– పెడన చేనేత కుటుంబం ఆత్మహత్య బాధాకరం
– టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు
ప్రభుత్వం ప్రచార ఆర్భాటమే తప్ప.. ప్రజల్ని ఉద్దరించే పనులు ఏమాత్రమూ లేవని చెప్పడానికి కృష్ణా జిల్లా పెడనలో అప్పుల బాధతో కుటుంబ ఆత్మహత్యే నిదర్శనం. వయసు మళ్లిన తల్లిదండ్రులతో పాటు పాతికేళ్లు కూడా నిండని యువకుడు కూడా అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరం. చేనేతలను ఉద్దరించేశామంటూ ప్రభుత్వం ప్రచారం చేసుకోవడం తప్ప.. చేనేతలకు చేసిందేమీ లేదనడానికి తాజా ఘటనే నిలువెత్తు సాక్ష్యం.
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చేనేతలకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు, రాయితీలు, రుణాలు, వడ్డీ రాయితీలు అందేవి. సొంత మగ్గం లేకపోయినా.. ప్రభుత్వం తరఫున రిబేటు సహా సగటున ఒక్కో కార్మికుడికి ఏడాదికి రూ.లక్ష వరకు సహాయం అందేది. నూలు, రంగులు ఇతర వస్తువులపై సబ్సిడీలు అందేవి. ఆప్కో ద్వారా అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తే నేడు నిలిపివేశారు. మరోవైపు.. గతంలో స్కూల్ పిల్లలకు ఇచ్చే యూనిఫాం చేనేత కార్మికులు, చేనేత సొసైటీల నుండి తీసుకోవడంతో వారికి సంవత్సరం మొత్తం పని దొరికేది.
కానీ.. నేడు జగన్ రెడ్డి తన కాసుల కక్కుర్తికి చేనేతలకు ద్రోహం చేసేలా యూనిఫాంను పవర్ లూమ్స్ నుండి కొనుగోలు చేసేలా ఉత్తర్వులిచ్చి చేనేతల పొట్ట కొట్టారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా కరోనా వలన చేనేత కార్మికులు నేసిన వస్త్రాలు కొనుగోళ్లకు నోచుకొక కార్మికులు అవస్థలు పడుతున్నా.. కొనుగోలు చేయాలనే కనీస ఆలోచన కూడా ప్రభుత్వం చేయడం లేదు. జగన్ రెడ్డి ప్రభుత్వ అతి ప్రచారం, అసమర్ధ విధానాలతో చేనేతల్ని అడ్డంగా మోసం చేస్తూ.. ఉద్దరించేస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు. పెడన ఆత్మహత్య ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. బాధిత కుటుంబానికి అండగా నిలవాలి.