Suryaa.co.in

Telangana

తెలంగాణలో టీడీపీకి మళ్లీ మంచిరోజులు

– కష్టించి పనిచేయండి.. విజయం మనదే
– టీడీపీ అధినేత చంద్రబాబు జోస్యం

తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి మళ్లీ మంచిరోజులు రానున్నాయని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు జోస్యం చెప్పారు. ఆయన హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చి, వివిధ జిల్లాల నుంచి వ చ్చిన కార్యకర్తలతో గంట సేపు గడిపారు. తనను క లవడానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారితో బాబు మాట్లాడి, నేతల క్షేమసమాచారాలు తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, తెలంగాణలో మళ్లీ టీడీపీకి శుభదినాలు రానున్నాయని చెప్పారు. కార్యకర్తలు కష్టపడి పనిచేసి, పార్టీని బలోపేతం చేసిన తర్వాత, మన సత్తా ఏమిటో ప్రత్యర్థులకు తెలుస్తుందన్నారు. హైదరాబాద్‌లో టీడీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి అడుగడుగునా కనిపిస్తోందన్నారు. ఇప్పుడు దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ అయిందంటే, దానికి టీడీపీ ప్రభుత్వం వేసిన బీజమే కారణమని స్పష్టం చేశారు. కాసాని జ్ఞానేశ్వర్ నాయకత్వంలో తెలంగాణలో పార్టీ బాగా పుంజుకుంటోందని అభినందించారు. ఇంటింటికీ టీడీపీ విజయాలను ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు.

రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ.. తెలంగాణలో టీడీపీకి ప్రజాస్పదన వెల్లువెత్తుతోందన్నారు. ప్రస్తుత పరిస్థితులు గమనిస్తున్న ప్రజలు, టీడీపీ ప్రభుత్వ పాలనను గుర్తు చేసుకుంటున్నారని చెప్పారు. రానున్న రోజుల్లో తెలంగాణలో చంద్రబాబు ప్రోత్సాహంతో, టీడీపీ చక్రం తిప్పడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పదవులు తీసుకున్న వారంతా ప్రజల్లోకి వెళ్లి, వారి సమస్యల కోసం పోరాటాలు చేయాలని సూచించారు.

టీడీపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బక్కని నర్శింహులు, పొలిట్‌బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, అరవిందకుమార్‌గౌడ్, జ్యోత్న్స, మాజీ ఎమ్మెల్యే-రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన, తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షురాలు భవనం షకీలారెడ్డి, కార్యనిర్వహక కార్యదర్శి మండూరి సాంబశివరావు, మీడియా కన్వీనర్ ప్రకాష్‌రెడ్డి, అధికార ప్రతినిధులు సూర్యదేవర లత, డాక్టర్ ఎంఎస్‌రావు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE