను. సంపద అంతా కొందరి చేతుల్లో ఉండిపోయింది. అదంతా వెనుకబడ్డ కులాలకు అందాలి” అన్నారు.